సారధి సస్పెన్సేనా…?

తెలంగాణ కాంగ్రెస్ కు సారధి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. దీనిపై టెన్ జన్ పథ్ లో కసరత్తు ప్రారంభమయింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించడం [more]

Update: 2019-09-08 16:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ కు సారధి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. దీనిపై టెన్ జన్ పథ్ లో కసరత్తు ప్రారంభమయింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించడం దాదాపు ఖాయమైపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలందరినీ ఢిల్లీకి పిలిపించుకుని వారి అభిప్రాయాలను సేకరించారు. ఎవరికి వారు తమకు కావాలంటే తమకు కావలని, తమకుఇవ్వని పక్షంలో వారికి మాత్రం ఇవ్వవద్దని అధిష్టానం వద్ద కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏఐసీసీ నేత వేణుగోపాల్ వద్ద ఉన్న ఈ పంచాయతీకి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదనే చెబుతున్నారు.

పొడిగించాలని…..

పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతున్నారు. తాను పార్లమెంటు సభ్యుడినే కాబట్టి పూర్తి కాలం రాష్ట్ర పార్టీకే కేటాయిస్తానని ఉత్తమ్ అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పెద్దల దృష్టికి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దాదాపు నాలుగేళ్ల పైగానే ఉండి రెండు ఎన్నికల్లో ఓటమిని తెచ్చిపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించేందుకు అధిష్టానం సయితం ఇష్టపడటం లేదు.

పలువురు ఆశావహులు….

సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత వరసగా అన్ని రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్ష్య నియామకాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోనూ పీసీసీని ప్రక్షాళన చేయాలని సోనియా నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉండేవారికి ప్రాధాన్యత ఇవ్వాలని సోనియా గాంధీ అభిప్రాయపడుతున్నారు. పీసీసీ చీఫ్ రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లు పోటీ పడుతున్నారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వవద్దని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్లు ఇప్పటికే ఫిర్యాదుచేశారు.

రేవంత్ రెడ్డి పేరు….

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇటీవల సోనియాగాంధీని తన కుటుంబ సభ్యులతో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్ రెడ్డి అయితే ఇటు సామాజిక కోణంలోనూ, చరిష్మా ఉన్న నేతగానూ బాగుంటుందని కొందరు అధిష్టానానికి సూచనలు కూడా చేశారు. రేవంత్ అయితే సొంత డబ్బులతో పార్టీ కార్యక్రమాలను చేపడతారని, కేసీఆర్ ను ధైర్యంగా ఎదుర్కొంటారని కూడా అధిష్టానం భావిస్తోంది. అయితే దీనిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. కానీ హుజూర్ నగర్ ఉప ఎన్నిక, మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం ఉంటుందన్న సమాచారం కూడా అందుతుంది.

Tags:    

Similar News