డోన్ట్ కేర్ అంటున్న జగన్..!

ఈసారి గెలుపే లక్ష్యంగా ముందుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గత ఎన్నికల్లో చేసిన తప్పులను మళ్లీ చేయొద్దని డిసైడ్ అయ్యారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు కీలకమైన [more]

Update: 2019-03-02 02:30 GMT

ఈసారి గెలుపే లక్ష్యంగా ముందుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గత ఎన్నికల్లో చేసిన తప్పులను మళ్లీ చేయొద్దని డిసైడ్ అయ్యారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు కీలకమైన అభ్యర్థుల ఎంపికపై జగన్ ఈసారి ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి మొహమాటాలు, బంధుప్రతీకి తావివ్వడం లేదు. గెలవగలిగిన వారికి టిక్కెట్లు ఇస్తానని స్పష్టంగా చెప్పేస్తున్నారు. తన కుటుంబానికి దగ్గరగా ఉండేవారికి, పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారికి సైతం టిక్కెట్ల విషయంలో జగన్ షాక్ ఇస్తున్నారు. వారు అలిగినా, పార్టీని వీడుతామన్నా పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రావాలంటే కేవలం పార్టీకి ఇన్న సానుకూలత, అధినేత ఇమేజ్ మాత్రమే సరిపోవు. స్థానికంగా బలమైన అభ్యర్థి ఉంటేనే గెలవవచ్చు. గత ఎన్నికల్లో జగన్ చాలాచోట్ల బలమైన అభ్యర్థులను నిలబెట్టలేకపోయారు. అదే టీడీపీ మాత్రం బలమైన అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇది టీడీపీకి అదికారంలోకి వచ్చేందుకు బాగా కలిసొచ్చింది.

బాబాయ్ కి కూడా నో టిక్కెట్

గత ఎన్నికల ముందు జరిగిన తప్పిదాలను జగన్ గుర్తించారు. దీంతో ప్రశాంత్ కిషోర్ టీమ్ తో పాటు మరికొన్ని సర్వేలు, అభ్యర్థుల బలాబలాలు, సామాజకవర్గ సమీకరణాలు, ప్రత్యర్థుల బలం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ముందునుంచీ పార్టీలో ఉన్నవారిని సైతం పక్కనపెట్టి కొత్త అభ్యర్థులకు టిక్కెట్లు ఖరారు చేస్తున్నారు. దీంతో కొందరు పార్టీకి దూరమవుతుంటే, మరికొందరు మాత్రం అసంతృప్తితో కొనసాగుతున్నారు. జగన్ ఈ విషయంలో ఎంత కఠినంగా ఉంటున్నారో చెప్పడానికి వై.వి.సుబ్బారెడ్డి ఒక ఉదాహరణ. జగన్ కు స్వయానా బాబాయ్ అయిన ఆయనకు గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఈసారి కూడా ఆయన మళ్లీ అదే టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే, సుబ్బారెడ్డి కంటే టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని చేర్చుకొని పోటీ చేయిస్తే సులువుగా గెలవవచ్చని జగన్ భావిస్తున్నారు. టిక్కెట్ ఇవ్వడం లేదని సుబ్బారెడ్డికి తేల్చిచెప్పారు. దీంతో ఆయన అమరావతిలో జరిగిన జగన్ గృహప్రవేశానికి కూడా హాజరుకాలేదు.

సన్నిహితులకూ మొండిచేయి

ఇక, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముందునుంచీ వైఎస్ కుటుంబానికి సన్నిహితులు. ఆయితే, ఆయనకంటే టీడీపీ నుంచి గెలిచిన మేడా మల్లిఖార్జున్ రెడ్డి బలమైన అభ్యర్థిగా భావించిన జగన్ ఆయనను పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఖరారు చేశారు. అమర్నాథ్ రెడ్డి మొదట అసంతృప్తి వ్యక్తం చేసినా తర్వాత మెత్తబడ్డారు. ఇక, కర్నూలు జిల్లాలో కీలక నేతలుగా, వైఎస్ కుటుంబానికి విధేయంగా ఉన్న గౌరు కుటుంబానికి పాణ్యం టిక్కెట్ పై జగన్ హామీ ఇవ్వలేదు. వారి కంటే ఐదుసార్లు అక్కడ గెలిచిన కాటసాని రాంభూపాల్ రెడ్డి అయితేనే బెటర్ అని జగన్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గౌరు దంపతులు టీడీపీలోకి వెళ్లి పాణ్యం నుంచి పోటీ చేయనున్నారు.

లాభంతో పాటు నష్టమూ ఉంది…

ఇలానే మరికొన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థుల వేటలో ఉన్న జగన్ చాలారోజులుగా పార్టీలో ఉన్నవారిని, బంధువులను, సన్నిహితులను పక్కన పెట్టేస్తున్నారు. ఎటువంటి మొహమాటాలూ లేకుండా టిక్కెట్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. అయితే, పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పదవులు ఇచ్చిన న్యాయం చేస్తానని జగన్ వారికి హామీ ఇస్తున్నారు. అయితే, వినే వారు వింటున్నారు. వినని వారు కొత్త దారి వెతుక్కొని వెళ్లిపోతున్నారు. అయితే, ఇలా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కొత్త వారిని తీసుకువస్తే లాభంతో పాటూ నష్టమూ ఉంది. టిక్కెట్ దక్కని పాత నేతల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుంది. వారే గనుక స్వతంత్రంగా బరిలో ఉంటే అసలుకే మోసం వస్తుందని. మరి జగన్ ఈ విషయాల్లో గుర్తించారో లేదో చూడాలి.

Tags:    

Similar News