Congress : అశోక్ ను సెట్ చేయకపోతే?

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం మూడు మాత్రమే. మహారాష్ట్ర, తమిళనాడులో అధికారంలో భాగస్వామిగా ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్ అధినాయకత్వం [more]

Update: 2021-11-11 16:30 GMT

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం మూడు మాత్రమే. మహారాష్ట్ర, తమిళనాడులో అధికారంలో భాగస్వామిగా ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయాల కారణంగా దెబ్బతినింది. ఎన్నికలకు ముందు ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ కొత్త పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. ఇక రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో కూడా విభేదాలు ముదురుతూనే ఉన్నాయి.

రిపీట్ కాకుండా…

రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతుంది. అశోక్ గెహ్లాత్ ముఖ్యమంత్రి గా ఉన్నారు. అక్కడ కూడా ముఖ్యమంత్రిపై తీవ్ర అసంతృప్తి ఉంది. మధ్యప్రదేశ్ లో సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి దూరమయ్యారు. అదే రాజస్థాన్ లో రిపీట్ అవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం కొంత జాగ్రత్త పడుతుందనే చెప్పాలి. ముఖ్యంగా సచిన్ పైలట్ వర్గాన్ని సముదాయించే యత్నంలో ఉంది.

సచిన్ వర్గాన్ని…

అశోక్ గెహ్లాత్ తో విభేదించి సచిన్ పైలట్ పార్టీపై తిరుగుబాటు చేశారు. అయితే వెంటనే రాహుల్ గాంధీ జోక్యంతో కొంత సర్దుబాటు అయింది. వీరిద్దరి మధ్య సమన్వయ కమిటీని ఏర్పరచినా ప్రయోజనం కన్పించడం లేదు. ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి ఎక్కువగానే కన్పిస్తుంది. అశోక్ గెహ్లాత్ ను మంత్రి వర్గ విస్తరణ చేయాలని ఎప్పటి నుంచో హైకమాండ్ చెబుతోంది. అందులో సచిన్ పైలెట్ వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.

మంత్రి వర్గ విస్తరణకు…

అయినా అశోక్ గెహ్లాత్ ఇప్పటి వరకూ మంత్రివర్గాన్ని విస్తరించలేదు. దీంతో ఢిల్లీకి పిలిపించి అశోక్ గెహ్లాత్ కు అధిష్టానం క్లాస్ పీకినట్లు తెలిసింది. పంజాబ్ రాజకీయ పరిణామాల తర్వాత అధినాయకత్వం కొంత రాజస్థాన్ పై దృష్టి పెట్టినట్లే కనపడుతుంది. మంత్రి వర్గ విస్తరణ త్వరగా చేయాలని, జాబితా కూడా తామే తయారు చేస్తామని హైకమాండ్ చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద రాజస్థాన్ మరో పంజాబ్ కాకూడదన్న కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Tags:    

Similar News