గురుమూర్తి ఒడిసి పట్టారుగా?

తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఇటీవల ఎన్నికయిన గురుమూర్తి రాజకీయాలను గుప్పిట పట్టినట్లే కన్పిస్తుంది. గత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు చేసిన తప్పులు చేయదలచుకోలేదు. గురుమూర్తి అందరిని కలుపుకునిపోతూ, [more]

Update: 2021-05-26 08:00 GMT

తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఇటీవల ఎన్నికయిన గురుమూర్తి రాజకీయాలను గుప్పిట పట్టినట్లే కన్పిస్తుంది. గత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు చేసిన తప్పులు చేయదలచుకోలేదు. గురుమూర్తి అందరిని కలుపుకునిపోతూ, అవసరమున్నా, లేకున్నా అందరి సలహాలు తీసుకుంటూ వెళుతుండటం పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఎమ్మెల్యేకూ ఆయన టచ్ లో ఉంటూ సలహాలు కోరుతున్నారట.

ఆయనకు భిన్నంగా…?

కరోనాతో మృతి చెందిన గత పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు పై ఒక విమర్శ ఉండేది. ఆయన ఎవరిని కలుపుకుని పోయేవారు కాదని అప్పట్లో పార్టీలోనే విన్పించేవి. ఎక్కువగా గూడూరు లోనే ఉంటూ తిరుపతికి తక్కువ గా వచ్చేవారు. ఆయన తిరుపతిలో కనీసం ఎంపీ కార్యాలయాన్ని కూడా తెరవలేకపోయారు. అనేక మంది ఎమ్మెల్యేలు ఆయనను పక్కనపెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ గురుమూర్తి దీనికి భిన్నంగా వెళుతున్నారు.

వ్యక్తిగతంగా కలుస్తూ…..

గురుమూర్తి నిత్యం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో టచ్ లో ఉంటున్నారు. ఆయన చెప్పినట్లే నడుచుకుంటున్నారు. కాగా ఇటీవల ఎన్నికల్లో తన విజయానికి కష్టపడిన వారందరినీ గురుమూర్తి వరసగా కలుస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలసి కృతజ్ఞతలు తెలిపి వచ్చారు. అంతేకాదు నియోజకవర్గాల్లో తన విజయం కోసం కష్టపడిని వారందరికీ పేరుపేరునా పలకరిస్తూ గురుమూర్తి ఫోన్లు చేస్తున్నారట.

ముఖ్య నేతలను కూడా…..

కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో కలవలేకపోతున్నానని, తీవ్రత తగ్గిన తర్వాత స్వయంగా వచ్చి కలుస్తానని గురుమూర్తి వారికి చెబుతుండటం విశేషం. కరోనా తగ్గిన తర్వాత ప్రత్యేకంగా తిరుపతిలో ఎంపీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందరినీ కలుపుకుని పోతూ జగన్ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని గురుమూర్తి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద ఇతర ఎంపీలకు భిన్నంగా గురుమూర్తి వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News