భగ్గుమంటున్నారు….!!!

కర్ణాటక కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. జనతాదళ్ ఎస్ సీట్ల పంపకంలో తేడా రావడంతో వారు భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న సీట్లను సయితం జేడీఎస్ [more]

Update: 2019-03-17 17:30 GMT

కర్ణాటక కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. జనతాదళ్ ఎస్ సీట్ల పంపకంలో తేడా రావడంతో వారు భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న సీట్లను సయితం జేడీఎస్ కు వదిలిపెట్టడంపై కాంగ్రెస్ నేతలు, శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధరామయ్యను కొందరు కాంగ్రెస్ నేతలు టార్గెట్ గా చేసుకున్నారు. జేడీఎస్ తో సిద్ధరామయ్య లాలూచీ పడ్డారన్నది కాంగ్రెస్ సీనియర్ నేతల అభిప్రాయం. పంపకంలో సంఖ్య విషయంలో ఎవరూ అభ్యంతరం చెప్పకపోయినా సీట్ల కేటాయింపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది.

సీట్ల సంఖ్య ఓకే అయినా…..

మొత్తం 28 లోక్ సభ స్థానాలున్న కర్ణాటకలో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఒప్పందం కుదిరింది. కుమారస్వామి, దేవెగౌడ, సిద్ధరామయ్య, దినేష్ గుండూరావులు పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ 20 స్థానాల్లో జేడీఎష్ 8 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు పెద్దగా ఎవరికీ అభ్యంతరం లేకపోయింది. అయితే తమకు బలంగా ఉన్న సీట్లను కాంగ్రెస్ వదిలేయడాన్ని నేతలు తప్ప పడుతున్నారు. సిద్ధరామయ్య కారణంగానే గెలిచే సీట్లను వదులుకోవాల్సి వచ్చిందని సీనియర్ నేతలు సయితం బాహాటంగానే విమర్శిస్తున్నారు.

స్థానాల కేటాయింపులో….

తుముకూరు స్థానాన్ని జేడీఎస్ కు వదిలిపెట్టడంపై సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ అభ్యంతరం తెలిపారు. భవిష్యత్తులో తుముకూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పడాల్సిన కష్టాలను ఆయన గుర్తు చేసుకున్నారు. గెలిచే సీటును వదులుకుని దళానికి అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో అక్కడ శాసనసభ ఎన్నికల్లో ఎలా గెలుస్తామని ప్రశ్నిస్తున్నారు. తుముకూరు కాంగ్రెస్ నేతలు, శ్రేణుల నుంచి పెద్దయెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

సహకరించబోమంటున్న…..

ఇక మాండ్య స్థానాన్ని జేడీఎస్ కు అప్పగించడాన్ని అక్కడి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంబరీష్ భార్య సుమలతకు టిక్కెట్ ఇవ్వకుండా మాండ్యను పువ్వుల్లో పెట్టి దేవెగౌడ కుటుంబానికి అప్పగిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దేవెగౌడ మనవడు నిఖిల్ గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగడం విశేషం. బిజాపుర, ఉత్తర కన్నడ స్థానాలను కూడా జేడీఎస్ కు అప్పగించడాన్ని మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇవన్నీ ఎన్నికల ముందు మామూలేనని.. వాటంతట అవే సర్దుకుంటాయని, రెండు పార్టీల పొత్తు ధర్మంలో భాగంగా సీట్ల కేటాయింపులు జరిగాయని సిద్ధరామయ్య సర్దిచెబుతున్నారు. మొత్తం మీద కర్ణాటకలో సీట్ల పంపకం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిందనే చెప్పాలి.

Tags:    

Similar News