ఈ జెయింట్ కిల్లర్‌ను జ‌గ‌న్ గుర్తిస్తాడా..?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి పార్టీ ప‌రంగా అనేక చిక్కులు త‌లెత్తుతున్నాయి. జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చాలా మంది నేత‌ల‌కు కావాల్సిన‌న్ని హామీలు ఇచ్చేశారు. పార్టీ కోసం [more]

Update: 2020-08-12 14:30 GMT

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి పార్టీ ప‌రంగా అనేక చిక్కులు త‌లెత్తుతున్నాయి. జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చాలా మంది నేత‌ల‌కు కావాల్సిన‌న్ని హామీలు ఇచ్చేశారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్న నేత‌ల‌ను ప‌క్కన పెట్టేసి చాలా మంది కొత్త నేత‌ల‌కు సీట్లు ఇవ్వడంతో పాత నేత‌ల‌కు, సీనియ‌ర్లకు, సీట్లు త్యాగం చేసిన వారికి ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వక త‌ప్పని ప‌రిస్థితి. అదే టైంలో మండ‌లి ర‌ద్దు విష‌యంలో జ‌గ‌న్ బ‌ల‌మైన నిర్ణయంతో ఉండ‌డంతో చాలా మంది ఆందోళ‌న‌లో ఉన్నారు. త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్యత్తు ఉంటుందా ? లేదా ? అన్న త‌ర్జన భ‌ర్జన‌లు ప‌డుతున్నారు. ఇక పార్టీ త‌ర‌పున రెండు నుంచి నాలుగైదు సార్లు గెలిచిన సీనియ‌ర్ ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి ప‌ద‌వులు లేకుండా ఆశ నిరాశ‌ల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ లిస్టులో రాయ‌ల‌సీమ‌కు చెందిన 20 మంది సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఉన్నారంటే అక్కడ ప‌ద‌వుల కోసం పోటీ ఎలా ఉందో అర్థమ‌వుతోంది.

పవన్ ను ఓడించి….

ఈ వ‌రుస‌లోనే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నుంచి మ‌రో సీనియ‌ర్ నేత‌గా కూడా జ‌గ‌న్ త‌న‌ను ప‌ట్టించుకుంటాడా ? మ‌ంత్రి ప‌ద‌వి వ‌స్తుందా ? త‌న క‌ష్టానికి.. తాను గెలిచిన గెలుపున‌కు ప్రతిప‌లం ద‌క్కుతుందా ? అని ఆశ నిరాశ‌ల్లో కొట్టుమిట్టాడుతున్నారు. భీమ‌వ‌రం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గ‌త ఎన్నిక‌ల్లో జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంధి 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయాడు. అయినా అక్కడ పార్టీ ఆవిర్భావం నుంచి ప‌టిష్టం చేయ‌డంతో పాటు గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను ఓడించి సంచ‌ల‌నం సృష్టించాడు. జిల్లాలో బ‌లంగా ఉన్న కాపు వ‌ర్గం నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఓ కేబినెట్ బెర్త్ వీరికి ఉంటోంది.

కాపు సామాజికవర్గానికి…

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొత్తప‌ల్లి సుబ్బారాయుడు, చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య లాంటి ఉద్దండులు మంత్రులు అయ్యారు. కాంగ్రెస్ హ‌యాంలో వ‌ట్టి వ‌సంత్‌కుమార్ మంత్రి అవ్వగా… గ‌త ప్రభుత్వంలో బీజేపీ కోటాలో పైడికొండల మాణిక్యాల‌రావు మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఇదే కాపు వ‌ర్గం నుంచి ఆళ్ల నాని మంత్రిగాను, ఉప ముఖ్యమంత్రిగాను జ‌గ‌న్ కేబినెట్ లో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన‌ప్పుడే ప‌వ‌న్‌ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ కి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అనుకున్నారు. అయితే జ‌గ‌న్ అనూహ్యంగా ఆళ్ల నాని వైపు మొగ్గు చూపారు. నానికి అంత‌కు ముందు ఎమ్మెల్సీ కూడా ఇచ్చిన జ‌గ‌న్ ఇప్పుడు మంత్రి ప‌ద‌వితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు.

కులసమీకరణల్లో భాగంగా…..

త‌ర్వాత జ‌రిగే మార్పులు, చేర్పుల్లో త‌న‌కు ప‌వ‌న్ ఓడించడంతో పాటు కుల స‌మీక‌ర‌ణ‌ల్లో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని గ్రంధి శ్రీనివాస్ బ‌లంగా న‌మ్ముతున్నా.. అప్పటి వ‌ర‌కు ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వి అయినా ఇవ్వాల‌ని జిల్లా ప‌రిశీల‌కుల దృష్టికి, ఇన్‌చార్జ్ మంత్రి దృష్టికి ప‌దే ప‌దే తీసుకు వెళుతున్నారు. నామినేటెడ్ ప‌ద‌వి విష‌య‌మై గ్రంధి శ్రీనివాస్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ప‌దే ప‌దే ట్రై చేస్తున్నా అపాయింట్‌మెంట్ రావ‌డం లేద‌ని కూడా భీమ‌వ‌రం పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ప్రచారం జ‌రుగుతోంది. ఒక‌ప్పుడు దూకుడు రాజ‌కీయాల‌కు పెట్టింది పేరుగా ఉన్న గ్రంధి శ్రీనివాస్.. ఈ సారి మాత్రం త‌న‌పై ఆ మ‌చ్చ లేకుండా ముందుకు వెళుతున్నారు. మ‌రోవైపు ఎమ్మెల్యేగా గెలిచి యేడాది అవుతున్నా నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి విష‌యంలో ఆయ‌న అంత చురుకుగా కూడా ఉండ‌లేక‌పోత‌న్నారు.

మరో ఈక్వేషన్ కూడా…

గ్రంధి శ్రీనివాస్ ఆశ‌లు ఎలా ఉన్నా మ‌రో యేడాది త‌ర్వాత ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చే విష‌యంలో మ‌రో ఈక్వేష‌న్ కూడా ఆయ‌న‌కు అడ్డు త‌గులుతోంది. భీమ‌వ‌రం ప‌క్కనే ఉన్న న‌ర‌సాపురం నుంచి మ‌రో సీనియ‌ర్ నేత ముదునూరి ప్రసాద‌రాజు కూడా మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నారు. జ‌గ‌న్ ఫ‌స్ట్ ప్రయార్టీ ప్రసాద‌రాజుకే అన‌డంలో డౌట్ లేదు. ఈ ఈక్వేష‌న్స్ నేప‌థ్యంలో ఈ జెయింట్ కిల్లర్ గ్రంధి శ్రీనివాస్ ఆశ‌లు ఎంత వ‌ర‌కు నెర‌వేర‌తాయో ? చూడాలి.

Tags:    

Similar News