తెలంగాణాలో పొలిటిక‌ల్ నెంబ‌ర్ గేమ్‌.. అధిరిపోతోందిగా

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ ప‌రిణామాలను అంచ‌నావేయ‌డం ఎవ‌రి సాధ్య‌మూ కావ‌డం లేదు. 2014 వ‌ర‌కు నెంబ‌ర్ 1 పొజిష‌న్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ [more]

Update: 2019-06-24 16:30 GMT

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ ప‌రిణామాలను అంచ‌నావేయ‌డం ఎవ‌రి సాధ్య‌మూ కావ‌డం లేదు. 2014 వ‌ర‌కు నెంబ‌ర్ 1 పొజిష‌న్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అనూహ్యంగా దిగ‌జారిపోయింది. తెలంగాణ‌ను మేమే ఇచ్చాం అని చెప్పుకొన్నా ప్ర‌జ‌లు క‌నిక‌రించ‌లేదు. దీంతో విభ‌జ‌న త‌ర్వాత అధికారంలోకి వ‌స్తుంద‌ని అనుకున్న పార్టీ విప‌క్షానికి నెంబ‌ర్‌-2 స్థానంలో ప‌రిమిత‌మైంది. ఉద్య‌మ నేప‌థ్యంలో అవ‌త‌రించిన టీ ఆర్ ఎస్ నెంబ‌ర్ 1 పొజిష‌న్‌కు చేరింది. ఇక 2014 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత చూస్తే నెంబ‌ర్ -3 స్థానంలో టీడీపీ, నెంబ‌ర్ -4 స్థానంలో బీజేపీ, నెంబ‌ర్ -5లో వైసీపీ ఉన్నాయి. అయితే, ఈ రాజ‌కీయ అంకెలు, సంఖ్య‌ల ప‌రంప‌ర కేవ‌లం ఐదేళ్ల‌లోనే తిర‌గ‌బ‌డింది.

తెలంగాణ‌లో నెంబ‌ర్‌-1 పొజిష‌న్‌లోకి రావాల‌ని ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఎక్క‌డిక‌క్క‌డ ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించిన అతిపెద్ద‌పార్టీ పూర్తిగా చిన్న బోయింది. చంద్ర‌బాబుతో పెట్టుకున్న చెలిమి బెడిసి కొట్టింది. ఈ క్ర‌మంలో తిరుగులేని మెజారిటీతో కేసీఆర్ మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, పార్టీని ఫ‌స్ట్ పొజిష‌న్‌లో నిల‌బెట్టారు. దీంతో మ‌రోసారి తెలంగాణ కాంగ్రెస్ కు సెకండ్ పొజిష‌నే ద‌క్కింది. అయితే, ఇప్పుడు ఇది కూడా నిల‌బ‌డ‌డం లేదు. ఇప్ప‌టికే నెంబ‌ర్ -3, 5 పొజిష‌న్‌లో ఉన్న టీడీపీ, వైసీపీలు దిక్కుదివాణం లేకుండా పోయాయి. ఈ రెండు పార్టీల‌కు తెలంగాణ‌లో రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేదు. అందుకే తాజా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అస్స‌లు ఈ పార్టీలు పోటీయే చేయ‌లేదు.

అదే స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసి, కేసీఆర్‌ను త‌మ దారిలోకి తెచ్చుకొని.. తెలంగాణాలో జెండా పాతాల‌ని బీజేపీ నాయ‌కులు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రినీ పార్టీలోకి చేర్చు కున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ నెంబ‌ర్‌-3 పొజిష‌న్‌కు ప‌డిపోగా.. కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీ వ‌చ్చి చేరుతోంది. దీంతో నెంబ‌ర్లాట మ‌రింత ర‌స‌కందాయంగా మారింది. ఇక‌, టీడీపీ ప‌రిస్థితి ఉన్నామంటే ఉన్నామ‌న్న‌ట్టుగానే ఉండ‌డం మ‌రింత శోచ‌నీయం. ఇక‌, తాజాగా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయ‌న టీ కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

ఇక రేవంత్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిపై కూడా బీజేపీలోకి వెళ‌తార‌న్న వార్త‌లు అయితే వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే కొంత మంది కాంగ్రెస్‌ మాజీ శాసనసభ్యులతో బీజేపీ నేతలు తాజాగా సంప్రదింపులు ప్రారంభించారు. ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు వారిలో ఉన్నట్లు సమాచారం. వారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కొద్ది రోజుల క్రితం కలిసినట్లు సమాచారం. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ ముఖ్య నేతలతో ఇప్పటికే పలు మార్లు సమావేశమయ్యారు. చేరికల వ్యూహాన్ని ముమ్మరం చేయాలని, ముందు కు వచ్చే అందరినీ చేర్చుకోవాలని పార్టీ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యించింది.

ఈక్ర‌మంలోనే మల్కాజిగిరి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, మహబూబాబాద్‌ మాజీ ఎంపీ బలంరాం నాయక్ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోం ది. సర్వే దాదాపుగా బీజేపీలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.ఇక‌, టీడీపీ బ‌హిష్కృత నాయ‌కుడు ఎస్సీ వ‌ర్గానికి చెందిన మొత్కుప‌ల్లి న‌ర్సింహులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యార‌ని అంటున్నారు. ఏదేమైనా వ‌చ్చే ఆరేడు నెల‌ల్లోనే తెలంగాణ‌లో బీజేపీ కాంగ్రెస్ ప్లేస్‌ను ఆక్ర‌మించే సూచ‌న‌లు పుష్క‌లంగా ఉన్నాయి. మ‌రి ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎలా పుంజుకుంటుందో ? చూడాలి.

Tags:    

Similar News