జూనియర్ ఎంట్రీ అప్పుడే …?

తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల ప్రచారం తరువాత రాజకీయాలకు దూరం అయ్యారు. ఆయన దూరం జరిగారు అనే కన్నా ఒక వ్యూహం [more]

Update: 2019-11-17 13:30 GMT

తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల ప్రచారం తరువాత రాజకీయాలకు దూరం అయ్యారు. ఆయన దూరం జరిగారు అనే కన్నా ఒక వ్యూహం ప్రకారం ఆయన్ను పక్కకు నెట్టారు అనొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ను ఏరికోరి ప్రచారానికి తెచ్చుకున్న చంద్రబాబు నాటి ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత తమ పార్టీ అనుకూల పత్రిక ఈనాడులో ఒక కథనం రాయించారని ప్రచారం నడిచింది. ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించిన చోటల్లా టిడిపి ఓటమి పాలు అయ్యిందన్నది ఆ కథనం సారాంశం. అది జూనియర్ ఎన్టీఆర్ మిత్రులకు నాటినుంచి మనస్థాపం కలిగించింది. తన కుమారుడు లోకేష్ కి లైన్ క్లియర్ చేసి టిడిపి పై ఆధిపత్యం అప్పగించేందుకు చంద్రబాబు పన్నాగం పన్ని అవసారానికి జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేశారన్నది జనంలో వున్న టాక్ కూడా. అదే రీతిలో మొన్నటి ఎన్నికల్లో సైతం హరికృష్ణ కుమార్తె కు టికెట్ ఇచ్చి తరువాత ఆమె ను పట్టించుకున్న పాపానికి పోలేదన్నది పార్టీ సర్కిల్స్ లో వున్న ప్రచారమే.

ఆ విషయాన్నీ నిర్ధారిస్తున్న వంశీ …

వల్లభనేని వంశీ టిడిపికి గుడ్ బై చెప్పాకా టిడిపి శ్రేణులు యధాశక్తి ఆయనపై తమ స్టైల్ లో విరుచుకుపడ్డాయి. లోకేష్ నుంచి రాజేంద్ర ప్రసాద్ వరకు అంతా వ్యక్తిగతంగా వంశీని గట్టిగానే టార్గెట్ చేశారు. అయితే వారు ఊహించినదానికి భిన్నంగా వల్లభనేని కౌంటర్ ఎటాక్ ఘాటుగా చేయడంతో బాటు బూతులు తగిలించడంతో టిడిపి అవాక్కయ్యింది. ముఖ్యంగా వంశీ చినబాబు లోకేష్ ను టివి చర్చల్లో పప్పు పప్పు అని పదేపదే ప్రస్తావించడమే కాదు ఎందుకు పనికి రాని దద్దమ్మ, చవట వాటితో పాటు మంగళగిరి లో గెలవలేని వాడు నాయకుడు ఎలా అంటూ కడిగేశారు.

పోలికే లేదంటూ….

అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ కి లోకేష్ కి పోలిక లేదని నక్క లోకేష్ అయితే నాగలోకం ఎన్టీఆర్ అంటూ తనదైన శైలిలో సెటైర్లు విసురుతూ పలు ఉపమానాలు సైతం చెప్పుకొచ్చేశారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా అనేక సంవత్సరాలుగా నడుస్తున్న తెరవెనుక భాగోతాలు వంశీ ఆవిష్కరించి పార్టీ శ్రేణులను డీలా పడేలా దెబ్బకొట్టారు. హరికృష్ణ కుటుంబానికి చంద్రబాబు చేసిన ద్రోహాన్ని పూసగుచ్చినట్లు టివి డిబేట్లలోనూ ప్రెస్ మీట్ల లోను చెప్పుకొస్తూ పసుపు కోటకు తూట్లు పొడిచారు. పార్టీపై జూనియర్ ఎన్టీఆర్ కు పట్టు పెరుగుతుందనే అభద్రతాభావంతోనే ఎన్టీఆర్ దూరం పెట్టారని నిర్ధారించారు.

ఎంట్రీ అప్పుడేనా …?

ఆ సందర్భంలోనే 2024 లో టిడిపి ఎన్నికల్లో పోటీ చేస్తుందని 2029 నాటికి ఎన్నికల బరిలోనే లేకుండా పోతుందని జోస్యం చెప్పేశారు వంశీ. అంటే 2029 నాటికి చంద్రబాబు వయసు 80 దాటి 90 కి దగ్గరలో వుంటారు. లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకించే టిడిపి లోని వారంతా జూనియర్ ఎన్టీఆర్ నేతృత్వంలో సమాయత్తం అయ్యి తెలుగుదేశాన్ని బతికించుకునే తిరుగుబాటు తధ్యమన్న లెక్కలు ఇప్పటికే గట్టిగా ప్రచారం లో వున్న మాట. ఇదే విషయాన్నీ వంశీ నర్మగర్భంగా ప్రస్తావించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అందుకే ఇద్దరూ….

అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కి దాదాపు సినిమా మోజు కూడా పూర్తి అయ్యి పూర్తి స్థాయి రాజకీయాలవైపు దృష్టి పెడతారని లెక్కేస్తున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత నమ్మకస్తులైన గుడివాడ ఎమ్యెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటివారు అందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ ఇప్పటినుంచి చేస్తున్నట్లు కనిపిస్తుందంటున్నారు. చంద్రబాబు తో ముందే విభేదించిన కొడాలి నాని తన మిత్రుడు వంశీ ని కూడా వైసిపి లోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు. గాల్లో దీపంలా వున్న టిడిపి లో వుండి లోకేష్ వంటి ఇష్టం లేని వారి పల్లకిని మోయడం జూనియర్ ఎన్టీఆర్ కి ద్రోహం చేసినట్లే అవుతుందని జై జగన్ అనడమే దీనికన్నా బెటర్ అన్న వ్యూహంలో మరో పదేళ్లు వైసిపి లో ఉండటమే కరెక్ట్ అని బాబు కి బై చెప్పారన్నది బాగా నడుస్తున్న చర్చ. మరి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News