‌Huzurabad : హుజూరాబాద్ లో హుష్.. గప్ చిప్

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగేలా కన్పించడం లేదు. కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను ఎప్పుడు జరుపుతుందో తెలియదు. దీంతో అన్ని పార్టీలూ ప్రచారానికి [more]

Update: 2021-09-23 09:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగేలా కన్పించడం లేదు. కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను ఎప్పుడు జరుపుతుందో తెలియదు. దీంతో అన్ని పార్టీలూ ప్రచారానికి తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లే కన్పిస్తుంది. మొన్నటి వరకూ హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం కన్పించేది. అన్ని పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్లి ఓట్లను అడిగే కార్యక్రమాన్ని చేపట్టాయి. కానీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని తెలిసి రాజకీయ పార్టీలన్నీ వెనక్కు తగ్గాయి.

రోజుకు పదిహేను లక్షలు…

ఇందుకు ప్రధాన కారణం ఖర్చు తగ్గించుకోవడం కోసమే. హుజూరాబాద్ లో ప్రచారానికి రోజుకు పది నుంచి పదిహేను లక్షలు ఖర్చవుతుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ వివిధ పథకాలను ప్రకటించడంతో పాటు హుజూరాబాద్ కు చెందిన అనేక మంది ముఖ్యనేతలకు నామినేటెడ్ పదవులను కూడా కట్టబెట్టింది. మంత్రులను, ఎమ్మెల్యేలను మండలాలవారీగా ఇన్ ఛార్జులుగా నియమించారు. వీరంతా గత నెలన్నర రోజుల నుంచి వారి బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

మంత్రులు సయితం…?

ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ వెనక్కు తగ్గడంతో ఇప్పుడు మంత్రులు కూడా హుజూరాబాద్ వైపు వెళ్లడం లేదు. హరీశ్ రావు మినహా మిగిలిన మంత్రులు ఎవరూ అక్కడ కన్పించడం లేదు. చేరికలు ఉంటేనే నేతలు అక్కడకు వెళుతుండటం కన్పిస్తుంది. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీ పరిస్థితి కూడా అంతే. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పాదయాత్ర కూడా చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఆయన ప్రజలను కలసుకుని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

ఈటల తాత్కాలికంగా….

కానీ ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ ఎన్నికపై స్పష్టత లేకపోవడంతో ప్రచారానికి కొంత విరామాన్ని ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే హుజూరాబాద్ లో పర్యటించాలని ఈటల రాజేందర్ డిసైడ్ అయ్యారు. రోజు వారీ ఖర్చు పెరిగిపోతుండటం, క్యాడర్ ను మెయిన్ టెయిన్ చేయలేక ప్రధాన పార్టీలన్నీ హుజూరాబాద్ ప్రచారానికి తాత్కాలిక విరామం ప్రకటించినట్లే కనపడుతుంది.

Tags:    

Similar News