ఆజాద్ చెప్పి వెళ్లారట

వరస ఓటములతో కుదేలైపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడాలంటే రాష్ట్రాల్లో కూడా [more]

Update: 2019-11-09 09:30 GMT

వరస ఓటములతో కుదేలైపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడాలంటే రాష్ట్రాల్లో కూడా బలంగా ఉండాలన్న విషయాన్ని గులాం నబీ గుర్తు చేశారు. ఓటములు సర్వ సాధారణమని, ఓటు బ్యాంకును రక్షించుకోవడమే బాధ్యత అని కర్తవ్య బోధ చేశారు. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశమై త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నిలకు సమాయత్తం కావాలని గట్టిగా చెప్పారు.

కలత చెందకండి…..

అయితే పీసీసీ అధ్యక్షుడి మార్పు విషయం సోనియా గాంధీ చూసుకుంటారని, కాంగ్రెస్ పార్టీ తొలుత పట్టణ ప్రాంతాలపై దృష్టి పెట్టి అత్యధిక మున్సిపాలిటీలను గెలుచుకోవాల్సిన అవసరాన్ని నేతలకు చెప్పారు. హుజూర్ నగర్ ఓటమితో కలత చెందాల్సిన పనిలేదని, అధికార పార్టీకి అనుకూలంగానే ఉప ఎన్నికలు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోరాదని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకున్నారు.

మున్సిపల్ ఎన్నికలకు….

తెలంగాణలో త్వరలో మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాచరణను రూపొందించుకుంది. వీలయితే ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలను కూడా కలుపుకోవాలని నిర్ణయించుకుంది. తమ పార్టీకి ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే తమతో కలసి వచ్చే వారికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఎన్నికల పర్యవేక్షణ, ప్రచార బాధ్యత, అభ్యర్థుల ఎంపిక కూడా నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ఎమ్మెల్యేలకు అప్పగించనున్నారు. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఎక్కడికక్కడ కమిటీలు….

రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ కు దాదాపు 38 నియోజకవర్గాల్లో బాధ్యులు లేరు. అయితే ఈ 38 నియోజకవర్గాల్లో కమిటీ వేసి ఒక కో-ఆర్డినేటర్ ను నియమించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇక రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి క్యాడర్ లో జోష్ నింపాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ఒక సమన్వయ కమిటీని నియమించాలని కూడా గులాంనబీ ఆజాద్ సూచించినట్లు తెలిసింది. దీంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను కాంగ్రెస్ చేపట్టి ఇటు క్యాడర్ తో పాటు, అటు ప్రజల్లోనూ దగ్గరవ్వాలని భావిస్తున్నారు. మొత్తం మీద గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నేతలకు క్లాస్ తో పాటు సలహాలు కూడా ఇచ్చి వెళ్లారట. మరి మున్సిపల్ ఎన్నికల్లోనైనా ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్ పరువును నిలబెట్టాలంటున్నారు అభిమానులు.

Tags:    

Similar News