గౌరు ఫ్యామిలీ ప్లేట్ ఎందుకు ఫిరాయిస్తోంది..?

తెలుగుదేవం పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎంపీలను చేర్చుకుంటూ వరుస షాక్ లు ఇస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. కర్నూలు [more]

Update: 2019-02-23 03:30 GMT

తెలుగుదేవం పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎంపీలను చేర్చుకుంటూ వరుస షాక్ లు ఇస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో ఆ పార్టీకి చెందిన కీలక నేత గౌరు వెంకట్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వైఎస్సార్ కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. రెండుమూడు రోజుల్లో ఈ మేరకు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటిస్తారని, వచ్చే నెల 6వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పాణ్యం నుంచి గౌరు చరిత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. పాణ్యంలో గట్టి పట్టున్న కాటసాని కాంగ్రెస్ ను వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా 60 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన ఆయన ఏడాది క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాటసాని రాకతో మారిన సీన్

కాటసాని చేరిక వరకు పాణ్యం నియోజకవర్గ వైసీపీలో గౌరు దంపతులది ఏకఛత్రాధిపత్యం ఉండేది. అయితే, కాటసాని చేరిన తర్వాత వారికి పోటీ మొదలైంది. దీంతో పాణ్యం వైసీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఎవరికి వారు టిక్కెట్ తమకే దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ బలంగా ఉన్న ఇక్కడ ఇద్దరూ కలిస్తే విజయం సులువవుతుంది. కానీ, ఆ పరిస్థితి కనిపించ లేదు. రాంభూపాల్ రెడ్డిని కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటుకు పోటీ చేయిస్తారని ప్రచారం జరిగినా ఆయన ఎమ్మెల్యే పోటీ చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే ఓవైపు గౌరు చరిత, మరోవైపు రాంభూపాల్ రెడ్డి ఎవరికి వారు ప్రత్యేకంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వైఎస్సార్ అంటే అభిమానం…

కాటసాని రాక తర్వాత పార్టీలో తమకు ప్రాధాన్యం తగ్గిందని, పాణ్యం టిక్కెట్ విషయమై జగన్ నుంచి స్పష్టమైన హామీ దక్కకపోవడంతో గౌరు దంపతులు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గౌరు చరిత సోదరుడు శివానంద రెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఆయన చాలారోజులుగా వీరిని టీడీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అంటే గౌరు దంపతులకు అభిమానం. ముందునుంచీ వారు వైఎస్ కుటుంబం వెంటే నడిచారు. కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా పార్టీ మారిన గౌరు దంపతులు మాత్రం జగన్ తోనే ఉన్నారు. కష్టకాలంలో వైఎస్ తమకు అండగా ఉన్నారని వారు విశ్వాసంగా ఉన్నారు. జగన్ కూడా కర్నూలు జిల్లా పార్టీ వ్యవహారాల్లో గౌరు దంపతులకు మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. మరి, టిక్కెట్ వ్యవహారం వైసీపీకి గౌరు దంపతులను దూరం చేసేలా ఉంది. అయితే, వీరిని వైసీపీ వదులుకోదని, ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు వీరిని బుజ్జగించే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News