ఏడాది ముందే చూపుతారట.. ?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పెదవి విప్పినా విప్పకపోయినా రాజకీయాల్లో ఆయన మార్క్ అలాగే చూపిస్తారు. పదవిలో ఉన్నా లేకున్నా కూడా ఆయన [more]

Update: 2021-06-18 02:00 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పెదవి విప్పినా విప్పకపోయినా రాజకీయాల్లో ఆయన మార్క్ అలాగే చూపిస్తారు. పదవిలో ఉన్నా లేకున్నా కూడా ఆయన హవా అలాగే ఉంటుంది. ఇది కానికాలమని, కరోనా కాలమని గంటా శ్రీనివాసరావు గత ఏడాదిన్నరగా ఇంటి గడప దాటడంలేదు. అంతకు ముందు చూసినా అయన రాజకీయంగా పెద్దగా అలికిడి చేసింది లేదు. టీడీపీ ఓడిపోయాక ఆయన తన కార్యకలాపాలను పూర్తిగా తగ్గించేశారు. ఇక పెద్దబాబు విశాఖ వచ్చినా చినబాబు వైజాగ్ టూర్లు చేసినా కూడా గంటా శ్రీనివాసరావు మాత్రం గమ్మున ఉంటున్నారు తప్ప ఎక్కడా కలసి కనిపించడంలేదు.

వ్యూహాత్మకంగానే …?

గంటా శ్రీనివాసరావు ఇపుడు సౌండ్ చేస్తే అధికారంలో వైసీపీ సర్కార్ ఉంది. దాంతో అటు నుంచి కేసులు అంటూ కధ మొదలవుతుంది, ఎందుకొచ్చిన తంటా అనే వ్యూహాత్మకంగానే అలా ఉన్నారని అంటున్నారు. ఆ మధ్యన ఆయనకు చెందిన అక్రమ భూములు అంటూ రెవిన్యూ అధికారులు కొన్ని స్వాధీనం చేసుకుంటే కోర్టుకు వెళ్ళి స్టే తీసుకువచ్చారు. ఆ మీదట ఆయన చడీ చప్పుడు లేకుండా ఉంటున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు అతి ముఖ్య అనుచరుడు, రియల్టర్ అయిన కాశీనాధ్ వైసీపీలోకి చేరినా ఆయన మాత్రం తన రూట్ ఏంటి అన్నది చెప్పకుండానే మౌనం పాటిస్తున్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల ముందు మాత్రం తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచి తీరుతుందని అన్నారు కానీ అది జరగలేదు. దాంతో గంటా శ్రీనివాసరావు పూర్తిగా మౌన ముద్ర దాల్చారు.

రాజీనామా ఏమైందో …?

మరో వైపు చూస్తే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తారన్న వార్తలకు స్పందించి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామా ఏమైందో కూడా ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. మధ్యలో ఒకసారి స్పీకర్ తమ్మినేని సీతారామ్ ని ఆయన ఇంటికి వెళ్ళి మరీ గంటా కలిశారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు. కానీ అది ఇప్పటికీ అలాగే పెండింగులో ఉంది. మొత్తానికి చూస్తే గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. టీడీపీని ఆయన పల్లెత్తు మాట అనడంలేదు. అలాగని ఆ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడడమూ లేదు. పైగా చంద్రబాబు అంటే తనకు అపారమైన గౌరవమని కూడా ప్రకటిస్తూ ఉంటారు.

చిరుతోనేనా…?

ఇక మెగాస్టార్ చిరంజీవితో గంటా శ్రీనివాసరావు అనుబంధం ప్రత్యేకమైనది. అది రాజకీయాలకు అతీతమైనది అని కూడా చెబుతారు. ఈ మధ్య చిరంజీవి అభిమాని ఒకరు గోదావరి జిల్లాల్లో కరోనాతో ఇబ్బంది పడితే చిరంజీవి ఫోన్ కాల్ తో గంటా శ్రీనివాసరావు స్పందించి ఆ అభిమానికి చేయాల్సిన సాయమంతా చేశారు. ఆ విధంగా ఒక్క మెగా కాల్ కి గంటా అలెర్ట్ అయి స్పందించిన తీరు చూసిన వారికి ఆయన చిరంజీవికి బాగా టచ్ లో ఉన్నారనే అనిపిస్తుంది. అయితే చిరంజీవి రాజకీయాల్లో లేరు. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేనలో ఉన్నా గంటా శ్రీనివాసరావు ఆ వైపు చూడడంలేదు. ఇక వైసీపీలో చేరేదీ లేనిదీ కూడా ఆయన నోరు తెరచి చెప్పరు. పార్టీ మారితే నేనే చెబుతాను కదా అంటారు తప్ప తాను టీడీపీలోనే ఉంటాననీ పూర్తి క్లారిటీ ఇవ్వరు. మొత్తానికి గంటా శ్రీనివాసరావు ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయనగానే తనదైన రాజకీయం చూపిస్తారు అంటున్నారు. అంతదాకా ఆయమ మౌన మునిగానే ఉంటారట.

Tags:    

Similar News