గంటా మనసు మారిందా? మరో వ్యూహంతో?

ఆగస్ట్ నెల అంటే టీడీపీకి గుండెల్లో గుబులు. దానికి తగినట్లుగా ఈసారి ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని అంతా అంచనా వేశారు. ఆగస్టులో విశాఖ రాజధానికి [more]

Update: 2020-08-13 06:30 GMT

ఆగస్ట్ నెల అంటే టీడీపీకి గుండెల్లో గుబులు. దానికి తగినట్లుగా ఈసారి ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని అంతా అంచనా వేశారు. ఆగస్టులో విశాఖ రాజధానికి పునాది రాయి పడుతుందని, అదే నెలలో విశాఖలోని టీడీపీ బిగ్ షాట్స్ వైసీపీలో చేరుతారని కూడా ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన మందీ మార్బలం తీసుకుని వైసీపీ వైపుగా వస్తారని కూడా అంతా అనుకున్నారు. అయితే ఈ మధ్యన జరిగిన కొన్ని పరిణామాల నేపధ్యంలో గంటా శ్రీనివాసరావు రాకకు పెద్ద బ్రేకులు పడిపోయాయి.

రెడ్ సిగ్నల్…….

విశాఖలో జరుగుతున్న ప్రతీ పరిణామం జగన్ దృష్టిలో ఉంది. రాజకీయంగా గంటా వస్తే లాభం ఎంత, నష్టం ఎంత అన్నీ కూడా ఆయన తూకమేసి మరీ చూసుకుంటున్నారని అంటున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు సొంత మేనల్లుడు మీద భూ కబ్జా కేసులు నమోదు కావడంతో జగన్ ఆలోచనలు మారాయని కూడా అంటున్నారు. మరో వైపు గంటా రావద్దు అంటూ మంత్రి అవంతి అనుచరులు నిర్వహించిన ఆందోళనలు, తన సన్నిహితుడు విజయసాయిరెడ్డి సైతం అలక బూననడం వంటివి పరిగణనలోకి తీసుకున్న జగన్ ఇంత రిస్క్ చేసి గంటా శ్రీనివాసరావును తీసుకోవడం ఇపుడు అర్జంటుగా అవసరమా అన్న ఆలోచన కూడా చేశారని భోగట్టా. దాంతో గంటాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, చివరి నిముషంలో సీన్ మొత్తం మారిందని కూడా అంటున్నారు.

బీజేపీ వైపేనా…?

ఇక గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారన్నది టీడీపీలో అందరికీ తెలిసిపోయింది. ఆయన ఇపుడు టీడీపీలో ఉన్నా కూడా మునుపటి వాతావరణం ఉండదని కూడా తెలుసు. దానికి తోడు గంటానే టీడీపీలో ఇమడలేకపోతున్నారని అంటున్నారు. వైసీపీలో చేరాలని గంటా శ్రీనివాసరావు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ అవి చివరికి ఫలితాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో గంటా చూపు బీజేపీ వైపు పడిందని తాజాగా వినిపిస్తున్న మాట. బీజేపీకి కూడా గంటా లాంటి బిగ్ షాట్ అవసరం ఉందని అంటున్నారు. ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైన నేతగా ఉన్న గంటా వస్తే భారీ ఎత్తున అనుచరగణం కూడా కమలం పార్టీలోకి వచ్చి చేరుతుందని కూడా అంచనా వేస్తున్నారు. దీనివల్ల మూడు జిల్లాల్లో కూడా పార్టీ బలపడుతుందని లెక్కలు కడుతున్నారు.

సోము చొరవతో….

చాలా కాలం క్రితం సోము వీర్రాజు ఒక సాధారణ ఎమ్మెల్సీగా ఉన్న వేళ విశాఖ వచ్చినపుడు స్వయంగా గంటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి కొంత సేపు చర్చలు జరిపారు. బయటకు వస్తూనే రాజకీయ నాయకుల మధ్య రాజకీయమే ఉంటుంది. అదే మాట్లాడాను అని కూడా మీడియాకు చెప్పేశారు. నాడే గంటా శ్రీనివాసరావు బీజేపీ వైపు వెళ్తారని అనుకున్నారు. ఇపుడు అదే సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఏపీలో ఉన్న కాపు దిగ్గజాలను ఒక చోటకు చేరుస్తున్నారు. కాపులకు ఇపుడు కాకపోతే మరెప్పుడూ అవకాశం రాదు అని కూడా అంటున్నారు. 2024 నాటికి ఏపీలో కాపు శక్తి నిరూపించుకోవాలన్నదే సోము నినాదంగా ఉంది. బీజేపీ వంటి జాతీయ పార్టీ అవకాశం ఇస్తున్నపుడు వాడుకోవాలని కూడా ఆయన కాపు రాజకీయ నేతలకు హిత బోధ చేస్తున్నారుట. ఇక గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన వియ్యంకుడు నారాయణ కూడా బీజేపీలోకి వస్తారని, మరో వియ్యంకుడు భీమవరం మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరుతారని వినిపిస్తోంది. మొత్తానికి బీజేపీ గేలానికి గంటా శ్రీనివాసరావు చిక్కుతున్నారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News