గుడివాడ.. ఏంటి గడబిడ…?

భజన చేసే వారితో అదే బాధ. వారు చేసే అతితో ఒక్కోసారి మతి కూడా పోతుంది. విశాఖ జిల్లాకు చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ తీరు [more]

Update: 2021-02-19 02:00 GMT

భజన చేసే వారితో అదే బాధ. వారు చేసే అతితో ఒక్కోసారి మతి కూడా పోతుంది. విశాఖ జిల్లాకు చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ తీరు కూడా అలాగే ఉందని అంటున్నారు. ఆయన జగన్ కి ఇష్టుడు. అంతే కాదు విజయసాయిరెడ్డికి ప్రియ శిష్యుడు. ఇపుడు ఆయన వారి ముందు మరిన్ని మంచి మార్కులు కొట్టేయాలని చేస్తున్న ప్రయత్నంలో అసలుకే ఎసరు పెడుతున్నారా అన్న చర్చ సాగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో జగన్ కి ఉన్న చిత్తశుద్ధిని గట్టిగా చెబుతూనే ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టే ప్రయత్నం గుడివాడ అమరనాధ్ చేస్తున్నారు అంటున్నారు.

మోడీని ఎదిరిస్తారా…?

ఏపీలో రెండేళ్ల పాలన జగన్ పూర్తి చేసుకుంటున్నారు. అంతకు ముందు విపక్ష నేతగా అయిదేళ్ల పాటు జగన్ ఉన్నారు. ఏ సమయంలోనూ కూడా ఆయన ప్రధాని మోడీని పల్లెత్తు మాట అనలేదు. ప్రత్యేక హోదా నుంచి ఏ పెద్ద సమస్య వచ్చినా కూడా నాటి సీఎం చంద్రబాబునే ఆయన ఘాటుగా విమర్శించేవారు. ఇపుడు ఆయన కీలకమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. మరి ఆయన మోడీని ఎదిరించే మొనగాడు అంటూ గుడివాడ అమరనాధ్ చెప్పడం కొంత ఇబ్బందికరమైన పరిణామంగానే ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. సోనియానే ఎదిరించిన జగన్ కి మోడీ ఒక లెక్క కాదు అన్నట్లుగా గుడివాడ అమరనాధ్ చేస్తున్న కామెంట్స్ హాట్ హాట్ గా ఉన్నాయి.

బాబు మాదిరిగానే …..?

బీజేపీ నేతల గురించి వారి రివెంజ్ తీరు గురించి తెలిసిన వారు ఎవరూ ఎదురు నిలవలేరు. పైగా ఏపీ పూర్తిగా కేంద్రం మీద ఆధారపడి ఉంది. ఇంకా ఎన్నో రకాలుగా కేంద్ర సాయం ఏపీకి అవసరం ఉంది. ఇక జగన్ నాడు సోనియాను ఎదిరించినపుడు ఉన్న పరిస్థితులు వేరు. ఇపుడు ఉన్న పరిస్థితులు వేరు. జగన్ వైఖరి చూసిన వారు ఎవరూ కూడా ఆయన అంత తొందరగా తొడగొట్టి ఢిలీకి సవాల్ చేస్తారు అని భావించరు. కానీ గుడివాడ అమరనాధ్ మాటలు చూస్తే బీజేపీకి జగన్ కి మధ్య మంటలు పెట్టేలా ఉన్నాయని సొంత పార్టీ నేతలే అంటున్నారు. బీజేపీతో నేరుగా ఢీ కొంటే బాబు ఏలుబడి మాదిరిగానే ఏపీ ఇబ్బందులు పాలు అవుతుందని కూడా విశ్లేషిస్తున్నారు.

కమలం కన్నెర్ర…..

ఇక అసలే ఏపీ బీజేపీ నేతలు జగన్ అంటే గట్టిగానే విరుచుకుపడతారు. స్టీల్ ప్లాంట్ సమస్య మీద వారు క‌క్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారు. ఈ సమయంలో గుడివాడ అమరనాధ్ మాటలు వారికి గట్టిగానే తగులుకుంటున్నాయి. జగన్ కి మోడీ ఒక లెక్క అన్నట్లుగా గుడివాడ చేస్తున్న అతి హడావుడి అటు ఇటూ తిరిగి ఏకంగా జగన్ మెడ‌కే చుట్టుకునేలా ఉందని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. బీజేపీ పెద్దలకు ఈ విషయాలు కనుక చేరితే రాజకీయ ముప్పేనని కూడా రెండు పార్టీలోనూ చర్చగా ఉందిట. అయినా ఎంత వరకూ మాట్లాడాలి. ఏది మాట్లాడాలి అన్న ఆలోచన లేకుండా అధినేత భజన చేయాలనుకుంటే ఇలాంటి చేదు పరిణామాలే ఎదురవుతాయని అంటున్నారు.

Tags:    

Similar News