ఎందుకీ పంతాలు… తగ్గకుంటే నష్టం ఎవరికి?

రెండు పార్టీల అధినేతలు ప్రతిష్టకు పోతున్నారు. ఏపీ పరువును తీస్తున్నారు. శాసనమండలిలో జరిగిన తీరును చూస్తుంటే సులువుగా అర్థమవుతుంది. వీరికి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజావసరాలు పట్టవు. [more]

Update: 2020-06-18 08:00 GMT

రెండు పార్టీల అధినేతలు ప్రతిష్టకు పోతున్నారు. ఏపీ పరువును తీస్తున్నారు. శాసనమండలిలో జరిగిన తీరును చూస్తుంటే సులువుగా అర్థమవుతుంది. వీరికి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజావసరాలు పట్టవు. శాసనమండలి అంటే పెద్దల సభ. సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ టీడీపీ శాసనమండలిని తన రాజకీయ ప్రయోజానాల కోసం ఉపయోగిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

శాసనమండలిలో…..

నిన్న శాసనమండలిలో జరిగిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇరు పార్టీల సభ్యులు ఒకరి మీద ఒకరు దాడికి దిగబోయారంటే పరిస్థితి చేయి దాటి పోయిందని అర్థం చేసుకోవచ్చు. వైసీపీకి 151 సీట్లు ఇచ్చి ప్రజలు భారీ మెజారిటీని కట్టబెట్టారు. శాసనసభలో బలం ఉన్న వైసీపీ తన కార్యాచరణ ప్రణాళిక మేరకు బిల్లులు ఆమోదించుకుంటుంది. ఏది అత్యవసర బిల్లులో? ఏది ప్రభుత్వానికి అసవరమో నిర్ణయించుకునే అధికారం వైసీపీకి ఉందనడం కాదనలేని వాస్తవం.

పదే పదే అడ్డుకుంటుండటం…..

కాని శాసనమండలిలో బలం ఉన్న టీడీపీ ఈ బిల్లులను పదే పదే అడ్డుకుంటోంది. ద్రవ్య వినిమియ బిల్లును కూడా ఆమోదించకుండా సభ వాయిదా పడిందంటే ప్రజల సమస్యలపై ఇరు పార్టీలకూ ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పకనే తెలుస్తోంది. శాసనమండలిలో అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం పొందక పోతే ఖజానా నుంచి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా డ్రా చేసుకోలేదు. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. టీడీపీ తన బలంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఇలా వ్యవహరించిందంటున్నారు.

సహనం లేని వైసీపీ….

మరోవైపు వైసీపీ కూడా సహనం లేకుండా సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను మళ్లీ శాసన మండలి లోకి తేవడం టీడీపీకి సహజంగానే ఆగ్రహం కల్గిస్తుంది. గతంలో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినట్లు ఛైర్మన్ ప్రకటించారు. అలాగే హైకోర్టులో కూడా ప్రభుత్వం బిల్లులు సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉన్నాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ముందుగా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకుని తర్వాత ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టి ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇరు పార్టీలు పంతాలకు పోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంపై దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూాడాల్సి ఉంది.

Tags:    

Similar News