జగన్ వైపు జాలి చూపులేల?

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత స్థితిని చూసి ఎవరైనా జాలి పడాల్సిందే. ఒకనాడు ఈ దేశానికి దిశా నిర్దేశం చేయడమే కాదు, అర్ధ శతాబ్దం పైగా ఏలిన పార్టీ [more]

Update: 2020-11-21 15:30 GMT

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత స్థితిని చూసి ఎవరైనా జాలి పడాల్సిందే. ఒకనాడు ఈ దేశానికి దిశా నిర్దేశం చేయడమే కాదు, అర్ధ శతాబ్దం పైగా ఏలిన పార్టీ కాంగ్రెస్. నిజానికి ఈ దేశానికి ఏం కావాలో బాగా తెలిసిన పార్టీ కూడా కాంగ్రెస్. బ్రిటీషోళ్లు దేశాన్ని వీడాక గతుకుల బాటలో ఉన్న భారత్ కి తారు రోడ్లు వేసి గాడిన పెట్టిన పార్టీగానూ కాంగ్రెస్ ని చూడాలి. ఇపుడు ఆ తారు రోడ్ల మీద ఎన్నో పార్టీలు కార్లతో షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ ని దాటుకుంటూ ముందుకు పోతున్నాయి. నిజానికి స్వాతంత్రం తరువాత ఈ దేశంలో త్యాగాలు చేసిన, అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే మొదట చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ నే. అటువంటి పార్టీ తాజా బీహార్ ఎన్నికల తరువాత మరింతగా చతికిలపడింది.

ఫార్ములా మంచిదే….

కాంగ్రెస్ ఇంతలా పడిపోవడానికి అధినాయకత్వం అహంకారమే కారణం. నెహ్రూ, ఇందిరా తరువాత వారసులుగా వచ్చిన వారి తలబిరుసుతనమే అతి పెద్ద కారణం. ఇపుడు వరస దెబ్బలతో తల బొప్పి కట్టి తప్పులను తెలుసుకుంటున్న కాంగ్రెస్ దేశంలో తన నుంచి విడిపోయిన ముక్కలను కలపాలనుకుంటోందిట. అది శరద్ పవార్ తో మొదలుపెట్టి మమతా బెనర్జీని కలుపుకు ఏపీ దాకా వచ్చి జగన్ ని కూడా తమ వైపు తీసుకురావాలని ప్లాన్ అని అంటున్నారు.

సాఫ్ట్ కార్న్ తో….

జగన్ పట్ల ఈ మధ్య కాంగ్రెస్ పెద్దలు సాఫ్ట్ కార్న్ తో ఉంటున్నారు. జగన్ న్యాయ మూర్తుల మీద చేసిన అభియోగాల మీద కాంగ్రెస్ కి చెందిన న్యాయ‌వాదులు, నాయకులు కూడా గట్టిగా మద్దతు ఇస్తున్నారు. జగన్ అడిగిన దాంట్లో తప్పు లేదని కూడా అంటున్నారు. మరో వైపు బీజీపీ నాయకులు. వారి లాయర్లు అశ్వినీ కుమార్ వంటి వారు జగన్ మీద కోర్టు ధిక్కార నేరం మోపాలని చూస్తున్నారు. ఆ మేరకు కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం జగన్ ని వెనకేసుకువస్తోంది. జగన్ విషయంలో కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ కూడా బాగా మారారని ప్రచారం అయితే సాగుతోంది.

ఓకే అంటారా …?

ఇపుడున్న స్థితిలో కాంగ్రెస్ తో కలవడానికి ఎవరూ ముందుకు రారు. బీహార్ లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన చూశాక ఆ పార్టీని నెత్తిన పెట్టుకోరు. మరి ఏపీలో జగన్ విషయం వేరేగా ఉంది. ఇది రాజకీయం కంటే కూడా వ్యక్తిగత ద్వేషంగా చెప్పాలి. రాజకీయంగా ముక్కుపచ్చలారని జగన్ ని 16 నెలలు చంద్రబాబు కలసి కుట్ర పన్ని కేసులు పెట్టించి జైలు పాలు చేసిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. జగన్ ఎప్పటికీ కాంగ్రెస్ ని క్షమించలేరు. రేపటి రోజున మోడీ ప్రభ తగ్గినా మూడవ కూటమి వైపు జగన్ చూస్తారు కానీ కాంగ్రెస్ వైపు చేరరని ఖరాఖండీగా వైసీపీ నేతలు అయితే చెప్పేస్తారు. కానీ అన్నీ అయిపోయిన కాంగ్రెస్ కి దింపుడు కళ్ళెం ఆశలు జగన్ మీద మాత్రమే ఉన్నాయట. అది జరిగే పనేనా…?

Tags:    

Similar News