గిడ్డికి ఇక అంతా గడ్డుకాలమేనా?

గిడ్డి ఈశ్వరి ఒకటిన్నర ఏడాది సంయమనం పాటించి ఉంటే ఇప్పుడు మంత్రి అయ్యేవారు. కానీ ఆమె వేసిన ఒకే ఒక రాంగ్ స్టెప్ రాజకీయ భవిష్యత్తును దూరం [more]

Update: 2020-09-09 06:30 GMT

గిడ్డి ఈశ్వరి ఒకటిన్నర ఏడాది సంయమనం పాటించి ఉంటే ఇప్పుడు మంత్రి అయ్యేవారు. కానీ ఆమె వేసిన ఒకే ఒక రాంగ్ స్టెప్ రాజకీయ భవిష్యత్తును దూరం చేసింది. గిడ్డి ఈశ్వరి టీచర్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. మంచి మాటకారి. సమర్థవంతమైన నేత. పార్టీ కోసం కష్టపడి పనిచేసే తత్వం ఆమె సొంతం. ఇవన్నీ గిడ్డి ఈశ్వరికి 2014లో పాడేరు నియోజకవర్గం విజయం సాధించిపెట్టాయి. వైసీపీ నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వరి దూకుడుగా ఉంటారన్న పేరుంది.

పార్టీలో ఫైర్ బ్రాండ్ గా…..

జగన్ పార్టీలో ఉన్నప్పుడు బాక్సౌట్ తవ్వకాలకు వ్యతిరేకంగా జరిపిన సభలో చంద్రబాబు తలనరుకుతానంటూ గిడ్డి ఈశ్వరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి గిడ్డి ఈశ్వరి ఇంకా ఎన్నికలకు ఒకటిన్నర ఏడాది సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి మారిపోయారు. టీడీపీ ఆపరేషన్ లో భాగంగా గిడ్డి ఈశ్వరి పార్టీ మారారు. అదే ఆమె చేసిన తప్పు. ఆమె వైసీపీలో కొనసాగి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా మంత్రి అయ్యేవారు.

గెలిస్తే మంత్రి గ్యారంటీ…..

పాడేరు నియోజకవర్గం నుంచి గతంలో గెలిచిన మణికుమారి తెలుగుదేశం పార్టీలో మంత్రి అయ్యారు. అలాగే అక్కడి నుంచే గెలిచిన బాలరాజుకు సయితం కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవి దక్కింది. ఇదే సమయంలో గిడ్డి ఈశ్వరికి కూడా మంత్రి పదవి దక్కేది. అయితే గిడ్డి ఈశ్వరి ఇప్పుడు పాడేరు నియోజకవర్గంలో ఎటూ కాకుండా పోయారు. టీడీపీ కూడా గిడ్డి ఈశ్వరిని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనికి కారణం అక్కడ టీడీపీ క్యాడర్ గిడ్డి ఈశ్వరిని వ్యతిరేకిస్తుండటమే.

ఇప్పుడు ఒంటరి అయి…..

ప్రస్తుతం గిడ్డి ఈశ్వరితో వైసీపీ నుంచి వచ్చిన క్యాడర్ కూడా తిరిగి వెళ్లిపోయింది. ఇక తాజాగా టీడీపీలోని అధికశాతం మంది కార్యకర్తలు గిడ్డి ఈశ్వరిని వదిలేసి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. దీంతో గిడ్డి ఈశ్వరి ఒంటరి అయిపోయారంటున్నారు. ఇటు టీడీపీ క్యాడర్ సహకరించక, అటు తనతో వచ్చిన వాళ్లు తిరిగి వైసీపీలోకి వెళ్లడంతో గిడ్డి ఈశ్వరి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అదే నియోజవకర్గంలో టీడీపీ నేత మణికుమారి తిరిగి పుంజుకుంటుండటంతో గిడ్డి ఈశ్వరికి గడ్డురోజులు ప్రారంభమయినట్లేనని అంటున్నారు.

Tags:    

Similar News