ఇక్కడ రాహుల్ రాజవుతారా...?

Update: 2018-06-19 16:30 GMT

ఛత్తీస్ ఘడ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు పార్టీలూ ఇప్పటికే వ్యూహరచనను ప్రారంభించాయి. ఈ ఎన్నికల అనంతరం వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలను రెండు పార్టీలూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. చత్తీస్ ఘడ్ లో బీజేపీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ , మిజోరాంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి లాల్ తన్హ్ వాలా చక్రం తిప్పుతున్నారు. మధ్యప్రదేశ్ ను విభజించి 2000 నవంబరు 1న చత్తీస్ ఘడ్ ను ఏర్పాటు చేసింది అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం. దేశంలో 26వ రాష్ట్రంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది ఈ చిన్న రాష్ట్రం.

ఈసారి గెలవాలని......

రాష్ట్ర ఆవిర్భావ సమయంలో అజిత్ జోగి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంసాధించింది. అప్పటి నుంచి ఆ పార్టీ నాయకుడు రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటం వశేషం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలోనే ఉంది. టీఎస్ సింగ్ దేవ్ అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా ఉన్నారు. అయిదేళ్ల క్రితం 2013లో జరిగిన ఎన్నికలలో బీజేపీ 49 స్థానాలను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. విపక్ష కాంగ్రెస్ 39 స్థానాలతోనే సరిపెట్టుకుంది. 91 స్థానాలుగల చత్తీస్ ఘడ్ అసెంబ్లీలో రెండు పార్టీలూ పోటాపోటీగా ఉన్నాయి. వెనుకబడిన రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ లో మూడో వంతు మంది గిరిజనులే. 11.6 శాతం మంది ఎస్సీలు. దాదాపు సగం మంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువనే ఉన్నారు. నక్సల్స్ సమస్యతో రాష్ట్రం సతమతమవుతూ ఉంది. సహజవనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ రాష్ట్రం ఇప్పటికే వెనుకబడే ఉంది.

రమణ్ సింగ్ నేతృత్వంలోనే.....

ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సారథ్యంలోనే అధికార బీజేపీ మళ్లీ ఎన్నికలను ఎదుర్కొననుంది. విపక్ష నేత టీఎస్ సింగ్ దేవ్ ఆధ్వర్యంలోనే విపక్ష కాంగ్రెస్ ఎన్నికల గోదాలోకి దిగుతోంది. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రమణ్ సింగ్ కు వ్యక్తిగతంగా మంచిపేరుంది. ఆయన హయాంలోనే నూతన రాజధాని నయా రాయపూర్ నిర్మాణం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేదలకు బియ్యం సరఫరాలో ఆయన శ్రద్ధ వహించారు. దీంతో ఆయనకు ‘‘చావల్ బాబా’’గా పేరుంది. అయితే గత కొంతకాలంగా రమణ్ సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పలు కుంభకోణాలతో సతమతమవుతోంది. 2000 సంవత్సరంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అధికారం అందుకున్న కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగి 2003 ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ తో విభేదించిన జోగీ ‘‘జనతా కాంగ్రెస్’’ పేరిట సొంత పార్టీని ఏర్పాటు చేశారు. ఈ దఫా కాంగ్రెస్ ను దెబ్బతీయాలన్న పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ అధికార పార్టీకి తొత్తుగా మారిందన్నది ఆయన ప్రధాన ఆరోపణ.

జోగి కసి మామూలుగా లేదు......

గిరిజనుల్లో జోగీకి మంచి పట్టుంది. మాజీ ఐఏఎస్ అధికారి ఆయన 2016 జూన్ లో కొత్త పార్టీని ప్రారంభించారు. కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఆయన పార్టీ వైపు చూస్తున్నారు. పీసీసీ చీఫ్ భూపేష్ బాఘెల్, విపక్ష నేత టీఎస్ సింగ్ దేవ్ కాంగ్రెస్ ను నడిపిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య సీట్ల తేడా పది మాత్రమే. ఓట్ల శాతంలో మాత్రం పెద్దగా తేడా లేదు. 2008లో కాంగ్రెస్ 40.16 శాతం, బీజేపీ 41.96 శాతం, 2013లో కాంగ్రెస్ 40.29, బీజేపీ 41.06 శాతం ఓట్లు సాధించాయి. ఓట్ల శాతం తక్కువ కాబట్టి ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, తగ్గుతున్న మోదీ ప్రభ, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు తమకు కలసి వస్తాయని హస్తం పార్టీ భావిస్తుంది. అభివృద్ధి పనులపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఏదిఏమైనా బీజేపీకి ఈసారి ఇక్కడ అంత తేలిక కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2008,2013 ఎన్నికల్లో 17.88, 18.65 శాతం ఓట్లను సాధించిన బీఎస్పీ తదితర పార్టీలను కూడా తక్కువగా అంచనా వేయలేం.

పదేళ్ల నుంచి....

ఈశాన్యంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరాం. దేశ వ్యాప్తంగా పంజాబ్, పుదుచ్చేరితో పాటు మిజోరాంలోనే హస్తం పార్టీ అధికారంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 10,91,014. 51.51శాతం మంది పట్టణ జనాభా. ప్రతి వెయ్యి మంది పురుషులకు 970 మంది మహిళలున్నారు. 2011 లెక్కల ప్రకారం 91.33 శాతం అక్షరాస్యత. 95 శాతం మంది గిరిజనులే. 87 శాతం మంది మిజోలు, క్రిస్టియన్లు. 8 శాతం మంది బౌద్ధులున్నారు. అక్రమ వలసలు ఎన్నికలలో ప్రధాన అంశం కాబోతోంది. పొరుగున ఉన్న మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్ ల నుంచి పెరుగుతున్న అక్రమ వలసపై స్థానికులు అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ‘చక్మా’ల వలస ఎక్కువగా ఉంది. మౌలిక వసతుల లేమి, నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

ఇక్కడ బీజేపీ వ్యూహమిదే...

అస్సోంలో భాగమైన మిజోరాం 1972లో కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. తీవ్రవాదంతో సతమతమైంది ఈ చిన్న రాష్ట్రం. 1986 చివర్లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ, తీవ్రవాద సంస్థలతో త్రైపాక్షిక ఒప్రందంతో ఆ సమస్య అంతమైంది. ఫలితంగా దేశంలో 23వ రాష్ట్రంగా 1987 ఫిబ్రవరి 20న మిజోరాం అవతరించింది. 2008 నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ పార్టీ నాయకుడు 79 ఏళ్ల లాల్ తన్హ్ వాలా సీఎంగా చక్రం తిప్పుతున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 34 స్థానాలను సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. మిజో నేషనల్ ఫ్రంట్ అయిదు స్థానాలకే పరిమితమయింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఏకైక స్థానాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ పటిష్టంగానే ఉంది. మిజో నేషనల్ ఫ్రంట్ నాయకుడు వనల్ జ్వామా వైపు బీజేపీ చూస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాలను కైవసం చేసుకున్న బీజేపీ మిజోరామ్ ను కూడా తన ఖాతాలో చేర్చుకోవాలని చూస్తోంది. కొద్ది పాటి హిందువల ఓట్లను గంపగుత్తగా పొందడం, గిరిజనులు, ఎస్సీల్లో చీలిక ద్వారా లబ్ది పొందాలన్నది బీజేపీ వ్యూహం. మొత్తానికి రెండు జాతీయ పార్టీలూ గెలుపు కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News