Congress : ఎంపిక అందుకేనట… గెలుపును పక్కన పెట్టినా?

హుజూరాబాద్ ఉప ఎన్నికకు పెద్దగా సమయం లేదు. కాంగ్రెస్ ఇటీవలే అభ్యర్థిని ప్రకటించింది. విద్యార్థి సంఘం నాయకుడిని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఈ ఎత్తుగడ [more]

Update: 2021-10-10 09:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికకు పెద్దగా సమయం లేదు. కాంగ్రెస్ ఇటీవలే అభ్యర్థిని ప్రకటించింది. విద్యార్థి సంఘం నాయకుడిని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఈ ఎత్తుగడ ఫలిస్తుందా? లేదా? అన్నది చూడాలి. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ పేరును ఖరారు చేసింది. ఎన్ఎస్‍యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకట్ పేరును ఖరారు చేయడం వెనక తీవ్ర స్థాయి కసరత్తే కాంగ్రెస్ పార్టీ చేసిందంటున్నారు.

విద్యార్థి సంఘం నేతగా….

బల్మూరి వెంకట్ విద్యార్థి సంఘం నాయకుడు. ఇక్కడ బీసీ సామాజికవర్గం ఎక్కువైనా వెలమ సామాజికవర్గానికి చెందిన బల్మూరి వెంకట్ ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. తాము యువతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పండం ఒకటయితే, అనుబంధ సంఘమైన విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేసుకోవడం కూడా ఒక కారణం. నిజానికి హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదనే చెప్పాలి. అక్కడ పోటీ బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యనే ఉంది.

కాలయాపన చేసినా….

అందుకే కాంగ్రెస్ ఇంత కాలయాపన చేసింది. తొలుత అనేక పేర్లు పరిశీలనలోకి వచ్చినా బల్మూరి వెంకట్ ను అభ్యర్థిగా ప్రకటించి టీఈర్ఎస్ విద్యార్థి సంఘం నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టిక్కెట్ ఇచ్చినట్లుగానే, కాంగ్రెస్ కూడా తమ ఎన్ఎస్‍‍‍యూఐ విభాగానికి సంబంధించి బల్మూరి వెంకట్ కు టిక్కెట్ కేటాయించింది. అయితే సామాజికపరంగా చూసుకుంటే అభ్యర్థి ఎంపిక బలహీనమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

అనుబంధ సంఘాలను….

హుజూరాబాద్ లో తమకు అవకాశం లేదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ తమ అనుబంధ సంఘాలను బలోపేతం చేసుకునే ప్రయత్నం లో పడింది. కాంగ్రెస్ లో అనేక అనుబంధ సంఘాలు ఇటీవల కాలంలో యాక్టివ్ గా లేవు. అనుబంధ సంఘాలను ఏఐసీసీ గుర్తిస్తుందన్న భావన కలిగిస్తే అవి యాక్టివ్ అయి ప్రజల్లోకి వెళతాయన్నది కాంగ్రెస్ సీనియర్ నేతల ఆలోచన. మొత్తం మీద హుజూరాబాద్ లో గెలుపు కన్నా, ఇతర అంశాలే బల్మూరి వెంకట్ ఎంపికకు ప్రధాన కారణాలన్న వ్యాఖ్యలు గాంధీభవన్ లో విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News