లాయలిస్టులను కాదంటే…?

అసలే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్య పోరు మాత్రం వదలడం లేదు. ఎవరికి వారే నేతలు. అధికారంలో లేకపోయినా విర్రవీగడానికి ఏమాత్రం వెనకాడరు. ఇప్పుడు కొత్తగా [more]

Update: 2019-08-17 00:30 GMT

అసలే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్య పోరు మాత్రం వదలడం లేదు. ఎవరికి వారే నేతలు. అధికారంలో లేకపోయినా విర్రవీగడానికి ఏమాత్రం వెనకాడరు. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో లాయలిస్టు కమిటీ ఒకటి ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతలను పక్కన పెట్టేస్తున్నారన్నది ఆవేదన. ఇప్పటికే వి.హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు పార్టీపై బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కారు.

కాంగ్రెస్ ను వీడేందుకు…..

ఇదే జాబితాలో ఇప్పుడు మర్రి శశిధర్ రెడ్డి, సంభాని చంద్రశేఖర్, నిరంజన్ లాంటి నేతలు తరచూ భేటీల మీద భేటీలు అవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీని నమ్ముకున్న వారికి భవిష్యత్తు లేకుండా పోయిందన్నది వీరి ఆవేదన. ఇప్పటికీ కాంగ్రెస్ లో కొందరు నేతలు పార్టీని వీడేందుకుఇష్టపడటం లేదు. పార్టీ అంటే అంత గౌరవం, ప్రేమ. అయితే తమ అనుభవాలను రాష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది వీరి ఆరోపణ.

హైకమాండ్ కు ఫిర్యాదు చేసినా…

హైకమాండ్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు. తాము వేరే పార్టీలోకి వెళ్లలేమని, కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్నా తమకు గుర్తింపు లేదని మర్రి శశిధర్ రెడ్డి లాంటి నేతలు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ గాడిన పడాలంటే సీనియర్ల సలహాలు తీసుకోవాలని, ముఖ్యమైన పోస్టుల్లో నియామకం చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. అందుకోసమే లాయలిస్టుల కమిటీ పేరుతో తరచూ సమావేశమై తమ వాయిస్ ను అధిష్టానానికి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సోనియా దృష్టికి…..

కొత్తగా పార్టీలో చేరిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందన్నది వీరి ఆరోపణ. తమకు కాంగ్రెస్ ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని వదులుకోలేకపోతున్నామని, అందుకే గుర్తింపు కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు. సోనియా గాంధీ అధ్యక్ష పదవి చేపట్టడంతో నేరుగా ఆమెను కలసి పరిస్థితిని వివరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మర్రిశశిధర్ రెడ్డి లాంటి నేతలకు 2018 లో సీటు దక్కని విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో లాయలిస్టుల కమిటీ పేరుతో మరో ఉద్యమం ప్రారంభమయినట్లే.

Tags:    

Similar News