జగన్ సైన్యంలో తిరుగుబాట్లు…?

జగన్ సైన్యం అంటే వేరే ఎవరో కాదు, వాలంటీర్లు. ఈ వ్యవస్థను సృష్టించిందే జగన్. ఒక రకంగా ఆయన మానస‌ పుత్రికగా ఈ వ్యవస్థను చెప్పుకోవాలి. నెలకు [more]

Update: 2021-04-15 06:30 GMT

జగన్ సైన్యం అంటే వేరే ఎవరో కాదు, వాలంటీర్లు. ఈ వ్యవస్థను సృష్టించిందే జగన్. ఒక రకంగా ఆయన మానస‌ పుత్రికగా ఈ వ్యవస్థను చెప్పుకోవాలి. నెలకు అయిదు వేల రూపాయలు ఈ రోజుల్లో తక్కువే అని చెప్పుకోవాలి. అదే సమయంలో ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తే ఆ మొత్తం కూడా సరిగ్గా ఇవ్వరు. పైగా అక్కడ సతాయింపులతో పోలిస్తే ప్రభుత్వ సేవలో ఉన్నామన్న సంతృప్తి ఉంటుంది. ఎప్పటికైనా ప్రభుత్వ గుర్తింపు దక్కితే భవిష్యత్తు కూడా ఉంటుంది అన్న ఆశ కూడా ఉంది. మొత్తానికి రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లను ఏపీలో జగన్ సర్కార్ నియమించి పెద్ద సంచలనం సృష్టించింది.

వారే వారధులుగా….

వాలంటీర్లు ఇపుడు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధులుగా ఉంటున్నారు. వారు ఎంత కీలకం అయ్యారు అంటే ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ నియామకంతో వారికి ఒక హోదా వచ్చింది. ఆ యాభై కుటుంబాలను పేరు పెట్టి పలకరించే స్థితి, సామాజికపరమైన గౌరవం కూడా దక్కాయి. ఇపుడు అదే వారికి ఒక రకంగా ప్లస్ పాయింట్ గా ఉందిట. ఒక వార్డు కార్పోరేటర్ గా గెలిచినా ఇరవై వేల మంది జనాలను ఆయన ఎప్పటికీ గుర్తించలేడు. అందులో ఓటేయని వారు, వివిధ పార్టీల అభిమానులు కూడా ఉంటారు. వారు ప్రత్యర్ధులుగానే ఎప్పటికీ అవుతారు. అదే వాలంటీర్ అయితే ఆ యాభై మందీ పూర్తిగా తన మాటే వింటారు.

రాజకీయాలతో……?

ఇక వాలంటీర్లు చాలా మంది లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గెలిచారు. దానికి కారణం వారికి స్థానికంగా ఉన్న పరపతే. ఇక ఎంత వాలంటీర్లు అయినా వారు కూడా మనుషులే వారికీ సొంత ఇష్టాలు ఉంటాయి. పైగా గతంలో వారు వేరే పార్టీకి అభిమానులుగా కూడా ఉండవచ్చు. ఉపాధి కోసం ఇటు చేరినా వారి మనసులో ఆ అభిమానం అలాగే ఉంటుంది. ఇపుడు అదే కొన్ని చోట్ల వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఇబ్బందిగా ఉందిట. తమ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు వేరే ప్రత్యర్ధి పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు అన్న అక్కసు కూడా చాలా మంది వైసీపీ నేతల్లో ఉందిట. మరో వైపు టీడీపీ లాంటి పార్టీలు వారిని వైసీపీ కార్యకర్తలు అని కూడా విమర్శించడమూ జరుగుతోంది.

వ్యతిరేకమే …?

ఇదిలా ఉంటే విజయనగరం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వాలంటీర్లలో పది శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటూ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేయడం చర్చకు తావు ఇస్తోంది. వారు ప్రభుత్వ పధకాలు అమలు చేయాలి. ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలి. కానీ రాజకీయాలు చేయడం ఏంటి అన్న మాట ఉంది. ఇపుడు దాన్నే పుష్ప శ్రీవాణి కూడా గట్టిగా నిలదీస్తున్నారు అంటున్నారు. వాలంటీర్లు నూటికి నూరు శాతం ప్రభుత్వానికి సహకరించాలి అని ఆమె అంటున్నారు. ప్రభుత్వ పరంగా అయితే సహకరిస్తారు కానీ రాజకీయంగా ఎందుకు చేయాలి అని విపక్షాలు డిప్యూటీ సీఎం మాటకు కౌంటర్లేస్తున్నాయి. ఏది ఏమైనా వాలంటీర్ల వ్యవస్థను జగన్ స్వచ్చంగా ఉండాలనే ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ నేతలు వారిని తమ స్వీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. మరో వైపు విపక్షాలు కూడా ఇదే మాట అంటున్నారు. ఇపుడు అధికార పక్షం నుంచి వాలంటీర్ల మీద విమర్శలు వస్తే వాలంటీర్ల వ్యవస్థ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుంది అంటున్నారు.

Tags:    

Similar News