దాడి వర్సెస్ గుడివాడ… లోక‌ల్ వ‌ర్సెస్ నాన్ లోక‌ల్ ?

విశాఖ జిల్లా వైసీపీలో లుకలుకలు బయటపడిపోతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటడంతో మనసులో ఉన్న అసంతృప్తి నాయకుల గొంతులో నుంచి నోటి ద్వారా అలా వచ్చేస్తోంది. [more]

Update: 2021-07-20 03:30 GMT

విశాఖ జిల్లా వైసీపీలో లుకలుకలు బయటపడిపోతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటడంతో మనసులో ఉన్న అసంతృప్తి నాయకుల గొంతులో నుంచి నోటి ద్వారా అలా వచ్చేస్తోంది. మరో వైపు చేతలకు కూడా దిగుతున్నారు. ఒకరిని ఒకరు తొక్కేందుకు కూడా ఇప్పటినుంచే వ్యూహ రచన చేస్తున్నారు. అలా కనుక చూసుకుంటే విశాఖ రూరల్ జిల్లాగా, పొలిటికల్ గా చైతన్యవంతమైన ప్రాంతంగా పేరున్న అనకాపల్లి అసెంబ్లీలో రాజకీయ రచ్చ మామూలుగా లేదనే చెప్పాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ అమరనాధ్ ఎవరినీ అసలు ఖాతరు చేయరని టాక్ ఉంది. అయితే ఆయన ఇటు జగన్‌ను, అటు విజయసాయిరెడ్డిని మచ్చిక చేసుకుంటూ తన రాజకీయ హవా కొనసాగిస్తున్నారు.

అనకాపల్లి సీటు…

నిజానికి అనకాపల్లి సీటు గవర సామాజిక వర్గానిదే అని ఒక బలమైన అభిప్రాయం ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఇతర సామాజిక వర్గాలకు కూడా జై కొడుతోంది. అలా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి కాపుల మద్దతుతో గెలిచారు ఆ తరువాత మళ్లీ పదేళ్ళకు గుడివాడ అమరనాధ్ ఇక్కడ నుంచి వైసీపీ తరఫున నెగ్గారు. అయితే ఆయన గెలుపు వెనక గవర సామాజికవర్గం మొత్తం దన్నుగా నిలిచింది. మద్దతు ఇచ్చింది. కానీ గెలిచిన తరువాత గుడివాడ అమరనాధ్ ఆ వర్గాన్ని అసలు పట్టించుకోవడంలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి.

దాడి కుటుంబం….

మాజీ మంత్రి దాడివీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ ఈ సీటు మీద కన్నేశారు. అందుకే 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. కానీ అప్పటికే గుడివాడ అమరనాధ్‌కి కన్ ఫర్మ్ చేయడం వల్ల జగన్ ఏం చేయలేకపోయారు. నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అని రత్నాక‌ర్‌కి చెప్పారు. అదే ర‌త్నాక‌ర్ 2014లో ఇదే అన‌కాప‌ల్లి సీటు ఆశించారు. అయితే అప్పుడు జ‌గ‌న్ ర‌త్నాక‌ర్‌కు విశాఖ నార్త్ సీటు ఇచ్చారు. అన‌కాప‌ల్లి సీటును గ‌వర వ‌ర్గానికే చెందిన కొణ‌తాల రామ‌కృష్ణుడి సోద‌రుడికి ఇచ్చారు. ఇక జ‌గ‌న్ నెక్ట్స్ టైం బెట‌ర్ ల‌క్ అన‌డంతో …ఆ టైమ్ ఇపుడు తనకు వస్తోంది అని రత్నాకర్ భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అయితే గుడివాడ అమరానాధ్ మాత్రం తాను ఈ సీటు ఖాళీ చేసేది లేదు అంటున్నారు. అంటే 2024లో కూడా ఇక్కడ నుంచే పోటీకి ఆయన దిగడానికి రెడీ అవుతున్నారు.

నాన్ లోకల్ అంటూ….

అయితే గుడివాడ అమరనాధ్ నాన్ లోకల్ అని వైసీపీ నేతలే ఇపుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన గాజువాక వాసి అని… పోటీ చేస్తే సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి కానీ అనకాపల్లికి వలస వచ్చి రాజకీయాలు చేస్తామంటే కుదరదు అంటున్నారు. అమ‌ర్‌నాధ్ ఉండేది కూడా గాజువాక‌లోనే. దీంతో దాడి వర్సెస్ గుడివాడ అన్నట్లుగా అనకాపల్లి రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఇక ఇద్దరూ కూడా పార్టీ కార్యక్రమాలను విడిగానే నిర్వహిస్తున్నారు. ఆధిపత్య పోరుకు తెర లేపుతున్నారు ఈ వివాదం కనుక పెచ్చుమీరితే ఈ సీటు వైసీపీకి గోవిందా అన్న మాట అయితే ఉందిపుడు.

Tags:    

Similar News