Goa : వాళ్లే మళ్లీ కీలకంగా మారతారా?

అతి చిన్న రాష్ట్రమైన గోవా ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో ఐదు నెలలు మాత్రమే ఎన్నికలకు గడువు ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ గోవా వైపు చూస్తున్నాయి. దాదాపు [more]

Update: 2021-11-09 16:30 GMT

అతి చిన్న రాష్ట్రమైన గోవా ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో ఐదు నెలలు మాత్రమే ఎన్నికలకు గడువు ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ గోవా వైపు చూస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీలూ ఇక్కడ ప్రభావం చూపుతాయనే అనుకోవాలి. గోవా పై మహారాష్ట్ర పార్టీలు ప్రభావం చూపనున్నాయి. అలాగే ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు కూడా ఇక్కడ ఎంతో కొంత ప్రభావితం చేస్తాయి. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ ఆరు శాతం ఓట్లను సాధించడం విశేషం.

జాతీయ పార్టీలదైనా….?

అయితే గోవాలో జాతీయ పార్టీల హవాయే ఎక్కువగా నడుస్తుంది. కాంగ్రెస్, బీజేపీలలో ఏదో ఒక ప్రభుత్వం ఇక్కడ ఏర్పడుతుండటం సంప్రదాయంగా వస్తుంది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదనిపిస్తోంది. గోవాలో మొత్తం నలభై అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, శివసేన, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బరిలోకి దిగుతున్నాయి.

స్వతంత్ర అభ్యర్థులే కీలకం….

ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు సయితం ప్రభావం చూపుతారు. గోవాలో ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వీరిని ప్రభావితం చేయడం చాలా సులువు. తమకు అందుబాటులో ఉండే వారినే వారు ఎన్నుకుంటారు. అందుకే గోవాలో స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారతారు. ఈసారి కూడా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది బరిలోకి దిగే అవకాశముంది.

ప్రచారం ముమ్మరం…

ఎన్నికలకు ఇంకా ఐదు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారాన్ని కూడా అన్ని పార్టీలూ ప్రారంభించాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే పర్యటించారు. మమత బెనర్జీ మూడు రోజుల పాటు అక్కడే మకాం వేశారు. కేంద్ర మంత్రులు సయితం గోవాలో తరచూ పర్యటస్తుండటంతో ఇప్పటికే అక్కడ ఎన్నికల వేడి అలుముకుంది. హామీల వర్షం కూడా జోరుగా కురుస్తుంది. చిన్న రాష్ట్రమైన గోవాలో ఈసారి ఏ ప్రభుత్వం ఏర్పడనుందన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News