జేసీ సోదరుల కల నెరవేరేనా..?

రాష్ట్ర రాజకీయాల్లో.. ప్రత్యేకించి అనంతపురం రాజకీయాల్లో జేసీ కుటుంబానికి ప్రత్యేక శైలి. వివాదాలను వెంట పెట్టుకొని తిరిగే జేసీ సోదరులు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ను [more]

Update: 2019-04-30 06:30 GMT

రాష్ట్ర రాజకీయాల్లో.. ప్రత్యేకించి అనంతపురం రాజకీయాల్లో జేసీ కుటుంబానికి ప్రత్యేక శైలి. వివాదాలను వెంట పెట్టుకొని తిరిగే జేసీ సోదరులు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత కూడా వారి హవా కొనసాగింది. ఆ మాటకోస్తే ఇంకా పెరిగిందనే చెప్పొచ్చు. గతంలో జేసీ దివాకర్ రెడ్డి ఒక్కరే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండగా ఇప్పుడు ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. దివాకర్ రెడ్డి అనంతపురం నుంచి పార్లమెంటుకు, ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి అసెంబ్లీకి విజయం సాధించారు. ఇప్పుడు ఈ సోదరులిద్దరూ రాజకీయంగా రిటైర్ మెంట్ తీసుకోవాలనే నిర్ణాయానికి వచ్చారు. దీంతో ఇద్దరూ వారి స్థానాల్లో వారి కుమారులను పోటీ చేయించారు. తమ కుమారులకు మొదటి ఎన్నికల్లో కచ్చితంగా విజయం అందించి వారి రాజకీయ భవిష్యత్ కు గట్టి పునాధులు వేయాలని జేసీ సోదరులు భావించారు. ఇందుకోసం ఈ ఎన్నికల్లో వారు బాగా కష్టపడ్డారు.

క్రాస్ ఓటింగ్ పవన్ కు ఇబ్బందేనా..?

ఈ ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి అనంతపురం లోక్ సభ స్థానానికి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి దివాకర్ రెడ్డి 62 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో జిల్లా మొత్తం టీడీపీ హవా ఉండటంతో జేసీ సులువుగా విజయం సాధించారు. అయితే, ఈసారి వైసీపీ ఇక్కడ బలం పుంజుకుంది. పవన్ రెడ్డికి పలువురు అసెంబ్లీ అభ్యర్థులతో సఖ్యత లేకపోవడం మైనస్ గా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి కొత్త అభ్యర్థి రంగయ్య పోటీ చేశారు. బీసీ సామాజకవర్గానికి చెందిన ఆయనకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా ఇక్కడి బీసీలను ఆకట్టుకోవడానికి వైసీపీ ప్రయత్నించింది. ఇక్కడ బీసీలే గెలుపోటములు ప్రభావితం చేయగలరు. దీంతో రంగయ్య టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారు. పవన్ రెడ్డి గెలుపు అంత సులువు కాదనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఆర్థికంగా పవన్ రెడ్డి బలమైన వారు కావడంతో బాగా డబ్బు ఖర్చు చేయడం కలిసొచ్చే అవకాశం ఉంది.

అస్మిత్ గెలుపూ సులువు కాదు

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ ఆస్మిత్ పోటీ చేశారు. ఈ నియోజకవర్గం జేసీ కుటుంబానికి కంచుకోట. గత ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి ఇక్కడి నుంచి 22 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. జగన్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న జేసీ కుటుంబానికి చెక్ పెట్టడానికి జగన్ ఈసారి ఇక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపారు. వైసీపీ నుంచి ఈసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేశారు. ఆయనకు రెండేళ్లు క్రితమే జగన్ టిక్కెట్ ఖరారు చేయడంతో ఆయన నియోజకవర్గంలో పట్టు సాధించారు. అన్ని విషయాల్లోనూ జేసీ కుటుంబాన్ని పెద్దారెడ్డి ధీటుగా ఎదుర్కున్నారు. ఇక, జేసీ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్న పలువురు, జేసీ సోదరుల కంటే ముందు టీడీపీలో ఉన్న వారు కొందరు ఎన్నికల వేళ వైసీపీలో చేరడం ఆ పార్టీకి ప్లస్ అయ్యింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లో ఆస్మిత్ ను గెలిపించాలనే పట్టుదలతో జేసీ కుటుంబం పనిచేసింది. డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేసింది. అభ్యర్థులను బేరీజు వేసుకుంటే వైసీపీ అభ్యర్థిది ఫ్యాక్షన్ నేపథ్యం కావడం, తాను విద్యావంతుడు, యువకుడు కావడం అస్మిత్ కు ప్లస్ అయ్యింది. అయితే, ఏకపక్షంగా మాత్రం ఎన్నిక జరగలేదు. అస్మిత్ ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నా అతి స్వల్ప మెజారిటీ మాత్రమే రావచ్చు. ఆయన ఓడినా పెద్ద ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:    

Similar News