Huzurabad : విక్టరీ వారిదేనా? సర్వేలు అవే చెబుతున్నాయా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయింది. ఇక ఫలితాలు మాత్రమే రావాల్సి ఉంది. రెండు పార్టీలు ఇక్కడ బలంగా పోటీ పడ్డాయి. గెలుపు బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య [more]

Update: 2021-10-31 09:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయింది. ఇక ఫలితాలు మాత్రమే రావాల్సి ఉంది. రెండు పార్టీలు ఇక్కడ బలంగా పోటీ పడ్డాయి. గెలుపు బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య దోబూచులాడుతోంది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలపై భారీ ఎత్తున బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అధికార పార్టీ గెలుస్తుందని టీఆర్ఎస్ నేతలు ఒకటికి పది చొప్పున బెట్టింగ్ లు కాస్తుండటం విశేషం. ఓటింగ్ తమకు అనుకూలంగా ఉందని ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు.

గ్రామాల వారీగా నివేదికలు….

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, కేసీఆర్ సమర్థత హుజూరాబాద్ లో తమ గెలుపునకు దోహదం అవుతాయని టీఆర్ఎస్ భావిస్తుంది. ఖచ్చితంగా పదివేల ఓట్ల తేడాతో విజయం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ గ్రామాల వారీగా నేతలతో నివేదిక తెప్పించుకున్నారు. పోలింగ్ తర్వాత కూడా ప్రయివేటు సంస్థ చేత సర్వే చేయించుకున్న కేసీఆర్ తమదే విజయమన్న సంకేతాలను పార్టీ శ్రేణులకు పంపారు.

సర్వేలు చేయించుకుని…

దీంతో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున బెట్టింగ్ లుపెడుతున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. కొందరు భూములు సయితం బెట్టింగ్ లలో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అగ్రనేతలు ఇచ్చిన భరోసాతోనే ఈ బెట్టింగ్ లు అధికార పార్టీ నేతలు పెద్దయెత్తున పెడుతున్నారు. పెరుగుతున్న పెట్రోలుధరలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈటల రాజేందర్ పై సానుభూతి స్థానంలో ఓటర్లలో కసి పెరిగిందన్న అంచనాల్లో టీఆర్ఎస్ నేతలున్నారు.

కమలంలో ఉత్సాహం…..

మరోవైపు గెలుపుపై బీజేపీ నేతలు కూడా ధీమాగా ఉన్నారు. దళిత బంధు పథకంతో తమ పార్టీ అభ్యర్థి దశ మార్చేసిందన్న ఆనందంలో ఉన్నారు. సైలెంట్ గా తమ పార్టీకే ఓటర్లు మీట నొక్కారని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. కనీసం నాలుగైదు వేల ఓట్లతో తాము గెలుస్తామన్న ధీమాను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరి కొద్ది గంటల్లో తేలనుండటంతో బెట్టింగ్ లు ఊపందుకున్నాయి.

Tags:    

Similar News