యూజ్ అండ్ త్రో నేనా?

అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. ఈ 23 మందిలో ఒక్క అద్దంకి ఎమ్మెల్యే గొట్టి [more]

Update: 2019-09-13 13:30 GMT

అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. ఈ 23 మందిలో ఒక్క అద్దంకి ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్ తప్ప మరెవరూ గత ఎన్నికల్లో గెలవలేదు. కొందరికి చంద్రబాబు టిక్కెట్లు ఇవ్వలేదు. టిక్కెట్లు ఇచ్చినా ఓటమి పాలయిన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పార్టీ పటిష్టత కోసం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో చేర్చుకుంటే ఇప్పుడు అధికారం కోల్పోగానే వారిలో చాలామంది పార్టీకి దూరంగానే ఉంటున్నారు.

పోలోమంటూ చేరి…..

2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసే తాము పార్టీలోకి వెళుతున్నామని జంప్ అయ్యే ప్రతి ఎమ్మెల్యే అప్పట్లో ప్రకటన చేసి వెళ్లిపోయారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. మంత్రిపదవి దక్కించుకున్న నలుగూరు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ 23 మంది అప్పట్లో అధికారికంగా పార్టీలో చేరినప్పటికీ వారిని లోకల్ లీడర్లు దరి చేరనీయలేదు. అయితే అప్పట్లో ఎమ్మెల్యే కావడంతో కొంత సర్దుబాటును చేసుకోగలిగారు.

ఎవరూ గెలవక……

2019 ఎన్నికలకు వచ్చేసరికి ఎమ్మెల్యేలు చెప్పినట్లు ప్రజలకు ఏపీలో అభివృద్ధి కన్పించలేదులా ఉంది. అందుకే టీడీపీ ఘోర పరాజయం పాలయింది. ఇప్పుడు ఆ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. చంద్రబాబు ఒక్కరే పోరాటం చేస్తున్నారు. టిక్కెట్లు పొంది, అధికారంలో ఉన్నప్పుడు అనుభవించిన నేతలు కొందరు సైడయి పోయారు. ఈ 23 మందిలో కూడా కొందరు పార్టీని వీడారు. ఉన్న వారిలో ఎక్కువ మంది పసుపు జెండాకు దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి, పాలపర్తి డేవిడ్ రాజులు తిరిగి వైసీపీ గూటికి చేరారు.

రెంటికీ చెడ్డ రేవడి….

వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో గిడ్డి ఈశ్వరి, కలమల వెంకటరమణ, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, అశోక్ రెడ్డి, సునీల్ కుమార్, జయరాములు, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మణిగాంధీ, చాంద్ భాషా వంటి నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీని వీడి రావడం, అప్పటికే టీడీపీలో నేతలు ఉండటంతో వీరి పని రెంటికి చెడ్డ రేవడిగా తయారయింది. అందుకే ఇప్పుడప్పుడే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ఆలోచన వారు చేయడం లేదు. భవిష్యత్తులో అవకాశం ఉన్న పార్టీలోకే వెళదామని నిర్ణయించుకున్నట్లుంది. ఒకరకంగా 23 మందిలో ఎక్కువ మంది రాజకీయాలకు దూరంగా ఉంటుండటం విశేషం. ఆ నియోజకవర్గాల్లో తిరిగి పాత టీడీపీ నాయకులే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. వీరిని చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.

పాడేరు – గిడ్డి ఈశ్వరి
పాతపట్నం – కలమల వెంకట రమణ
బొబ్బిలి – సుజయ కృష్ణా రంగారావు
అరకు – సర్వేశ్వర రావు(మృతి చెందారు)
ప్రత్తిపాడు – వరపుల సుబ్బారావు
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
రంపచోడవరం – వంతల రాజేశ్వరి
పామర్రు – ఉప్పులేటి కల్పన
విజయవాడ – వెస్ట్ జలీల్ ఖాన్
ఎర్రగొండపాలెం – డేవిడ్ రాజు
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
కందుకూరు – పోతుల రామారావు
గిద్దలూరు – అశోక్‌ రెడ్డి
గూడురు – సునీల్ కుమార్
బద్వేల్ – జయరాములు
జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
ఆళ్ళగడ్డ – భూమా అఖిల ప్రియ
శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి
కర్నూలు – ఎస్వీ మోహన్ రెడ్డి
కోడుమూరు – మణిగాంధీ
కదిరి – చాంద్‌ బాషా
పలమనేరు – అమర్‌ నాథ్‌ రెడ్డి

Tags:    

Similar News