ఎప్పటికి బాగుపడేనో?

ఆంధ్రప్రదేశ్ లో అధికార విపక్షాల రాజకీయ వైరం కేంద్రానికి మంచి వెసులుబాటు నిస్తోంది. పునర్విభజన చట్టం నాటి అంశాలు అసలు చర్చకే రాని పరిస్థితి నెలకొంది. ప్రజా [more]

Update: 2020-02-04 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో అధికార విపక్షాల రాజకీయ వైరం కేంద్రానికి మంచి వెసులుబాటు నిస్తోంది. పునర్విభజన చట్టం నాటి అంశాలు అసలు చర్చకే రాని పరిస్థితి నెలకొంది. ప్రజా జీవనం, రాష్ట్రప్రగతితో సంబంధం లేని అంశాలను పట్టుకుని వేలాడుతున్న అధికార ప్రతిపక్షాల వైఖరి భారతీయ జనతాపార్టీకి లక్కీగా మారుతోంది. కేంద్ర బడ్జెట్ చర్చల సందర్భంలోనైనా ఈ పార్టీలు మేలుకోక పోతే నవ్యాంధ్రకు నష్టదాయకమే.

హోదా..సాయం..హుళక్కి…

ఆంధ్రప్రదేశ్ నిజంగానే బాధిత రాష్ట్రంగా మిగిలిపోతోంది. తాజా బడ్జెట్ లో అటు తెలంగాణకు, ఇటు ఆంద్రప్రదేశ్ కు పెద్దగా ప్రయోజనం కల్పించే అంశాలు లేవు. కానీ ఆంద్రాతో పోల్చి చూస్తే తెలంగాణ ఆర్థిక పరిస్థితులు కొంతమేరకు మెరుగ్గా ఉండటం వల్ల ఫర్వాలేదనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక హోదా సాధ్యం కాదని పదేపదే కేంద్రప్రభుత్వం తేల్చి చెబుతోంది. పార్లమెంటు సాక్షిగానే ఈవిషయాన్ని కేంద్ర మంత్రులు కుండబద్దలు కొడుతున్నారు. అదే సందర్బంలో ప్రత్యేక సాయానికి కట్టుబడి ఉన్నామన్న విషయాన్నికూడా నొక్కి చెబుతున్నారు. హోదాకు బదులుగా ప్యాకేజీకి ఒప్పుకుని అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం రాజకీయ నష్టాన్ని తెచ్చిపెట్టుకుంది. దానివల్ల రాష్ట్రానికి ఆర్థికంగా ఏం ప్రయోజనం సమకూరిందో ఆచరణలో చూపలేకపోయింది. ప్రకటించిన కేంద్రప్రభుత్వ ప్యాకేజీ ద్వారా ఇప్పటివరకూ సమకూరిన ప్రయోజనాలపైనా ప్రజలకు సమాచారం లేదు. అటు ప్రత్యేకహోదా ఎలాగూ లేదు. ఇటు ప్యాకేజీ ప్రయోజనాల సంగతీ తెలియదు. రెంటికీ చెడ్డ రేవడిగా రాష్ట్రం మిగిలిపోయిందనే అనుమానాలు బలపడుతున్నాయి. నిజానికి ప్యాకేజీ ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 90 శాతం నిధులు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్సటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులుగా విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు భవిష్యత్ చెల్లింపులనూ కేంద్రమే చేయాలి. ఈ రెండు అంశాలపైనా అధికార, విపక్షాలు దృష్టి పెడితే ఎంతో కొంత రాష్ట్రానికి మేలు చేకూరుతుంది. అసలు కేంద్ర ప్రాయోజిత పథకాల రూపంలో రాష్ట్రం పొందిన వాటా ఎంత? విదేశీ రుణ ప్రాజెక్టులను ఏమేరకు తెచ్చుకోగలిగామనే విషయాలను పక్కనపెట్టి కేవలం రాజకీయాలకే పార్టీలు పరిమితమవుతున్నాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం తామిచ్చిన హామీలపైనా ఉదాసీనంగా ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతోంది.

ఆదాయం గల్లంతు…

మరోవైపు చూస్తే రాష్ట్రం ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది. అంచనాలు తలకిందులవు తున్నాయి. డిసెంబర్ నాటికి పూర్తైన మూడు త్రైమాసికాల ఆదాయ అంచనా లక్షా డెబ్భైఎనిమిది వేల కోట్లకు గాను ఇంతవరకూ సమకూర్చుకున్నది లక్షా పన్నెండువేల కోట్లరూపాయలు మాత్రమే. ఇందులో సొంత పన్నులు, కేంద్రపన్నుల్లో వాటా, సెస్సుల మొత్తం 72 వేల కోట్లు మాత్రమే. మిగిలిన మొత్తం అప్పులు, రుణాల వసూళ్లుగా లభించిన సొమ్ము. సంక్షేమ పథకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టిస్తోంది. కానీ అభివృద్ధికి నిధుల కేటాయింపులో చిన్న రాష్ట్రాలతోనూ పోటీ పడలేకపోతోంది. తొమ్మిదినెలల కాలంలో కేవలం ఆరువేల కోట్ల రూపాయలు మాత్రమే మూలధన పెట్టుబడిగా ఖర్చు చేసిందంటే మౌలిక వసతుల రంగం దెబ్బతినే అవకాశం ఉంది. మూల ధన పెట్టుబడే భవిష్యత్తులో ఆదాయవనరుగా మారుతుంది. ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా చూడటం లేదు. నిలదీయాల్సిన తెలుగుదేశానికీ పట్టడం లేదు.

కమలం చుట్టూనే…

మూడు రాజధానులు, శాసనమండలి రద్దు వంటి విషయాలు పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నాయి. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఇంతటి కీలక విషయాల్లో అధికార విపక్షాలు ప్రతిష్టకు పోతున్నాయి. మంచి చెడ్డలు, సమకూరే ప్రయోజనాలు, వాస్తవిక దృష్టితో చర్చలకు తావివ్వడం లేదు. కేవలం పోటాపోటీ వాతావరణం ద్వారా రాజకీయంగా పై చేయి సాధించే ప్రయత్నాలే కనిపిస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం మేలు చేయదు. నిజానికి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్ర పథకాలు, విభజన చట్టం హామీల అమలు వంటి విషయాల్లో ఫైళ్లు పట్టుకుని కేంద్రం చుట్టూ తిరగాల్సిన మంత్రులు, ఎంపీలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్యం కోసం కేంద్రం చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టుకున్నారు. మండలి రద్దు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టించుకోవడం, హైకోర్టు తరలింపు విషయంలో సానుకూలత తెచ్చుకోవడం ఇప్పుడు వైసీపీకి అత్యంత ప్రాధాన్య అంశాలుగా మారాయి. ఆర్థికంగా అగచాట్లు పడుతున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాలపై పెద్దగా ఔదార్యం చూపకపోయినా ప్రస్తుతమున్న స్థితిలో అడిగే నాథుడే లేరు. నిలదీసే పార్టీయే కనిపించదు. ఎందుకంటే రాష్ట్రంలోని మూడు పెద్ద పార్టీలూ రాజకీయాల్లో మునిగితేలుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News