జగన్ రంగంలోకి దిగేదెప్పుడు..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫీవర్ మొదలైంది. పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమిషం కూడా వృధా చేయకుండా ఎన్నికల వ్యూహాల్లో తలమునకలయ్యారు. ప్రారంభోత్పవాలు, [more]

Update: 2019-02-04 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫీవర్ మొదలైంది. పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమిషం కూడా వృధా చేయకుండా ఎన్నికల వ్యూహాల్లో తలమునకలయ్యారు. ప్రారంభోత్పవాలు, శంకుస్థాపనలు, కొత్త పథకాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఇక, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మాత్రం 20 రోజులుగా హైదరాబాద్ కి పరిమితమయ్యారు. 14 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లోనే ఉన్న జగన్ 20 రోజులుగా ప్రజలకు దూరమై హైదరాబాద్ లో పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు. వివిధ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్న ఆయన కొత్త నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. తటస్థులతో ఆయన సమావేశమవుతున్నారు. అయితే, ఎన్నికలు దగ్గరపడటం, ఓ వైపు చంద్రబాబు రోజూ ఏదో ఓ కార్యక్రమం పెట్టుకుంటుడటంతో జగన్ వెనుకబడుతున్నారా అనే భవన పెరిగిపోతోంది. అయితే, జగన్ మాత్రం… పక్కా కార్యాచరణతోనే ఎన్నికల బరిలో దూకనున్నారు.

ఇక అమరావతి నుంచే రాజకీయం…

ఫిబ్రవరి మొదటి వారం నుంచి జగన్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కానున్నారు. ఫిబ్రవరీ 4, 5, 6 తేదీల్లో తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో పార్టీ బూత్ లెవల్ నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆయన సమాజంలో తటస్థులుగా ఉన్న 75 వేల మందికి లేఖలు రాశారు. వీరిలో జగన్ ను కలిసి రాష్ట్ర ప్రగతికి సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్న వారికి జగన్ జిల్లాలవారీగా కలవనున్నారు. అన్ని జిల్లాల్లో బూత్ లెవల్ నాయకులతో, తటస్థులతో సమావేశాలు జరుపుతారు. ఇక, ఇప్పటికే అమరావతిలో జగన్ నివాసం, పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14న ఆయన గృహప్రవేశం చేయనున్నారు. అప్పటి నుంచి మొత్తం అమరావతిలో ఉంటూనే పార్టీ కార్యక్రమాలు చూసుకోనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగానే ఆయన నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించి చక్కబెట్టనున్నారు. విభేదాలు ఉన్న చోట్ల కూడా నేతలతో చర్చించి బుజ్జగించనున్నారు.

సిద్ధమవుతున్న రూట్ మ్యాప్…

నెల రోజుల పాటు పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలు చూసుకోనున్న జగన్ మార్చి మొదటివారం నుంచి పూర్తిస్థాయిలో ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇందుకుగానూ ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధమైందని సమాచారం. పాదయాత్రలో కవర్ కాని 50 నియోజకవర్గాలకు బస్సు యాత్రలో ప్రాధాన్యత ఉండేలా రూప్ మ్యాప్ రూపొందిస్తున్నారు. వాటితో పాటు పాదయాత్ర జరిగిన నియోజకవర్గాల్లోనూ ఆయన బస్సుయాత్ర జరగనుంది. మొత్తానికి, ఫిబ్రవరి 1 నుంచి పూర్తిస్థాయిలో జగన్ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. అదికూడా అమరావతి కేంద్రంగానే ఆయన రాజకీయం చేయనున్నారు. ఇందుకోసం పక్కాగా కార్యాచరణ సిద్ధం చేసే పనిలో పార్టీ ఉంది.

Tags:    

Similar News