Ycp : వరుదు దాడిని దాటుకుని ఇలా వచ్చారా?

మూడు పార్టీలు మారినా పదవులు వరించాయి. పార్టీలోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు. ఎంత వేగంగా ఎదిగామన్నదే ముఖ్యం. విశాఖ జిల్లాలో వరుదు కల్యాణికి ఎమ్మెల్సీ పదవి లభించడం [more]

Update: 2021-11-13 05:00 GMT

మూడు పార్టీలు మారినా పదవులు వరించాయి. పార్టీలోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు. ఎంత వేగంగా ఎదిగామన్నదే ముఖ్యం. విశాఖ జిల్లాలో వరుదు కల్యాణికి ఎమ్మెల్సీ పదవి లభించడం కూడా ఆ కోవలోకి చెందినదే. వరుదు కల్యాణికి పదవి లభిస్తుందని తొలి నుంచి ఊహించిందే. బీసీ + మహిళ కోటాలో వరుదు కల్యాణికి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి లభించింది. ఊహించిందే అయినా పార్టీ సీనియర్ నేతలకు ఒకింత షాకిచ్చినట్లే అయింది.

దాడి సీనియర్ నేతగా…

విశాఖ జిల్లాలో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. దాడి వీరభద్రరావు ఎన్నాళ్ల నుంచో పదవి కోసం వేచి చూస్తున్నారు. దాడి వీరభద్రరావు తొలుత టీడీపీ ఆ తర్వాత వైసీపీ మళ్లీ టీడీపీ తిరిగి వైసీపీ ఇలా పార్టీ మారుకుంటూ వచ్చారు. అదే విధంగా వరుదు కల్యాణి కూడా టీడీపీ, ప్రజారాజ్యం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి వైసీపీలో చేరారు. చివరకు సీనియర్లకు దక్కని పదవిని చేజిక్కించుకున్నారు.

ఇద్దరూ పార్టీలు మారి….

విశాఖ జిల్లా అంటేనే తొలుత గుర్తొచ్చేది దాడి వీరభద్రరావు. దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగానే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీ హయాంలో జిల్లా రాజకీయాలను శాసించారు. కానీ పార్టీలు మారడం, జగన్ పై నమ్మకం ఉంచకపోవడంతో ఆయనకు ఈసారి కూడా పదవి చేజారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పెద్దల సభ అంటే దాదాపు సీనియర్లకు అవకాశం కల్పిస్తారు. కానీ చిన్న వయసులోనే వరుదు కల్యాణి పెద్దల సభలోకి ప్రవేశించబోతున్నారు.

నమ్మకమే….

వరుదు కల్యాణి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారైనా వైసీపీ ఆవిర్భవించిన నాటి నుంచి విశాఖ కేంద్రంగా ఆమె పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్ పాదయాత్రలోనూ చురుగ్గా పాల్గొన్నారు. దాడి, వరుదు ఇద్దరూ బీసీ నేతలయినా జగన్ ఛాయిస్ వరుదు కల్యాణి వైపే చూసింది. దీంతో దాడి వీరభద్రరావుకు కనుచూపు మేరలో ఇక పదవి లేనట్లే కనపడుతుంది. పార్టీకి నమ్మకంగా పనిచేయడమే ఆమెకు పదవి లభించడంలో ప్లస్ అయింది.

Similar News