కాంగ్రెస్ ను కాపాడేది ఆ రెండేనా?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్. కానీ రెండు దఫాలుగా దానికి అధికారం దక్కలేదు. హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి [more]

Update: 2021-07-21 09:30 GMT

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్. కానీ రెండు దఫాలుగా దానికి అధికారం దక్కలేదు. హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులు కావడంతో సోనియా పేరుతోనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిజానిక 2014 ,18 ఎన్నికల్లోనూ సోనియా గాంధీ స్వయంగా ప్రచారానికి వచ్చినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కే పట్టం కట్టారు. రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేదు. మరి ఈసారి అయినా ప్రజలు సోనియా చేసిన త్యాగానికి మద్దతిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

హైకమాండ్ జోక్యం….?

మరోసారి ఏడేళ్ల తర్వాత సోనియా మాట తెలంగాణలో బలంగా విన్పిస్తుంది. సోనియా గాంధీ పూనుకోవడం వల్లనే తెలంగాణ వచ్చిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అదే సమయంలో ఉద్యమ కారుడిగా కేసీఆర్ పోరాటాన్ని కూడా తక్కువ చేసి చూడలేం. కానీ కేసీఆర్ చేతుల్లోనే ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారు. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలతో పాలన సాగించే కాంగ్రెస్ పాలనను తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. అందుకే రెండు దఫాలుగా కాంగ్రెస్ కు ఓటమి ఎదురవుతుంది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయాలు మారుతున్నాయి. హైకమాండ్ జోక్యం పాలనలో తగ్గింది.

సోనియా కటౌట్ తోనే….

దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నది కాంగ్రెస్ నేతల ప్రయత్నం. సోనియా గాంధీ కటౌట్ తోనే గెలవాలన్న లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ముందుకు వెళుతున్నట్లు కనపిస్తుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి సోనియా పేరు ఉచ్చరించనదే తన ప్రసంగాన్ని ప్రారంభించడం లేదు. అయితే ఏడేళ్ల నుంచి సోనియాకు రాని హైప్ ఇప్పుడు తెలంగాణలో వస్తుందా? అన్నది ప్రశ్నార్థకమే. కానీ రెండు దఫాలుగా అధికారంలో ఉన్న పార్టీపై సహజంగా ఉన్న వ్యతిరేకత సోనియాపై ప్రేమ చూపించే అవకాశమూ లేకపోలేదు. అందుకే కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ పేరుతోనే వచ్చే ఎన్నికలకు మళ్లీ వెళ్లాలనుకున్నారు.

ఫిరాయింపులపైనా..?

రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోవడానికి మరో బలమైన కారణం ఫిరాయింపులే. కాంగ్రెస్ కు ఓట్లేసినా వృధాయేనన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే ఈ ఏడేళ్లలో జరిగిన ఏ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ కు అధికారం దక్కలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సింగిల్ సీటు వచ్చింది. అందుకే కాంగ్రెస్ నేతలు పార్టీ ఫిరాయింపులపై కూడా సీరియస్ గా చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. ఇలాగైనా కొంత ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం కలుగుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది.

Tags:    

Similar News