అవకాశం అందిపుచ్చుకుంటారా? చేయి జార్చుకుంటారా?

కరోనా. . . అంతర్జాతీయ యవనికపై అనేక మార్పులు తీసుకురానుంది. ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చేసే శక్తి ఈ మహమ్మారికి ఉంది. ఆరోగ్య సంరక్షణ, ఆర్ధికాభివృద్ధికి సంబరధించి కరోనా [more]

Update: 2020-05-23 16:30 GMT

కరోనా. . . అంతర్జాతీయ యవనికపై అనేక మార్పులు తీసుకురానుంది. ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చేసే శక్తి ఈ మహమ్మారికి ఉంది. ఆరోగ్య సంరక్షణ, ఆర్ధికాభివృద్ధికి సంబరధించి కరోనా అనేక పాఠాలు నేర్పనుంది. ఇప్పటికే ఆవిషయం రుజువైంది. ఆసియా అగ్రదేశాలైన చైనా, భారత్ ల పైనా కరోనా ప్రభావం చుాపనుందని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చుాపే అవకాశం ఉంది. ఇప్పటికే దాని లక్షణాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పారిశ్రామికంగా, ఆర్ధికంగా ఆసియా టైగర్ గా పేర్కొనే చైనాకు కరోనా చిక్కులు తీసుకొచ్చింది. అదేసమయంలో జనాభాపరంగా ప్రపంచలో రెండో అతి పెద్దదేశమైన భారత్ కు అనేక అవకాశాలు తీసుకురానుందన్నది నిపుణుల విశ్లేషణ. దీనిని తోసిపుచ్చలేం. లోతుగా విశ్లేషిస్తే ఈ వాదనలో హేతుబద్ధత ఉన్నట్లు కనపడుతోంది.

నమ్మదగ్గ దేశం కాదు…

కరోనా కారణంగా చైనా నమ్మదగ్గ మిత్రదేశం కాదని అంతర్జాతీయ సమాజానికి అనుభవ పూర్వకంగా అర్ధమైంది. సహజంగానే చైనా అంతర్గత విషయాలు వెలుగులోకి రావు. అక్కడ ప్రజాస్వామ్యం, పారదర్శకత, స్వేచ్ఛ, అరకొరలే. ఇతర దేశాలతో పోల్చిచుాస్తే ఈ విషయంలో చైనా రికార్డు దిగదుడుపు. కరోనా విషయంలో డ్రాగన్ దేశం వాస్తవాలను కప్పిపుచ్చింది, దీనిపై ముందుగానే అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించడంలో ఉద్దేశపూర్వకంగానే అలసత్వం వహించిందని పలుదేశాల ఆరోపణ. అంతా బాగుందని చెప్పడం ద్వారా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందన్నది ఆ యా దేశాల వాదన. చైనా ముందుగా హెచ్చరించి ఉంటే కరోనా ముప్పు ఇంత తీవ్రంగా ఉండేది కాదన్నది అమెరికాతో సహా అనేక దేశాల అభిప్రాయం.

భారత్ సురక్షితమంటూ…

ఈ ఉద్దేశంతోనే డ్రాగన్ కు దుారంగా ఉండాలని ఇప్పటికే అనేక దేశాలు స్ధుాలంగా ఒక అభిప్రాయానికి వచ్చాయి. చైనాలోని తమ సంస్ధలను వెనక్కు రప్పించాలని, పెట్టుబడులను ఉపసంహరించాలని అవి భావిస్తున్నాయి. అదే సమయంలో కొత్త సంస్ధల స్ధాపనకు, పెట్టుబడులు పెట్టేందుకు భారత్ సురక్షితమైన దేశమని భావిస్తున్నాయి. భారత్ లోని పారదర్శకత, ప్రజాస్వామ్యం, స్నేహభావం, స్వతంత్ర నాయకత్వం, అన్నింటికీ మించి అతిపెద్ద మార్కెట్ న్యూడిల్లీకి ఉన్న సానుకుాల లక్షణాలని అవి పేర్కొంటున్నాయి. ఇప్పటిదాకా పాశ్చాత్యదేశాలు సేవాసంస్ధలపై దృష్టి పెట్టగా బీజింగ్ ఉత్ప్ త్తి కేంద్రంగా స్ధిరపడింది. మారిన పరిస్ధితుల్లో ఆ దేశం నుంచి సుమారు వెయ్యి సంస్ధలు బయటకు రానున్నాయి. విటిలో అమెరికా, జర్మనీ , ఐరోపా దేశాలకు చెందిన మెుబైల్, ఎలక్ట్రిక్, సింధటిక్, ఫ్యాబ్రిక్, వైద్య, టెక్స్ టైల్ రంగాలకు చెందిన సంస్ధలున్నాయి. చైనాలో ఉన్న తమ సంస్ధలను వెనక్కు రప్పించేందుకు ఆ యా దేశాలు ప్రత్యేకంగా బెయిల్ అవుట్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.

దాదాపు మూడు వందల సంస్థలు….

ఈ వెయ్యి సంస్ధల్లో దాదాపు 300 సంస్ధలు భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి. ఇక్కడ అనుమతుల ప్రక్రియ సరళంగా ఉండటం విదేశీప పెట్టుబడులకు ప్రభుత్వం రెడ్ కార్నెట్ పరచడం, ఇందుకు కారణాలుగా చెబుతున్నాయి. ముందుగా దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్ధలైన పాస్వో, హృండాయ్, స్టీల్ సంస్ధలు ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఇటీవల విశాఖలో గ్యాస్ లీకైన స్టెరిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ కుాడా దక్షిణ కొరియాకు చెందినది కావడం గమనార్హం. దక్షిణ కొరియాతో భారత్ సంబంధాలు బహుచక్కగా ఉన్నాయి. ఇవే కాకుండా ఆదేశానికి అనేక సంస్ధలు భారత్ బాట పట్టడానికి రెడీగా ఉన్నాయి. జర్మనీ, జపాన్ లకు చెందిన అనేక సంస్ధలు కుడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు కుాడా ఆ యా దేశాలకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. కార్పోరేట్ పన్నులు గత ఏడాది సెప్టెంబరు లో 25.17 శాతానికి తగ్గిస్తుా తీసుకున్న నిర్ణయం విదేశీ సంస్ధలకు ఊపునిస్తోంది. అలాగే నూతన తయారీ సంస్ధలపై పన్నును కేవలం 17 శాతం విధించడం కుాడా సానుకాల అంశం. మారుతున్న పరిస్ధితులను అధ్యయనం చేసిని కేంద్రం విదేశీసంస్ధలకు ఊతమిచ్చేందుకు దేశవ్యాప్తంగా 4,61,589 హెక్టార్ల భుామిని గుర్తించింది. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ ల్లోని 1.15 లక్షల హెక్టార్ల పారిశ్రామిక క్లస్టర్ ఉంది. భుామితో పాటు నీరు, విద్యుత్, రవాణా సదుపాయాలు కల్పించినపుడే విదేశీసంస్ధలను ఆకట్టుకోగలదు. భారత్ లో ఎలక్ట్రికల్, ఫార్మా, వైద్య, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, సౌర విద్యుత్ పరికరాలు, కెమికల్, టెక్స్ టైల్స్ రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియెాగం చేసుకుంటే భారత్ సరికొత్త శిఖరాలకు చేరుకోగలదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News