వచ్చే సారికి అంతా ఫ్రెష్ లుక్ అట… ?

వంద కోట్లాది మంది ప్రజానీకం ఉన్న దేశంలో ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరైనా లక్కీ కిందనే లెక్క. వారు ఒకసారి కాదు పలుసార్లు అయ్యారూ అంటే అది ఏ [more]

Update: 2021-09-16 14:30 GMT

వంద కోట్లాది మంది ప్రజానీకం ఉన్న దేశంలో ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరైనా లక్కీ కిందనే లెక్క. వారు ఒకసారి కాదు పలుసార్లు అయ్యారూ అంటే అది ఏ పూర్వ జన్మ సుకృతమో అనుకోవాలి. అయితే ఇపుడు కాలం మారుతోంది. రాజకీయం కూడా మారింది. ఎక్కువ సార్లు వారిని కొనసాగించడానికి అధినాయకత్వం కూడా సుముఖంగా ఉండడంలేదు. జనాలు సైతం మొహం మొత్తింది అంటున్నారు. ఒక ఎమ్మెల్యే ఫస్ట్ టైమ్ అయిన వారు కూడా పొలిటికల్ కెరీర్ మీద శ్రద్ధ పెట్టి లాంగ్ రన్ కోసం ప్రయత్నాలు కూడా చేయడంలేదు. ఈ పరిణామాలతో చాలా మంది వైసీపీలోనూ వన్ టైమ్ ఎమ్మెల్యేలు, ఎంపీలుగానే మిగిలిపోతున్నారు.

ఈ లిస్ట్ పెద్దదే….?

ఇక అధికార వైసీపీ విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం డెబ్బై నుంచి వంద సీట్లలో కొత్తవారికే చాన్స్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలను తీసుకుంటే చాలా మంది తల రాతలు మారిపోతాయని చెబుతున్నారు. ఇక్కడ మొత్తం ముప్పయి నాలుగు ఎమ్మెల్యే, అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినది 28 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ సీట్లు, వీటిలో సగానికి పైగా సీట్లలో ఈసారి కొత్త ముఖాలను చూడవచ్చు అని వైసీపీ వర్గాల మాటగా ఉంది.

వీరంతా ఇంటికే…?

ముందుగా శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఇచ్చాపురం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, రాజాం నుంచి కంబాల జోగులు, పాలకొండ నుంచి కళావతికి ఈసారి టిక్కెట్లు కష్టం అంటున్నారు. ఇక ఆముదాలవలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం తానే రిటైర్మెంట్ అంటున్నారు. దాంతో కొడుకు చిరంజీవి నాగ్ కి టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నా ఇక్కడ కొత్తవారికే చాన్స్ అంటున్నారు. అంతే కాదు ఎచ్చెర్లలో కూడా గొర్లె కిరణ్ కుమార్ ని తప్పించవచ్చు అన్న మాట ఉంది. ఇలా వైసీపీలో సగం చోట్లలో పాతవారిని పక్కన పెట్టేస్తారు అన్నది టాక్. దానికి వారి పూర్ పెర్ఫార్మెన్స్ ఒక కారణం అయితే ఫ్రెష్ లుక్ కోసం ప్రయత్నం మరో కారణంగా ఉందిట.

అవుట్ చేస్తారట…

ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు కి ఈసారి చెక్ పెట్టేస్తారు అంటున్నారు. బొబ్బిలిలో శంబంగి చిన అప్పలనాయుడుకు నో టికెట్ అని తెలుస్తోంది. ఎస్ కోట, నెల్లిమర్ల ఎమ్మెల్యేల టికెట్లు కూడా గల్లంతే అన్న మాట ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటి అంటే సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే, వైఎస్సార్ ఫ్యామిలీకి సన్నిహితుడు అయిన సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరకు కూడా ఈసారి టికెట్ దక్కకపోవచ్చు అంటున్నారు. ఆయన చాలా సార్లు గెలిచి జనాలకు బోర్ కొట్టడమే కారణంగా చెబుతున్నారు. ఇదే తీరున విశాఖ జిల్లాలో చూస్తే పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాడుగుల నుంచి బూడి ముత్యాలరావు, పాడేరు నుంచి భాగ్యలక్ష్మి, చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ, గాజువాక నుంచి తిప్పల గురుమూర్తి రెడ్డిలకు ఈసారి హ్యాండ్ ఇస్తారని ప్రచారం అయితే ఉంది. చూడాలి మరి ఇంకా సగం పాలనే ఉంది కాబట్టి ఏమైనా మార్పుచేర్పులు ఉంటాయేమో. మరో వైపు చూస్తే ఈ మూడు జిల్లాలలో ఎంపీ అభ్యర్ధులుగా పూర్తిగా కొత్తవారే వస్తారని అంటున్నారు

Tags:    

Similar News