గంటా చేరికకు అతి పెద్ద బ్రేక్ ?

టీడీపీ నుంచి వైసీపీలో చేరుదామని అంతా సర్దుకుంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనూహ్యంగా పెద్ద బ్రేక్ పడిపోయింది. ఆయన సొంత మేనల్లుడు మీద భూ కబ్జా [more]

Update: 2020-08-09 05:00 GMT

టీడీపీ నుంచి వైసీపీలో చేరుదామని అంతా సర్దుకుంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనూహ్యంగా పెద్ద బ్రేక్ పడిపోయింది. ఆయన సొంత మేనల్లుడు మీద భూ కబ్జా కేసు విశాఖ పోలీస్ స్టేషన్ లో నమోదు అయింది. దాంతో ఇపుడు గంటా శ్రీనివాసరావు ఒక్కసారిగా చిక్కుల్లో పడ్డారు, విశాఖతో పాటు, భీమిలీలో పలు చోట్ల గంటా అనుచరులు భూముల దందా చేశారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటి మీద చంద్రబాబు సిట్ విచారణ జరిపించారు, కానీ నివేదిక బయటపెట్టలేదు, ఇక జగన్ సైతం కొత్తగా సిట్ వేశారు, దాని సంగతీ ఏమీ తెలలేదు. ఈ నేపధ్యంలో గంటా హయాంలో జరిగిన భూదందాల గురించి అంతా మరచిపోయారనుకుంటున్న వేళ సడెన్ గా గంటా సొంత మేనల్లుడి మీదనే తాజాగా పోలీసులు కేసు నమోదు చేయ‌డంతో గంటా శ్రీనివాసరావు శిబిరం చిక్కుల్లో పడినట్లు అయింది.

వికలాంగుల భూమే స్వాహా …..

ఏకంగా వికలాంగుల భూమి మీదనే గంటా శ్రీనివాసరావు బ్యాచ్ కన్ను పడిందని పోలీసుల కేసులో తేలింది. సిటీకి గుండె కాయలా మారుతున్న మధురవాడలో 1991లో నాటి ప్రభుత్వం వికలాంగుల కోసం పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలో వారు ఇళ్ళు కట్టుకోలేదు, దాంతో ఆ భూములు అలా పడి ఉన్నాయి. వాటి మీద కన్ను పడిన గంటా శ్రీనివాసరావు అనుచరులు ఆయన మంత్రిగా ఉన్నపుడు నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మరీ తమ భూములుగా రాయించుకున్నారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. దాని మీద వికలాంగ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో డొంక అంతా కదిలింది. ఈ కేసులో ఏకంగా గంటా శ్రీనివాసరావు మేనల్లుడు విజయ్ బాబు ఉండడమే ఇపుడు గంటాకు ఇబ్బందిగా మారింది. గంటా మేనల్లుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో విశాఖలో రాజకీయంగా కలకలం రేపుతోంది.

స్కెచ్ వేశారా…?

నిజానికి ఈ భూముల కబ్జా కధ అంతా భీమిలీ నియోజక‌వర్గం పరిధిలోకి వస్తుంది. అక్కడి ఎమ్మెల్యే, గంటా శ్రీనివాసరావును వ్యతిరేకిస్తున్న మంత్రి అయిన అవంతి శ్రీనివాస్ మాస్టర్ స్కెచ్ గీసి మరీ గంటా గ్యాంగ్ ని పట్టించారని అంటున్నారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గంటా శ్రీనివాసరావును వైసీపీలోకి తీసుకోవడానికి రెడీ అవుతున్న వేళ మాటలతో కాదు చేతలతోనే నిజం రుజువు చేయాలని మంత్రి భావించారా అన్న అనుమానాలు కూడా వైసీపీలోనే చాలా వరకూ వస్తున్నాయి. ఇపుడు గంటా బ్యాచ్ కక్కలేక మింగలేక అన్నట్లుగా సీన్ ఉంది.

నో చెబుతారా …?

జగన్ తన విశాఖ పాదయాత్రలో ప్రధానంగా రాజకీయ బాణాలు ఎక్కుపెట్టింది అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు మీదనే. అది కూడా ఆయన భూకబ్జాల మీదనే. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవన్నీ కక్కిస్తామని కూడా చెప్పారు. ఇక విపక్ష నేతగా విశాఖలో భారీ ఆందోళలను కూడా భూ దందాల మీద జగన్ చేశారు, అంతే కాదు,అధికారంలోకి వస్తూనే విశాఖ భూ కుంభకోణాల మీదనే సిట్ వేశారు. ఇన్ని చేసిన తరువాత జగన్ రాజకీయాల‌ కోసం గంటా శ్రీనివాసరావును వైసీపీలోకి తీసుకువస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు రాకను విజయసాయిరెడ్డి సహా మంత్రి అవంతి గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇపుడు భూ దందా బయటపడడంతో జగన్ గంటా విషయంలో నో చెబుతారా అన్న చర్చ సాగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News