హమ్మయ్య.. గండం గడచినట్లేనా…??

కర్ణాటక సంకీర్ణ సర్కార్ మనుగడ ప్రమాదంలో పడిన సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్, జేడీఎస్ లకు ఊరటనిచ్చాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని [more]

Update: 2019-06-03 18:29 GMT

కర్ణాటక సంకీర్ణ సర్కార్ మనుగడ ప్రమాదంలో పడిన సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్, జేడీఎస్ లకు ఊరటనిచ్చాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో సంకీర్ణ సర్కార్ భవిష్యత్తు దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా మారింది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఇటు ముఖ్యమంత్రి కుమారస్వామి, అటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధల వరదను పారించాలని డిసైడ్ అయ్యారు.

అసంతృప్తిని తొలగించేందుకు….

దీంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టాలని నిర్ణయించారు. అప్పుడయినా అసంతృప్తి కొంత తగ్గుముఖం పడుతుందని అంచనా వేశారు. అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాలతో నీరసంగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ లకు అనుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కలసి వచ్చినట్లే కన్పిస్తుంది. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని మట్టి కరిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని కనపర్చింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ల ఎన్నికల్లో అధికశాతం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. జేడీఎస్ కూడా అనుకున్న మేర ఫలితాలను సాధించింది.

తాజా ఫలితాలతో….

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గే అవకాశముందని భావిస్తున్నారు. ప్రజాతీర్పు కాంగ్రెస్ పక్షాన ఉన్నప్పడు పార్టీ మారడం వృధా అని ఎమ్మెల్యేలు భావిస్తారని పార్టీ అధినేతలు అంచనా వేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ప్రజాప్రతినిధులు ఎక్కవగా పరిగణనలోకి తీసుకుంటారు. లోక్ సభ అంటే జాతీయ స్థాయిలో అంచనా వేసి ఓటు వేస్తారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలపై ఆధారపడి జరుగుతాయని చెబుతున్నారు.

వెనక్కు తగ్గుతారా?

ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో వెనక్కు తగ్గక తప్పదంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి వచ్చేందుకు వెనకాడుతారన్నది బీజేపీ వర్గాల అంచనా. రాజీనామా చేయకుండా పార్టీలో తీసుకోవడం కేంద్ర నాయకత్వానికి ఇష్టం లేదు. కనుక స్వచ్ఛందంగా తమంతట తామే పార్టీలోకి వచ్చేవారికే స్వాగతం పలకాలన్నది బీజేపీ నేతల భావన. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సంకీర్ణ ప్రభుత్వానికి కొంతకాలం ప్రాణం పోశాయన్నది విశ్లేషకుల అంచనా. మరి యడ్యూరప్ప ఏం చేస్తారన్నది ఆసక్తిగా ఉంది.

Tags:    

Similar News