అవంతికి నెక్ట్స్ ఎవరు?… వైసీపీలో బిగ్ డిబేట్‌

అధికార వైసీపీలో విశాఖప‌ట్నం నుంచి కేవలం ఒకే ఒక్క మంత్రి ఉన్నారు. ఆయ‌నే అవంతి శ్రీనివాస్‌. టీడీపీ నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన [more]

Update: 2020-05-23 05:00 GMT

అధికార వైసీపీలో విశాఖప‌ట్నం నుంచి కేవలం ఒకే ఒక్క మంత్రి ఉన్నారు. ఆయ‌నే అవంతి శ్రీనివాస్‌. టీడీపీ నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్‌ అనూహ్యంగా జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి పీఠాన్ని అందిపుచ్చుకున్నారు. అదృష్టం అంటే అవంతి శ్రీనివాస్ దే. 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న త‌ర్వాత ఆ పార్టీ కాంగ్రెస్‌లో క‌ల‌వ‌డంతో అధికారం అనుభ‌వించారు. ఆ త‌ర్వాత 2014లో టీడీపీలోకి జంప్ చేసి అన‌కాప‌ల్లి ఎంపీగా గెలిచి మ‌ళ్లీ అధికార పార్టీలో ఉన్నారు. త‌ర్వాత గంటాతో ఏర్పడిన విబేధాల నేప‌థ్యంలోనే ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీలోకి జంప్ చేసేశారు. అవంతి శ్రీనివాస్‌ భీమిలి నుంచి గెలిచి మంత్రి అయ్యారు. ముందుగానే జ‌గ‌న్ చెప్పిన‌ట్టు రెండున్నరేళ్ల త‌ర్వాత‌.. మంత్రుల‌ను మార్చి కొత్తగా వేరేవారిని నియ‌మిస్తే.. విశాఖ నుంచి ఎవ‌రు ఉండే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది.

జగన్ కు సన్నిహితుడిగా…

ఈ క్రమంలోనే అన‌కాప‌ల్లి నుంచి విజ‌యం సాధించిన గుడివాడ అమ‌ర్ నాధ్ పేరు పెద్దగా వినిపిస్తోంది. ఈయ‌న యువ‌కుడు, ఉత్సాహ వంతుడు, కాపు సామాజిక వ‌ర్గంలో మంచి పేరు తెచ్చుకున్న నేత‌. అదే స‌మ‌యంలో అమ‌ర్నాథ్‌ జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు నమ్మక‌స్తుడు కూడా. ఇక‌, తండ్రి వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అమ‌ర్‌నాథ్‌.. అవంతి విద్యాసంస్థల్లోనే చ‌దువుకున్నారు. అనంత‌రం, వైసీపీలో చేరి.. 2014లో అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ప‌ట్టు వీడ‌కుండా వైసీపీని నిల‌బెట్టేందుకు ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే జ‌గ‌న్ కు స‌న్నిహితుడుగా మారారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు పార్టీ జిల్లా, రూర‌ల్ ఇంచార్జ్‌గా కూడా ప‌ద‌వులు నిర్వహించారు.

ఎప్పటి నుంచో కుటుంబం…

అంద‌రినీ క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. అన‌కాప‌ల్లి నుంచి గెలిచినా.. నివాసం మాత్రం న‌గ‌రంలోని గాజువాక నియోజ‌క‌వ‌ర్గంలోనే., అయినా కూడా ఎక్కడా ఎలాంటి వివాదాల‌కూ తావు లేకుండా అమ‌ర్ నాధ్ దూసుకుపోతున్నారు. జిల్లా కాపుల్లో అమ‌ర్ నాధ్ కు మంచి ప‌ట్టు దొరికేసింది. ముప్పయ్యేళ్లుగా గుడివాడ కుంటుంబం రాజ‌కీయాల్లో ఉండడంతో… ఉన్నత విలువ‌లు పాటిస్తూ ఉండ‌డంతో జ‌గ‌న్ అమ‌ర్‌నాథ్‌ను న‌మ్ముతున్నారు. ఈ క్రమంలో అమ‌ర్‌నాథ్‌కు ఖ‌చ్చితంగా మంత్రి ప‌దవి ఇస్తార‌నే అంటున్నారు. జ‌గ‌న్ కూడా హామీ ఇచ్చార‌ని ప్రచారం జ‌రుగుతోంది. అమ‌ర్ నాధ్ యువ‌కుడు కావ‌డం కూడా క‌లిసి రానుంది.

ఏదో ఒక పదవి మాత్రం…

ఆయ‌న‌కు సామాజిక స‌మీక‌ర‌ణ‌లు కుద‌ర‌ని ప‌క్షంలో రెండేళ్ల త‌ర్వాత అయినా కాపు కార్పొరేష‌న్ చైర్మన్ ప‌ద‌వి ఇవ్వడం ఖాయ‌మ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విప్‌గా, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అదే స‌మ‌యంలో పార్టీ ని ముందుకు న‌డిపించ‌డంలోనూ అమ‌ర్ నాధ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పైగా ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, వైసీపీలోనే ఉండి.. పార్టీలో పుల్లలు పెడుతున్నార‌నే విమ‌ర్శలు ఎదుర్కొంటున్న దాడి వీర‌భ‌ద్రరావు ఫ్యామిలీని కూడా అమ‌ర్‌నాథ్ గ‌ట్టిగా ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం నేప‌థ్యంలో అమ‌ర్‌నాథ్ జ‌గ‌న్ స‌హా పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవ‌హారాల ఇంచార్జ్‌, ఎంపీ విజ‌యసాయిరెడ్డి ద‌గ్గర కూడా అమ‌ర్‌నాథ్ మంచి మార్కులు వేయించుకున్నారు. దీంతో ఆయ‌నకు ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌విలేదా.. కాపు కార్పొరేష‌న్ వంటి కేబినెట్ హోదా ఉన్న ప‌ద‌వి ద‌క్కడం ఖాయమ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News