అంత సులువుగా వదులుకోరట

అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వైపు యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. ఆయన అగ్రరాజ్యాన్ని ఎలా ముందుకు నడిపిస్తారు, అమెరికాకు అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను [more]

Update: 2020-11-16 16:30 GMT

అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వైపు యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. ఆయన అగ్రరాజ్యాన్ని ఎలా ముందుకు నడిపిస్తారు, అమెరికాకు అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటారన్న అంశంపై అంతటా చర్చ జరుగుతోంది. దేశ చరిత్రలోనే అతి పెద్ద వయస్కుడైన అధ్యక్షుడు అనుసరించే విధానాలు, అవి తమపై చూపే ప్రభావం గురించి అంతర్గతంగా అన్ని దేశాలూ సమీక్షించుకుంటున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా, రష్యా వంటి పెద్ద దేశాలు ఇప్పటికే దాదాపుగా ఒక అవగాహనకు వచ్చాయి. అయితే అమెరికాకు దాని ప్రయోజనాలే ముఖ్యం. అంతేతప్ప ఇతర దేశాల కోసం తన ప్రయోజనాలను పణంగా పెట్టదు. ఇప్పటివరకు దేశాధినేతలూ ఇదే విధానంతో ముందుకెళ్లారు. బైడెన్ ఇందుకు మినహాయింపేమీ కాదు. అయినప్పటికీ ఆయనకంటూ ఒక విధానం ఉండి తీరుతుంది.

వ్యక్తులతో సంబంధం లేకుండా….

భారత్ కు సంబంధించినంతవరకు పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదన్నది దౌత్య నిపుణుల అభిప్రాయం. ఉభయ దేశాల సంబంధాలు వ్యవస్థీకృతమయ్యాయి. వ్యక్తులతో సంబంధం లేకుండా అవి కొనసాగుతూనే ఉంటాయి. ఇందుకు నిదర్శనం అక్టోబరు ఆఖరులో అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల భారత్ పర్యటన. ఒక పక్క దేశం ఎన్నికల హడావిడిలో ఉన్నప్పటికీ ఇద్దరు కీలక మంత్రులను పర్యటనకు పంపడం భారత్ కు అగ్రదేశం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం. బైడెన్ పరంగా చూస్తే భారత్ వ్యవహారాలు ఆయనకు కొట్టిన పిండి. బరాక్ ఒబామా హయాంలో 2008 నుంచి 2016 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన తెరవెనక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన కుడి భుజమైన ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ భారతీయ మూలాలున్న మహిళ. మొదటినుంచి ప్రవాస భారతీయులు డెమొక్రటిక్ పార్టీకి అనుకూలురన్న అభిప్రాయం ఉంది. తాజా ఎన్నికల్లో వారు డెమొక్రటిక్ పార్టీ వైపు నిలబడిన విషయం తెలిసిందే. బైడెన్ కు భారత్ లో బంధువులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు న్యూఢిల్లీ పట్ల స్నేహపూరితంగా ఉంటారు. భారత్ కు ఎంత దగ్గరవుతారనేది పక్కన పెడితే దూరమయ్యే అవకాశం ఎంతమాత్రం లేదన్నది సుస్పష్టం.

చైనా పట్ల అంత కఠినంగా….

మానవహక్కుల ఉల్లంఘన, కశ్మీర్ సమస్యపై న్యూఢిల్లీకి, వాషింగ్టన్ మధ్య కొంత తేడా లేకపోలేదు. జమ్ము-కశ్మీర్ లో 370వ అధికరణ రద్దును స్వయంగాకమలా హారిస్ వ్యతిరేకించిన సంగతిని విస్మరించలేం. నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ నకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ ఆయన గెలుపును కోరుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసమే అమెరికాలో ‘హౌడీ-మోడీ’ అహమ్మదాబాద్ లో ‘నమస్తే ట్రంప్’కార్యక్రమాలు నిర్వహించారన్న వాదనలను తోసిపుచ్చలేం. చైనాను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ట్రంప్ భారత్ కు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ విషయంలో బైడెన్ ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి. వామపక్ష భావాలు గల బైడెన్ చైనా పట్ల ట్రంప్ లా కఠినంగా ఉండరన్న వాదన ఉంది. అయితే అదే సమయంలోతనకు దీటుగా ఎదుగుతున్న చైనాను నియంత్రించడం బైడెన్ ముందున్న కర్తవ్యం. ఈ విషయంలో అమెరికన్ల వైఖరికి భిన్నంగా ముందుకుపోలేరు.

విస్మరిస్తుందనుకోలేం కాని…..

కమలా హారిస్ ఎంతగా భారతీయ మూలాలున్న వ్యక్తి అయినప్పటికీ అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించలేరు. ట్రంప్ కు భిన్నంగా వీసాల మంజూరులో ఒకింత ఉదారంగా వ్యవహరించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. పాకిస్థాన్ పట్ల కూడా బైడెన్ విధానంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. మారిన పరిస్థితుల్లో భారత్ ను విస్మరించే పరిస్థితి ఏ దేశానికీ లేదు. అమెరికాకు అసలే లేదు. అందువల్ల చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఉభయ దేశాల సంబంధాల్లో గుణాత్మకమైన మార్పు ఉండదు. అంతర్జాతీయ పరిణాామల నేపథ్యంలో భారత్ ను కలుపుకొని పోవాల్సిన అవసరం అమెరికాకు ఉంది. ఛైనాను నియంత్రించాల్సిన అవసరం ఇద్దరికీ ఉంది. స్థూలంగా చూస్తే రెండు దేశాలూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల న్యూఢిల్లీ- వాషింగ్టన్ మరింత దగ్గరయ్యే అవకావశం ఉంది.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News