కమ్మదనం కరిగిపోతోందా… ?

కమ్మ సామాజికవర్గానికి సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. వారు స్వతహాగానే ప్రతిభావంతులు. ఎన్నో రంగాల్లో వారు ఉన్నారు. తాము చేపట్టిన రంగంలో అంచులు చూసే సత్తా [more]

Update: 2021-08-10 02:00 GMT

కమ్మ సామాజికవర్గానికి సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. వారు స్వతహాగానే ప్రతిభావంతులు. ఎన్నో రంగాల్లో వారు ఉన్నారు. తాము చేపట్టిన రంగంలో అంచులు చూసే సత్తా వారికి ఉంది. ఇక ఆధునిక తెలుగు సమాజంలో కానీ భారతీయ సమాజంలో కానీ వారి స్థానం చాలా ఎన్నతగినది అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వారు లేని రంగం లేదు అన్న మాట నిజం. వారు ఎక్కని కీర్తి శిఖరాలు కూడా లేవు అని చెప్పుకుంటే కూడా అతిశయోక్తి లేదు. అటువంటి కమ్మ వారి పరిస్థితి కీలకమైన కొన్ని రంగాలలో ఇపుడు కొంత ఇబ్బందులో పడింది అని చెప్పాలేమో.

ఆయన స్థాయిలో….

స్వాతంత్ర పోరాటంలో కూడా కమ్మవారు చక్కని భూమిక పోషించారు. ఆ తరువాత స్వతంత్ర భారత దేశంలో ఏర్పడిన ప్రభుత్వాలలో కీలక పాత్రను నిర్వహించారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం వారు కేవలం మంత్రులుగానే మిగిలిపోయారు. కోరుకున్న ఉన్నత స్థానం దక్కలేదు. ముఖ్యమంత్రి పదవి ఎపుడూ ఒకటి రెండు సామాజిక వర్గాలకే పరిమితం అవుతోంది తప్ప తమకు రావడంలేదు అన్న బాధ నుంచి పుట్టినదే తెలుగుదేశం పార్టీ అంటారు. అలా తెలుగు సినీ వల్లభుడు ఎన్టీయార్ పెట్టిన పార్టీతో రాజకీయంగా వారు ఉన్నత స్థానానికే ఎదిగారు. ఎన్టీయార్ మరణాంతరం చూస్తే ఆ స్థాయి నేత మళ్ళీ ఆ సామాజికవర్గానికి దక్కలేదు అనే చెప్పాలి.

అక్కడా అంతే…?

ఇక ఎన్టీయార్, ఏయన్నార్ వంటి కళాకారులు తెలుగు సినిమాకు రెండు కళ్ళు అని ఇప్పటికీ చెబుతారు. ఎన్టీయార్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి ప్రవేశించాక సినిమా రంగంలో కమ్మ వారి ఆధిపత్యం మెల్లగా తగ్గుముఖం పట్టింది. అప్పటికే నవతరం హీరోలు వచ్చారు. ఒక సునామీలా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ మొత్తాన్ని కమ్మేశారు. ఆయన సొంతంగా ఎదిగి ఆ స్థాయికి చేరుకున్నారు. తెలుగు సినిమా నడకను మార్చి ఏకంగా పరుగులు పెట్టించారు. వాణిజ్యపు లెక్కలను కూడా మార్చేశారు. బాలీవుడ్ సైతం టాలీవుడ్ దిశగా చూసేలా చేసిన ఘనత చిరంజీవిదే అని చెప్పాలి. అటువంటి చిరంజీవి చుట్టూ టాలీవుడ్ మొత్తం తిరగడంలో ఆశ్చర్యం అయితే లేదు. అయితే ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా హవా చాటిన కమ్మ వారు మాత్రం వెనకబడిపోయారు. వారిలో ఆ ఆవేదన అయితే ఉందనే చెబుతారు.

కాలమే చెప్పాలి …

ఎన్టీయార్ అక్కినేని రాక ముందు సినీ సీమలో నాగయ్య స్టార్ గా ఉండేవారు. ఆయన 1940లలోనే లక్ష రూపాయలు పారితోషికం తీసుకునేవారు అని చెబుతారు. ఆయన తరువాత వచ్చిన ఈ ఇద్దరు టాలీవుడ్ ని శాసించారు. ఇపుడు మెగాస్టార్ తన వెంట తీసుకెళ్తున్నారు. మరి టాలీవుడ్ లో కమ్మ వారు మునుపటిలా శాసించే స్థానంలో ఉంటారా అంటే అది కాలమే చెప్పాలి. మరో వైపు రాజకీయ రంగాన చూసుకుంటే తెలంగాణా, ఆంధ్రాలలో వెలమ, రెడ్డి సామాజిక వర్గాలు రాజ్యాలు చేస్తున్నాయి. తెలంగాణాలో కేసీయార్ ఓడితే కాంగ్రెస్ నుంచి రెడ్లు మళ్లీ పవర్ అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఏపీలో జగన్ ఓడితే టీడీపీకి చాన్స్ రావాలి. మరి ఆ దిశగా పోరాటం సాగుతోందా అంటే కొంత నిరాశే జవాబుగా వస్తోంది. మొత్తానికి కీలకమైన రెండు రంగాలు, ప్రజలతో డైరెక్ట్ గా సంబంధ బాంధవ్యాలు ఉన్న రంగాలలో దశాబ్దాల తరబడి ఆధిపత్యం వహించిన కమ్మలు ఇపుడు వెనకబడడం అంటే వారికి బాధగానే ఉంటుంది. కానీ ఇది కాలం ఇచ్చిన తీర్పుగానే భావించి ఆశావహ దృక్పధంతో అడుగులు ముందుకు వేయడమే కర్తవ్యం కావాలి.

Tags:    

Similar News