ఆజాద్ ను ఇక తప్పించేసినట్లేనా?

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసిందనే అంటున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. [more]

Update: 2020-09-08 18:29 GMT

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసిందనే అంటున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలోనూ రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ తో సోనియా, రాహుల్ లు సమావేశాలు అయ్యే అవకాశాలు తక్కువగా కన్పిస్తున్నాయి. సహజంగా పార్లమెంటు సమావేశాల ప్రారంభం ముందు విపక్ష నేతలతో పార్టీ అధిష్టానం సమావేశం అయ్యే సంప్రదాయం ఉంది.

సమావేశమయ్యేందుకు కూడా….

అయితే ఈసారి మాత్రం గులాంనబీ ఆజాద్ తో సమావేశమయ్యేందుకు సోనియా, రాహుల్ విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే రాజ్యసభ, పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలను ఫైనల్ చేసేందుకు సమన్వయ కమిటీని వేసినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ ఫైనల్ చేసి అంశాలనే రాజ్యసభలో చర్చించాల్సి ఉంటుంది. గులాం నబీ ఆజాద్ ను కలిసేందుకు ఇష్టపడకనే ఈ కమిటీ నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

వైఖరి మార్చుకోకపోవడంతో….

కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష్య ఎన్నికలతో పాటు, సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలని సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీడబ్ల్యూసీ మీటింగ్ లో దీనిపై రచ్చ జరిగిప్ప్పటికీ గులాం నబీ ఆజాద్ తన వైఖరిని మార్చుకోలేదు. మరో లేఖ రాయడం కూడా చర్చనీయాంశమైంది. ఇలాగే కొనసాగితే మరో యాభై ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ గేలానికి….

ఈ నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ ను పార్టీలో పూర్తిగా దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుంది. కపిల్ సిబాల్ వంటి నేతలు మౌనంగా ఉన్నా ఆజాద్ మాత్రం రెచ్చి పోవడం వెనక బీజేపీ ఉందని కాంగ్రెస్ అధిష్టానం అనుమానిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఉండటంతో ఆజాద్ కు బీజేపీ గాలం వేసిందని, అందులో గులాం నబీ ఆజాద్ చిక్కుకున్నారని కాంగ్రెస్ కు సమాచారం అందినట్లు చెబుతున్నారు. అందుకే గులాం నబీ ఆజాద్ ను పూర్తిగా దూరం పెట్టాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చింది.

Tags:    

Similar News