తాడిపత్రి..తాడో…పేడో….!!!

జేసీ సోదరుల కంచుకోట తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. తమ వారసులను ప్రత్యక్ష రాజకీయాలకు తీసుకువచ్చిన జేసీ సోదరులు తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి కుమారుడు [more]

Update: 2019-03-26 08:00 GMT

జేసీ సోదరుల కంచుకోట తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. తమ వారసులను ప్రత్యక్ష రాజకీయాలకు తీసుకువచ్చిన జేసీ సోదరులు తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని బరిలోకి దింపుతున్నారు. అస్మిత్ రెడ్డికి మొదటి ఎన్నికలోనే ఘన విజయం అందించి ఆయన రాజకీయ జీవితానికి బలమైన పునాదులు వేయాలని జేసీ సోదరులు భావిస్తున్నారు. ఇక, జేసీ కోటను ఈసారి చేజిక్కించుకోవాలని ముందునుంచే వ్యూహం రచించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రిలో ఈసారి బలమైన పోటీ ఇవ్వనుంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి తమ్ముడు కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులు కావడంతో పోటీ హారాహోరీగా ఉంది.

జేసీ సోదరులకు కంచుకోట

తాడిపత్రి నియోజకవర్గంలో 1985 నుంచి జేసీ సోదరులు హవా కొనసాగుతోంది. 1983 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన జేసీ దివాకర్ రెడ్డి 1985 నుంచి 2009 వరకు వరుసగా ఆరు ఎన్నికల్లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవగా దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి వైసీపీ అభ్యర్థి వి.రామిరెడ్డిపై 22 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, గత ఎన్నికల్లో ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలపలేకపోయిన వైసీపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని మూడేళ్ల క్రితం తెరపైకి తీసుకువచ్చింది. ఫ్యాక్షనిస్టుగా ముద్రపడిన పెద్దారెడ్డి రాకతో తాడిపత్రి వైసీపీ బలం పుంజుకుంది. క్యాడర్ లోనూ ఆత్మస్థైర్యం పెరిగింది. పార్టీని బలోపేతం చేసేందుకు పెద్దారెడ్డి బాగానే కష్టపడ్డారు. జేసీ సోదరులతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోరాడారు. ముందునుంచీ అనుకుంటున్నట్లుగానే పెద్దారెడ్డిని తాడిపత్రి అభ్యర్థిగా జగన్ ప్రకటించారు.

గట్టి పోటీ ఇవ్వనున్న పెద్దారెడ్డి

అస్మిత్ రెడ్డి తరపున ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. తమకు అనేక ఏళ్లుగా ఉన్న బలం, తమ హయాంలో చేసిన అభివృద్ధి, టీడీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని వారు నమ్మకంగా ఉన్నారు. అస్మిత్ రెడ్డి విద్యావంతుడు, యువకుడు కావడంతో ఆయన పట్ల ప్రజలు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. అయితే, జేసీ సోదరులకు ఈ మధ్య వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. జేసీ సోదరులకు ముఖ్య అనుచరులుగా, స్థానికంగా బలమైన నేతలుగా ఉన్న పలువురు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. జేసీ సోదరుల పట్ల అసంతృప్తితో ఉన్న వారిని పెద్దారెడ్డి తనవైపు తిప్పుకోవడంలో విజయవంతమయ్యారు. స్థానిక టీడీపీ నేతలు, జేసీ సోదరుల అనుచరులపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇది కూడా అస్మిత్ రెడ్డి గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక, పెద్దారెడ్డి మూడేళ్లుగా నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయగలిగారు. అయితే, ఆయనపై ఫ్యాక్షన్ ముద్ర ఉండటం మైనస్ గా మారే అవకాశం ఉంది. అనారోగ్య కారణాల వల్ల ఆయన ఎక్కువగా ప్రచారం చేయలేకపోతున్నారు. ఆయన కుమారులే ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. దీంతో వైసీపీ ప్రచారంలో కొంత వెనుకబడింది. మొత్తానికి జేసీ సోదరులకు ఇన్ని ఎన్నికలు ఒకెత్తు.. ఒప్పుడు ఒకెత్తు అని.. పెద్దారెడ్డి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News