విశాఖ బ్రాండ్ ఇమేజ్ కి దెబ్బేనా ?

విశాఖ అంటేనే ప్రశాంత నగరం అని పేరు. ఈ నగరంలో జీవితంలో అన్ని భాధ్యతలు భారాలు దించేసుకుని వార్దక్యంలో హాయిగా ఉండాలనుకునే జనాభా ఎక్కువ. అలాగే ఇక్కడ [more]

Update: 2020-07-14 09:30 GMT

విశాఖ అంటేనే ప్రశాంత నగరం అని పేరు. ఈ నగరంలో జీవితంలో అన్ని భాధ్యతలు భారాలు దించేసుకుని వార్దక్యంలో హాయిగా ఉండాలనుకునే జనాభా ఎక్కువ. అలాగే ఇక్కడ జాబ్ కొన్నాళ్ళు అయినా చేయాలని అందమైన సాయంత్రాలు సాగర తీరానికి అంకితం చేయాలనుకునే వారూ ఎక్కువ. ఇక విశాఖ అందాలను వీక్షించాలని ప్రతీ రోజూ వచ్చే పర్యాటకులూ ఎక్కువగానే ఉన్నారు. విశాఖలో ఒక్కసారి అడుగు పెడితే ఇది మన సిటీ అన్న భావన కలుగుతుంది. విశాఖలో ఎత్తైన కొండలు, పచ్చదనం అందరికీ ఆకట్టుకుంటాయి. ఇక ఆసియాలో శరవేగంగా అభివ్రుధ్ధి చెందుతున్న విశాఖ అందరి కళ్ళల్లో కలలలో ఉంది. అటువంటి విశాఖ ఈ మధ్య వేరే విధంగా జనాలకు గుర్తుకువస్తోంది.

వరస ప్రమాదాలు ….

విశాఖ నగరం చుట్టూ ఉన్న పరిశ్రమలలో ఇపుడు వరస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదో కూడబలుక్కున్నట్లుగా కష్టాలు ఒక్కసారిగా వచ్చిపడుతున్నాయి. కేవలం రెండు నెలల తేడాలో మూడు భారీ ప్రమాదాలు వివిధ కర్మాగారాలలో చోటు చేసుకున్నాయి. మే 7న ఎల్జీ పాలిమర్స్ లో స్టెరీన్ గ్యాల్ లీక్ అయి ఏకంగా 15 మందిని పొట్టన పెట్టుకుంది. అది ఒక గుణపాఠం కావాలి. కానీ ఆ తరువాత ప్రభుత్వ సంస్థ హెచ్ పీ సీ ఎల్ లో కూడా మరో ప్రమాదం జరిగింది. ఇక్కడ ప్రాణ నష్టం లేదు కానీ జనం బెంబెలెత్తారు. ఆ తరువాత ఫార్మా సిటీలో ఓ మందుల కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఇపుడు పరవాడలో సాల్వెంట్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇది మళ్ళీ జనాలంతా ఉలిక్కిపడేలా చేసింది.

రాజధాని వేళ …..

ఓ వైపు విశాఖకు శరవేగంగా రాజధానిని తీసుకురావాలని వైసీపీ సర్కార్ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం పట్ల చర్చ సాగుతోంది. విశాఖకు రాజధాని హోదా అవసరమా కాదా అన్నది ఒక చర్చ అయితే విశాఖలో భద్రత లేదా అన్నది మరో చర్చ. నిజానికి ఈ రెండింటికీ ఇంటర్ లింక్ ఉందా అన్నది మరో చర్చ. రాజధాని రాక ఆలస్యం అవవచ్చు కానీ తప్పనిసరిగా వస్తుందని వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓ వైపు గట్టిగా చెబుతూంటే సగటున ప్రతి పదిహేను రోజులకు ఒక ప్రమాదం చోటు చేసుకోవడంతో అసలు విశాఖకు ఏం జరుగుతోంది అన్న ఆలోచనలు మేధావులకు కూడా వస్తున్నాయి.

యాథృచ్చికమేనా …?

ప్రమాదాలు చెప్పిరావు అంటారు. కానీ విశాఖ లో వరసగా కర్మాగారాల్లో ఒకే తీరున చోటు చేసుకుంటున్న ప్రమాదాలు మాత్రం చెప్పే వస్తున్నాయా అన్న భయాన్నే కలిగిస్తున్నాయి. ఇంతకు ముందు లేని విధంగా ఇలా జరగడం పట్ల కూడా నగర ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి కర్మాగారాల యాజమాన్యాల నిర్లక్ష్యం ఒకటి అయితే పర్యవేక్షించాల్సిన అధికారుల ఉదాశీనత కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదాలు అన్నింటిల్లో అలెర్ట్ చేసే అలారాలు మోగకపోవడం కామన్ పాయింట్. అంతటి నిప్పుల కుంపటిని దగ్గర పెట్టుకుని కనీసం అలారం కూడా మోగకపోతే సమీపంలో ఉండే ప్రజలు ఏమవుతారు అన్నది ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని యాజమాన్యాలు, అధికారుల వైపు నుంచి ఉన్న నిర్లక్ష్యం మీద గట్టిగా చర్యలు తీసుకుంటేనే తప్ప ఈ ప్రమాదాలు ఆగేట్టు లేవని అంటున్నారు. విశాఖకు రాజధాని పక్కన పెడితే సిటీ బ్రాండ్ ఇమేజ్ కి కూడా దీని వల్ల దెబ్బ పడుతోందని అంతా అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News