అందరికీ అప్పగించేశారే….!!

రాహుల్ గాంధీని ఎలాగైనా ప్రధానిని చేయాలన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతల ముందున్న కర్తవ్యం. ముఖ్యంగా దక్షిణాదిన బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క కర్ణాటకలోనే బలంగా [more]

Update: 2019-03-31 16:30 GMT

రాహుల్ గాంధీని ఎలాగైనా ప్రధానిని చేయాలన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతల ముందున్న కర్తవ్యం. ముఖ్యంగా దక్షిణాదిన బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క కర్ణాటకలోనే బలంగా ఉంది. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు కలసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి. బీజేపీని దెబ్బకొట్టాలనే లక్ష్యంతో అతి తక్కువ స్థానాలను గెలుచుకున్న జేడీఎస్ కు సునాయాసంగా ముఖ్యమంత్రి పదవిని అప్పగించిందంటే కాంగ్రెస్ దృష్టంతా లోక్ సభ ఎన్నికలపైనే ఉందన్నది అర్థం చేసుకోవచ్చు.

అన్ని స్థానాలను…..

మొత్తం 28 లోక్ సభ స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్ 21 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. జేడీఎస్ ఏడు స్థానాల్లో బరిలోకి దిగింది. అయితే ఏడుస్థానాల్లో కూడా జేడీఎస్ నేతలకు కాంగ్రెస్ సహకరించడం లేదు. ముఖ్యంగా తుముకూరు, మాండ్య నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదు. తుముకూరులో సాక్షాత్తూ దళపతి దేవెగౌడ పోటీ చేస్తున్నారు. అయితే తుముకూరు సీటును దేవెగౌడకు ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ముద్ద హనుమే గౌడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

సమస్యలను పరిష్కరించుకుంటూ….

చివరి క్షణంలో హనుమేగౌడ చేత నామినేషన్ ఉపసంహరించడంలో కాంగ్రెస్ నేతలు సక్సెస్ అయ్యారు. నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోక్యం తో హనుమే గౌడ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ వేసిన మరో కాంగ్రెస్ నేత రాజణ‌్ణ కూడా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు. చివరకు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర సయితం తుమకూరును జేడీఎస్ కు కేటాయించడాన్ని తప్పుపట్టారు. చివరకు తుముకూరు స్థానం నుంచి అందరూ రెబల్స్ బరిలో నుంచి తప్పుకోవడంతో దేవెగౌడ ఊపిరి పీల్చుకున్నారు. ఇక మాండ్య నియోజకవర్గంలో కూడా పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంది.

మంత్రులను ఇన్ ఛార్జులుగా…..

కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న 21 లోక్ సభ నియోజకవర్గాల్లో గెలిచి తీరాలన్న ఏఐసీీసీ ఆదేశాలతో పార్టీ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మొత్తం 21 స్థానాలకు మంత్రులను ఇన్ ఛార్జిగా నియమించింది. ఇకపై ఎన్నికలు ముగిసేంతవరకూ మంత్రులు తమకు కేటాయించిన నియోజకవర్గాల నుంచి రావద్దని ఆదేశాలు అందాయి. గెలిపించుకు రావాలంటూ వారికి స్పష్టమైన ఆదేశాలు అందాయి. మంత్రులకు ఇది పరీక్ష అని తెలిపారు. డీకే శివకుమార్ కు ప్రత్యేకంగా మూడు నియోజకవర్గాలను అప్పగించారు. శివమొగ్గ, బళ్లారి, మాండ్య నియోజకవర్గాలను డీకేకు అప్పగించింన అధిష్టానం మిగిలిన మంత్రులకు ఒక్కొక్క నియోజకవర్గాన్ని అప్పగించింది. దీంతో అభ్యర్థుల గెలుపు బాధ్యతను మంత్రులపై ఉంచింది. మరి మంత్రులకు ఈ ఎన్నికలు సవాల్ గా మారనున్నాయి.

Tags:    

Similar News