ఆయన ఆప్షన్ అదేనట

ఆప్ ఢిల్లీలో సాధించిన విజయం ఆషామాషీది కాదు. ఆ రీసౌండ్ ఇపుడు దేశమంతా వినిపిస్తోంది. దాంతో ఆప్ రాజకీయ విధానాలను జనం నచ్చుకుంటున్నారని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా [more]

Update: 2020-02-17 05:00 GMT

ఆప్ ఢిల్లీలో సాధించిన విజయం ఆషామాషీది కాదు. ఆ రీసౌండ్ ఇపుడు దేశమంతా వినిపిస్తోంది. దాంతో ఆప్ రాజకీయ విధానాలను జనం నచ్చుకుంటున్నారని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా అవినీతికి దూరంగా ఉంటూ ప్రజలకు ఓటు వేసేందుకు లంచంగా నోట్లను పంచకుండా కేవలం వారికి చేసే మేలునే ముందు పెట్టి ఓట్ల కోసం అర్ధించడం అంటే ఇది వినూత్న రాజకీయమే మరి. ఓ సాధారణ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో ఈ రకంగా వరస విజయాలు సాధించడం పాలనలో కొత్తదనం తీసుకురావడం నిజంగా మేధావులు విద్యావంతుల్లో దేశవ్యాప్తంగా చర్చగా ఉంది. దాంతో ఏపీలో కూడా ఆప్ రాజకీయాన్ని విస్తరించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నార‌ట.

ఆయనే ముందు…

ఆంధ్ర రాజకీయాల్లో కూడా ఆప్ కంటే ముందు ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్ 2009 ఎన్నికలకు ముందు లోక్ సత్తా పార్టీ పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేశారు. పది శాతం ఓట్ల షేర్ కూడా ఆ పార్టీకి దక్కడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. అయితే సీట్లపరంగా చూసుకుంటే ఆయన ఒక్కరే గెలిచారు. ఇక ఆ తరువాత పాలపొంగులా ఆ ఊపు చల్లారిపోయింది. లోక్ సత్తా నుంచి 2014 ఎన్నికల్లో పార్లమెంట్ కి పోటీ చేసిన జయప్రకాష్ తాను ఓడిపోవడంతో పూర్త్రిగా తగ్గిపోయారు.

జేడీ అంతేగా…?

ఇక మరో ఐపీఎస్ అధికారి, సీబీఐ జేడీగా ప్రసిధ్ధి చెందిన లక్ష్మీనారాయణ సైతం 2019 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టాలనుకున్నారు. అయితే చివరి క్షణంలో ఆయన మనసు మార్చుకుని జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే జేడీని విశాఖ ప్రజలు బాగానే ఆదరించారు. రెండు లక్షల ఎనభై వేల పై చిలుకు ఓట్లు ఆయనకు దక్కాయంటే ఇది గొప్ప విషయమే. ఈ నేపధ్యంలో రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్న జేడీ జనసేనకు ఈ మధ్యనే గుడ్ బై కొట్టేశారు. తన ఆలోచనలకు తగిన పార్టీ కోసం అన్వేషిస్తున్న ఆయనకు ఆప్ ఇపుడు సరైన ఆప్షన్ గా కనిపిస్తోందట.

పగ్గాలు అందుకుంటారా..?

ఆప్ విజయంతో తమ పార్టీ విధానాలపై ధీమా పెరిగిన కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలనుకుంటున్నారుట. దాంతో ఏపీకి సంబంధించి జేడీకి పార్టీ పగ్గాలూ అప్పగిస్తారని అంటున్నారు. జేడీ సైతం విద్యాధికుడు, ఉన్నతాధికారి కావడం, ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉండదంతో ఆయన ఆప్ ఏపీ సారధిగా కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతారని అంటున్నారు. ఇక ఏపీలో రాజకీయాలు చూసుకుంటే టీడీపీ, వైసీపీ మధ్యనే నడుస్తున్నాయి. పైగా రెండు పార్టీలు వ్యక్తిగత వైరాలకు పోతూ రాష్ట్ర అభివృధ్ధి విషయంలోనూ కలసిరావడంలేదంటున్నారు.

ఛాన్స్ కోసమా…?

మరో వైపు చూసుకుంటే పవన్ జనసేన నీరసించిపోయింది. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఎప్పటికీ ఎత్తిగిల్లే సూచనలు లేవు. దాంతో తటస్థవాదులు, విద్యావంతులు, మేధావులు సైతం కొత్త పార్టీ వస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. దానికి నాందీ ప్రస్తావనగా జేడీ ఆప్ పగ్గాలు పుచ్చుకుంటే ఢిల్లీ విజయం ప్రభావం ఇక్కడ కూడా కొంతవరకైనా ఉంటుందని, ఆ మీదట జేడీ తన చరిష్మాతో పార్టీని బలంగా నిర్మాణం చేస్తే 2024 నాటికి ఒక రూపు దిద్దుకునే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు, చూడాలి మరి.

Tags:    

Similar News