విజేతగా నిలవాలని…??

గత ఎన్నికల్లో అధికారం అందినట్లే అంది జారిపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్… ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. గత ఎన్నికల్లో చేసిన [more]

Update: 2019-01-24 12:30 GMT

గత ఎన్నికల్లో అధికారం అందినట్లే అంది జారిపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్… ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పులను చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కా వ్యూహాలతో ముందుకుపోతున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా నిత్యం ప్రజల్లో ఉండేలా రూపొందుతున్నారు. తాజాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టనుంది. తటస్థులను తనవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ‘అన్న పిలుపు’ కార్యక్రమాన్ని జగన్ చేపట్టనున్నారు. సమాజంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు, నిపుణులకు, సేవ చేస్తున్న వారికి, రాజకీయాలతో సంబంధం లేని వారికి జగన్ నేరుగా లేఖలు రాయనున్నారు. తర్వాత వారిని నేరుగా జగన్ కలవనున్నారు. వారి నుంచి రాష్ట్రాభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. అయితే, చెప్పుకోవడానికి ఇది చిన్న కార్యక్రమమే అయినా అంతర్లీనంగా ఈ కార్యక్రమం రానున్న ఎన్నికల్లో చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

వారిని ఆకర్షించడమే లక్ష్యంగా…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓటర్లలో కులాలు, పార్టీలవారీగా చీలిక ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం ఓటర్లు వారు ఏ పార్టీకి ఓటేయబోతున్నారో ఇప్పటికే నిర్ణయించుకొని ఉంటారు. వారు అభిమానించే పార్టీలకు ఫిక్డ్స్ ఓటుబ్యాంకుగా ఉంటారు. ఇప్పుడున్న మూడు ప్రధాన పార్టీల్లో వారి ఓటు బ్యాంకు మాత్రమే ఓట్లేస్తే అధికారం చేపట్టే అవకాశం లేదు. ఎన్నికల వరకు తటస్థులుగా ఉండే వారు ఎక్కువగా ఎటు వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీనే అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత కావాలనే ఉద్దేశ్యంతో తటస్థ ఓటర్లంతా చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతకాలి అనే ఆలోచనతో ఇప్పుడు జగన్ తటస్థ ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ‘అన్న పిలుపు’ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

తటస్థులను నేరుగా కలవనున్న జగన్

సమాజంలో వివిధ రంగాల్లో పనిచేసే వారు ఓటర్లను ప్రభావితం చేయగలిగే వారు ఉంటారు. వైద్యులు, విద్యావంతులు, మేధావులు, స్వచ్ఛంద సేవకులు, వంటి వారు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకే జగన్ వీరిని మచ్చిక చేసుకునే పని మొదలుపెట్టారు. కేవలం వారికి లేఖలు రాయడమే కాకుండా వారి సలహాలు, సూచనలు తీసుకోవాలనుకుంటున్నారు. దీని ద్వారా ఒక సానుకూల సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ‘అన్న పిలుపు’ కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయట. పార్టీ తరపున ఓ ప్రత్యేక బృందం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి మొత్తం 75 వేల మంది తటస్థులను గుర్తించారు. వీరందరికి త్వరలో జగన్ లేఖ రాస్తారు. నేరుగా వారి పేరుతోనే ఈ లేఖలు రాయనున్నారు. అందులో తమతో కలిసిరావాలని జగన్ వారిని కోరనున్నారు. లేఖలోనే మెయిల్ ఐడీని, ఫోన్ నెంబర్ ను ఇస్తారు. వారి నుంచి సలహాలు, సూచనలు మెయిల్, ఫోన్ ద్వారా తీసుకోనున్నారు. తర్వాత ఆసక్తి చూపిన వారందరినీ నేరుగా జగన్ కలుస్తారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తటస్థులను కలుపుకొని పోవడం ద్వారా ఎన్నికల్లో వైసీపీకి మేలు జరిగే అవకాశం ఉందంటున్నారు. మరి, ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారో చూడాలి.

Tags:    

Similar News