తమ్ముళ్ళకు జమిలి మోజు వీడదా ?

తెలుగుదేశానికి జమిలి ఎన్నికల మోజు బాగా పట్టుకుంది. అవును మరి అధికారం వారికి కాదు కదా. ప్రత్యర్ధి అధికారంలో కనీసం రెండేళ్ళు అయినా కోత పడితే వచ్చే [more]

Update: 2020-07-10 14:30 GMT

తెలుగుదేశానికి జమిలి ఎన్నికల మోజు బాగా పట్టుకుంది. అవును మరి అధికారం వారికి కాదు కదా. ప్రత్యర్ధి అధికారంలో కనీసం రెండేళ్ళు అయినా కోత పడితే వచ్చే సర్కార్ తమదేనని వెర్రి మొర్రి ఆశ. నిజానికి ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదన ఈనాటిది కాదు 2014 ఎన్నికల్లో కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వినిపిస్తున్నదే. మూడేళ్ళు గడిచాక 2017 ప్రాంతంలో జమిలి ఎన్నికలు వెళ్లాలని మోడీకి అనిపించింది. దానికి కారణం ఉత్తరప్రదేశ్ లో పెద్ద ఎత్తున సీట్లు సంపాదించి అధికారంలోకి రావడ‌మే. ఆ తరువాత కూడా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో ఊపు మీద కమలనాధులు ఆ దూకుడులో జమిలి ఎన్నికలు అనేశారు.

నో అన్న టీడీపీ ….

నాడు టీడీపీ తరఫున చంద్రబాబు, ఆయన కుమారుడు జమిలి ఎన్నికలేంటి, వద్దే వద్దు అనేశారు. మేము ఎన్నికల సమయం వరకూ అధికారంలో ఉంటాం, మా పాలన పూర్తి చేసుకున్నాకే ఎన్నికలు అని స్వయంగా చినబాబు అన్నారు. అంటే వారి అధికారం మాత్రం పరమ పవిత్రం, అదే జగన్ గద్దె మీద కూర్చూంటే మాత్రం రేపో మాపో ఎన్నికలు వచ్చేయాలి. ఇదేం పిచ్చి ఆలోచన అని మాత్రం అడగరాదు. సరే ఇంతకీ జమిలి ఎన్నికలు జరుగుతాయా. అసలు అంత సీన్ ఉందా, బీజేపీకి నాటి నిబ్బరం ఉందా ఇవన్నీ కూడా ప్రశ్నలూ, చర్చలే.

విశాఖ ఆక్టోపస్ అలా ….

విశాఖ ఆక్టోపస్ సబ్బం హరి మరోమారు జాతకం చెప్పారు. జగన్ గద్దె మీద ఉండేది మరో ఏడాదో రెండేళ్ళో మాత్రమేనని కూడా ఆయన జోస్యం చెప్పేశారు. 2022 లో జమిలి ఎన్నికలు వస్తాయట. ఈ మాట టీడీపీలో ఎక్కువగా సబ్బం హరి మాత్రమే మాట్లాడుతున్నారు. కొంపదీసి ఆయనకు మాత్రమే బీజేపీ నాయకులు చెవిలో ఈ సంగతి చెప్పారా అన్నది పెద్ద డౌట్ గా ఉంది. నిజానికి ఏ బీజేపీ పెద్ద నాయకుడు కూడా జమిలి ఎన్నికల గురించి ఇపుడు అసలు మాట్లాడడం లేదు. మరి ఎందుకు ఆ ఊసు సబ్బం హరి నోటి వెంటనే తరచుగా వస్తుందో అర్ధం కాదు.

ఉన్నది పోగొట్టుకుని….

నిజానికి అధికారం ఒక మత్తు మందు, ఉన్న దాన్ని పోగొట్టుకుని ఎవరూ కూడా లేని దాని గురించి ఎగిరిపడరు. ఇక ఊహలలో విహరించి అదే పనిగా ఆలోచించి ఉరేసుకోరు. బీజేపీ విషయం తీసుకుంటే మోడీ గ్లామర్ ఇప్పటికే బాగా తగ్గింది. ఆయనకు 2019లో భారీ విజయం దక్కినా అందులో కాంగ్రెస్ కూటమి చేతగానితనమే ఎక్కువగా ఉంది. 2014 మాదిరిగా పాజిటివ్ ఓటింగు ఈసారి ఎక్కువగా పడలేదు. ఆ సంగతి అందరి కంటే ఎక్కువగా బీజేపీ పెద్దలకే తెలుసు. ఇక కరోనా ఉపద్రవం అనుకోని శాపంగా మారింది. దీని వల్ల మరో రెండు మూడేళ్ల వరకూ దేశం ఏ మాత్రం సుఖ సంతోషాలతో ఉండలేదన్న సంగతి కూడా అందరికీ తెలుసు. కరోనా కట్టడి విషయంలో మోడీ విఫలం అయ్యారని కూడా ఈపాటికే అంతా భావిస్తున్నారు.

ఆర్థిక మాంద్యంతో పాటు….

దానికి తోడు ఆర్ధిక మాధ్యం, నిరుద్యోగం ఇవన్నీ ఎక్కువై దేశంలో నయా పేదరికం కూడా తిష్ట వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏమైనా ఆశవహమైన పరిస్థితులు ఉంటే గింటే 2024 నాటికి ఉంటాయా అన్నది బీజేపీ పెద్దల ఆలోచన. అంతే తప్ప అయిదేళ్ల ప్రభుత్వ ఆయువుని తగ్గించేసుకుని ముందే పీకను 130 కోట్ల మంది జనాలకు అప్పగించి కొరికించుకుని మరీ తలవంచుకుని వెళ్ళిపోవడానికి బీజేపీ కాదు కదా ఏ పార్టీ కూడా సిధ్ధంగా ఉండదు, ఇవీ రాజకీయ సమీకరణలు తెలిసిన వారు వేసే అసలైన అంచనా. మరి రాజకీయ విశ్లేషకుడిని అని చెప్పుకునే సబ్బం హరి తలా తోకా లేకుండా జమిలి ఎన్నికలు అంటూ రాగం తీస్తూంటే చంద్రబాబు మురిసిపోవడం దారుణమే.

Tags:    

Similar News