గంటా రెస్పాన్స్ లేకపోవడం… దానికే సంకేతమా?

రాజకీయాలు అంటే అంతేనేమో. ఇక్కడ ఏ ఎమోషన్ బయట పడాలన్నా కూడా తూకం రాళ్ళు దగ్గర పెట్టుకోవాలేమో, దేని బరువు ఎంత, విలువ ఎంత, రాజకీయ లాభం [more]

Update: 2020-07-28 08:00 GMT

రాజకీయాలు అంటే అంతేనేమో. ఇక్కడ ఏ ఎమోషన్ బయట పడాలన్నా కూడా తూకం రాళ్ళు దగ్గర పెట్టుకోవాలేమో, దేని బరువు ఎంత, విలువ ఎంత, రాజకీయ లాభం నష్టం ఎంత అన్న లెక్కలు చూసుకుంటారేమో. లేకపోతే తన సన్నిహితుడు, టీడీపీ సానుభూతిపరుడు అయిన నలందా కిషోర్ హఠాత్తుగా ఈ మధ్య చనిపోయారు. ఆయన అకాల మరణం మీద మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు కనీసంగా స్పందించిన‌ట్లుగా ఎక్కడా కనిపించలేదు. ఇదే నలందా కిషోర్ ని సీఐడీ అధికారులు గత నెలలో అరెస్ట్ చేశారు. అపుడు ఆయన్ని చూసేందుకు ఏకంగా సీఐడీ ఆఫీస్ దాకా గంటా వచ్చారు. నాడు మీడియాలో ఆయన చేసిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. తనను రాజకీయంగా ఏమైనా చేసుకోండి కానీ తన సన్నిహితులను బాధించడం దేనికి అంటూ గంటా శ్రీనివాసరావు జగన్ సర్కార్ మీద గట్టిగానే ఆవేశపడ్డారు. నలందా కిషోర్ అమాయకుడు అని కూడా సర్టిఫికేట్ ఇచ్చారు.

ఎందుకిలా …?

పోలీసులు విచారణకు తీసుకెళ్తేనే మండిపోయిన గంటా శ్రీనివాసరావు ఇపుడు తన సన్నిహితుడు ఈ లోకం నుంచే వెళ్ళిపోయారు అన్న వార్త తెలిస్తే ఎంతలా తల్లడిల్లాలి. ఆయన మనసు ఎంతలా కన్నీరు పెట్టాలి. అసలు కిషోర్ ఎవరో సంబంధమే లేని నర్సాపురం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే రాజు గారు అది పోలీస్ హత్య అని హాట్ కామెంట్స్ చేశారు. ఇది వైసీపీ సర్కార్ హత్య అని చంద్రబాబు, లోకేష్ రాజకీయ బాణాలు ఎక్కుపెట్టారు. వారందరి కంటే సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు నోటి వెంట మాత్రం ఈ మాటలు రాకపోవడం ఆశ్చర్యకరమేనని అంటున్నారు. నిజంగా గంటా ఎందుకు ఇలా చేశారన్నది కూడా ఒక చర్చగా ఉంది.

అదేనా కారణం…?

గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితం ఇపుడు నాలుగు రోడ్ల జంక్షన్లో ఉంది. ఆయన వైసీపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే ఇపుడు వైసీపీ మీద కిషోర్ వ్యవహారంలో నోరు చేసుకుంటే తన రాజకీయ ప్రవేశానికి అదే పెద్ద బ్రేక్ గా మారుతుందని గంటా శ్రీనివాసరావు భావించారా అన్న చర్చ కూడా ఉంది. నలందా కిషోర్ ని వైసీపీ టార్గెట్ చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. తాను కూడా అదే రూట్లో వెళ్తే కచ్చితంగా వైసీపీలో గేట్లు పడిపోతాయి. అదే విధంగా ఏమీ చెప్పకపోయినా కూడా తప్పే అవుతుంది. అందుకే గంటా శ్రీనివాసరావు తనదైన రాజకీయ వ్యూహం ప్రకారమే మౌనాన్ని ఆశ్రయించారని అంటున్నారు.

సంకేతమా…?

గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తారు అని ఒక వర్గం అంటూంటే రారు అని మరో వర్గం టీడీపీలోనే అంటోంది. ఇపుడు కిషోర్ విషయంలో గంటా శ్రీనివాసరావు సైలెన్స్ మాత్రం కొత్త సంకేతాలను అందించాయని చెబుతున్నారు. గంటాకు నిజంగా వైసీపీలోకి వెళ్లాలనిపించకపోతే ఈ పాటికి కిషోర్ మరణాన్ని ఆయుధంగా చేసుకుని విశాఖలో రాజకీయ రచ్చకు తెరలేపేవారని కూడా అంటున్నారు. గంటా శ్రీనివాసరావు అలా చేయకపోవడం ద్వారా వైసీపీని ఇబ్బంది పెట్టదలచుకోలేదన్న సందేశాన్ని పంపారని చెబుతున్నారు. మొత్తానికి గంటా వైసీపీలోకి రావాలనుకుంటున్నారు అన్న దానికి ఇది నిదర్శనంగా పేర్కొంటున్నారు. అదే సమయంలో గంటా చేరిక వచ్చే నెల అంటే ఆగస్ట్ 15న ఉండవచ్చునని కూడా డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ లోగా ఎన్ని పరిణామాలు జరుగుతాయో.

Tags:    

Similar News