నొక్కుతున్నారు…లొంగిపోతారనేనా?

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను అన్ని విధాలుగా కట్టడి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తమ మాట వినకుండా పార్టీలో చేరకపోవడంతో ఆయనపై కక్ష [more]

Update: 2020-08-26 03:30 GMT

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను అన్ని విధాలుగా కట్టడి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తమ మాట వినకుండా పార్టీలో చేరకపోవడంతో ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. గొట్టిపాటి రవికుమార్ ఈ వత్తిళ్లకు తలొగ్గుతారా? లేక ధైర్యంగా నిలచి ప్రభుత్వంపై పోరాడతారా? అన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గొట్టిపాటి రవికుమార్ ను లొంగదీసుకునేందుకు జరిగే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన క్వారీల లీజును రద్దు చేశారన్న టాక్ బలంగా విన్పిస్తుంది.

హ్యాట్రిక్ విజయాలతో…..

గొట్టి పాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకుని అప్రతిహత విజయాలతో ముందుకు వెళుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనపై తొలి నుంచి వత్తిళ్లు ప్రారంభమయ్యాయి. మంత్రి బాలినేనికి గొట్టిపాటి రవికుమార్ సన్నిహితుడు కావడంతో ఆయన వైసీపీలోకి వస్తారని ఊహించారు. కానీ రాకపోవడంతో ఆయన చిరకాల ప్రత్యర్థి కరణం బలరాంను వైసీీపీలో చేర్చుకున్నారు.

వైసీపీలోకి వెళ్లకూడదని…..

దీంతో అప్పటి వరకూ ఊగిసలాటలో ఉన్న గొట్టిపాటి రవికుమార్ వైసీపీలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అయితే ఆయనను ఆర్థికంగా నష్టపర్చేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలో ప్రపంచంలోనే అరుదైన గ్రానైట్ నిక్షేపాలున్నాయి. చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్ క్వారీలు గొట్టిపాటి రవికుమార్ కు కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయి. దీంతో తొలుత వందల కోట్ల రూపాయలు పెనాల్టీని మైనింగ్ శాఖ విధించింది. అయితే గొట్టిపాటి రవికుమార్ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులను తెచ్చుకున్నారు.

అందుకే కక్ష సాధింపు…..

కానీ తాజాగా గొట్టిపాటి రవికుమార్, అతని సన్నిహితులకు చెందిన 11 క్వారీల లీజును ప్రభుత్వం రద్దు చేసింది. మరో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు క్వారీని కూడా రద్దు చేసింది. క్వారీల నిర్వహణలో నియమ నిబంధనలు ఉల్లంఘించేనందుకు క్వారీలను రద్దు చేస్తున్నామని మైనింగ్ శాఖ ప్రకటించింది. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావులతో మాట్లాడారు. లీజుల రద్దుపై హైకోర్టును ఆశ్రయించాలని గొట్టిపాటి రవికుమార్ భావిస్తున్నారు. మొత్తం మీద గొట్టిపాటి రవికుమార్ ను లొంగదీసుకోవాలని చేసిన ప్రయత్నాలు వికటించడంతో ఆర్థికంగా కట్టడి చేయాలన్నది వైసీపీ నేతల యత్నంగా కన్పిస్తుంది.

Tags:    

Similar News