ఇద్దరికీ ఇప్పట్లో ఛాన్సే లేదటగా?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన బీజేపీ నేత‌లు కొంద‌రు ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. వీరిలో జీవీఎల్ న‌ర‌సింహారావు, ముర‌ళీధ‌ర్‌రావు, రామ్‌మాధ‌వ్ వంటివారు కీల‌కంగా [more]

Update: 2020-11-06 00:30 GMT

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన బీజేపీ నేత‌లు కొంద‌రు ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. వీరిలో జీవీఎల్ న‌ర‌సింహారావు, ముర‌ళీధ‌ర్‌రావు, రామ్‌మాధ‌వ్ వంటివారు కీల‌కంగా ఉండ‌గా.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన గ‌రికిపాటి రామ్మోహ‌న్‌రావు వంటి నాయ‌కులు కూడా ఒక‌రిద్దరు ఉన్నారు. వీరంతా కూడా జాతీయ‌స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని అనుకున్నారు. వీరిలో కొంద‌రికి రాజ్యస‌భ స‌భ్యత్వాలు ముగిసిపోయాయి. దీంతో మ‌ళ్లీ బీజేపీ అధిష్టానం క‌రుణిస్తుంద‌ని, త‌మ‌కు మ‌ళ్లీ పెద్దల స‌భ‌లోకి వెళ్లే ఛాన్స్ ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. మ‌రి కొంద‌రు కీల‌క నేత‌లు త‌మ‌కు ఏకంగా కేంద్ర కేబినెట్లో చోటు ద‌క్కుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు.

ఉత్తరాదిన ఎన్నికలుండటంతో….

అయితే, ఇప్పుడు బీజేపీ అధిష్టానం వ్యూహం మ‌రోలా ఉంది. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమ‌వుతోంది. బిహార్ ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే త్వర‌లోనే ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు ఉన్నాయి. త‌ర్వాత అత్యంత కీల‌క‌మైన యూపీ ఎన్నిక‌ల‌కు కూడా రంగం సిద్ధమ‌వుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల‌కు ప్రాధాన్యం ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో తాము గెలుచుకోగలిగిన ఎనిమిది సీట్లకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ ఎనిమిది మందిలో తాము ఖ‌చ్చితంగా ఉంటామ‌ని రాష్ట్రానికి చెందిన రామ్‌మాధ‌వ్‌, ముర‌ళీధ‌ర్ కూడా అనుకున్నారు.

కీలకంగా ఉన్నా….

దీనికి కూడా రీజ‌న్ ఉంది. ఇటీవ‌లే వీరిని.. పార్టీలో ప‌ద‌వుల నుంచి తొల‌గించారు. దీంతో వీటిక‌న్నా పెద్ద ప‌ద‌వులు క‌ట్టబెడ‌తార‌ని అనుకున్నారు. వీరిద్దరు ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో బీజేపీ త‌ర‌పున కీల‌కంగా ఉన్నారు. ముర‌ళీధ‌ర్ రావు నిన్నమొన్నటి వ‌ర‌కు క‌ర్నాట‌క పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. క‌ర్నాట‌క‌లో పార్టీ ప‌టిష్టం వెన‌క ముర‌ళీధ‌ర్‌రావు కొన్ని సంవ‌త్సరాలుగా ఎన్నో వ్యూహాలు ప‌న్నుతున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావ‌డం వెన‌క రామ్‌మాధ‌వ్ ప్లానింగ్ ఉంది. క‌శ్మీర్‌లో పార్టీ బ‌లోపేతం కోసం కూడా రామ్‌మాధ‌వ్ ఎంతో చేశారు.

అందుకే పక్కన పెట్టి……

ఈ క్రమంలోనే రాజ్యస‌భ సీట్లు వారిని వ‌రిస్తాయ‌ని అనుకున్నారు. కానీ, వీరికి ఎవ‌రికీ కూడా పార్టీ ఛాన్స్ ఇవ్వలేదు. ఇక‌, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వీరికే ఛాన్స్ ద‌క్కక‌పోతే.. ఇక‌, గ‌రికిపాటి రామ్మోహ‌న్ వంటివారికి ఛాన్స్ ఎక్కడ ల‌భిస్తుంది. సో.. మొత్తానికి తెలుగు రాష్ట్రాల నేత‌ల‌పై బీజేపీ పెద్ద దెబ్బే వేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ‌ల‌తో బీజేపీకి పెద్దగా ప‌నిలేదు. పైగా ఇక్కడ ఎలాంటి ఎన్నిక‌లు కూడా లేవు. ఇక్కడ ఖ‌చ్చితంగా పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఆశ‌లు కూడా జాతీయ నాయ‌క‌త్వానికి లేవు. ఈ నేప‌థ్యంలోనే ఇక్కడివారిని ప‌క్కన పెట్టార‌ని అంటున్నారు.

Tags:    

Similar News