అప్పగించేసినట్లేనా….??

హస్తినలో రాజకీయం వేడెక్కింది. ఇన్నాళ్లూ ఉన్న ప్రచారానికి అడ్డుకట్ట పడింది. భారత జాతీయ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలసి పోటీ చేస్తాయని భావించారు. కానీ అనేక [more]

Update: 2019-04-27 16:30 GMT

హస్తినలో రాజకీయం వేడెక్కింది. ఇన్నాళ్లూ ఉన్న ప్రచారానికి అడ్డుకట్ట పడింది. భారత జాతీయ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలసి పోటీ చేస్తాయని భావించారు. కానీ అనేక చర్చల తర్వాత కూడా రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లు విడివిడిగానే పోటీకి దిగాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఒంటరిగానే పోటీకి దిగడంతో ఇక్కడ ట్రయాంగల్ ఫైట్ ప్రతి నియోజకవర్గంలో నెలకొంది. ఢిల్లీలోని ఏడు నియోజవర్గాలకు మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తికావడంతో మూడు పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఆప్ వచ్చిన తర్వాత…..

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో బలంగా ఉంది. తర్వాత బీజేపీ కూడా సంస్థాగతంగా ఢిల్లీలో పాతుకుపోయి ఉంది. ఢిల్లీలో ఉన్న మొత్త ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లోనూ భారతీయ జనతా పార్టీ బలంగా ఉందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ఆప్ ఆవిర్బావం తర్వాత ఓటు బ్యాంకు తగ్గిపోయింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీపై ప్రత్యేక దృష్టి పెట్టి అభ్యర్థులను ఎంపిక చేశారు. కొందరు సీనియర్ నేతలను, సిట్టింగ్ ఎంపీలను కూడా పక్కన పెట్టి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించారు. దీంతో కొంత అసంతృప్తులు చెలరేగినా కమలం పార్ఠీ దానిని పోలింగ్ తేదీ నాటికి సర్దుబాటు చేసుకుంటామన్న ధీమాలో ఉంది.

అసంతృప్తితో జనం…

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఏడు స్థానాల్లోనూ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తొలుత కాంగ్రెస్ పార్టీతో జత కట్టాలని భావించింది. గత కొన్నేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కూడా ఢిల్లీలో కొంత అసంతృప్తి ఉంది. ఢిల్లీ కాలుష్యంతో పాటు ట్రాఫిక్, మంచినీటి సరఫరా, నిత్యవసరాల పంపిణీ వంటి విషయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా విజయవంతం కాలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీకి గత ఎన్నికల్లో అండగా నిలిచిన మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు సయితం కొంత అసంతృప్తితో ఉన్నాయని గుర్తించింది. అందుకోసమే కాంగ్రెస్ తో కలసి పోటీ చేయాలని భావించింది.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని….

కాంగ్రెస్ కు రెండు స్థానాలు ఇస్తామని కబురు పంపింది. హర్యానా, ఛత్తీస్ ఘడ్ లలో కూడా పొత్తు ఉండాలని తిరకాసు పెట్టింది. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడలేదు. ముఖ్యంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ దీనికి అంగీకరించలేదు. రాహుల్ సయితం ఆప్ తో పొత్తుకు విముఖత చూపారు. ఇప్పుడు ఆప్ తో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో ఢిల్లీ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోలేమని భావించి పొత్తుకు దూరమయింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ లబ్దిపొందే అవకాశాలున్నాయంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకుంటే బీజేపీ భారీగానే లబ్ది పొందవచ్చన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News