పాపాల భైరవుడు గంటాయేన‌ట ?

మొత్తానికి విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి అసలైన కారణం తెలుగుదేశం తమ్ముళ్ళు కనిపెట్టేశారు. చంద్రబాబుకు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఎంతటి మనస్థాపాన్ని కలిగించాయో తెలిసిందే. ఆయన [more]

Update: 2021-04-03 13:30 GMT

మొత్తానికి విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి అసలైన కారణం తెలుగుదేశం తమ్ముళ్ళు కనిపెట్టేశారు. చంద్రబాబుకు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఎంతటి మనస్థాపాన్ని కలిగించాయో తెలిసిందే. ఆయన ఏపీలో విశాఖ, విజయవాడ, గుంటూరు కార్పోరేషన్ల మీద పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఇక్కడే తన మొత్తం ప్రచారాన్ని నిర్వహించారు. మిగిలిన రెండూ దారుణమైన నంబర్లతో అధికారానికి ఆమడ దూరంలో ఉంటే విశాఖ మాత్రం టఫ్ ఫైట్ నడిచింది. దాంతో కొంచెం కష్టపడితే విశాఖ మేయర్ కచ్చితంగా టీడీపీకే దక్కేది అని ఫలితాలను చూసిన తరువాత తమ్ముళ్ళకు అర్ధమైంది.

మండిపోయిన బాబు….

విశాఖలో తానూ, కుమారుడు లోకేష్ కూడా వరసపెట్టి ప్రచారం చేస్తే కనీసమాత్రంగా కూదా పట్టించుకోని నాయకుల తీరుపై అధినేత చంద్రబాబు మండిపోతున్నారుట. విశాఖలో టీడీపీ ఓటమికి కారకులు ఎవరో తనకు తెలియచేయాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా భోగట్టా. దీంతో విశాఖ తమ్ముళ్ళు అన్నీ శోధించి చివరికి తేల్చింది ఏంటి అంటే తామంతా బాగా కష్టపడ్డామని, మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం అసలు ఎన్నికలను పట్టించుకోలేదని. ఇలా విశాఖ పార్టీ నాయకులు గంటా శ్రీనివాసరావును దోషిగా నిలబెడుతూ బాబుకు ఫిర్యాదు పంపారని తెలుస్తోంది.

అది నిజమేనా…?

విశాఖ సిటీలో సామాజికవర్గం పరంగానే కాదు, ఆర్ధికంగా రాజకీయంగా బలమున్న నేత గంటా శ్రీనివాసరావు. ఆయన కార్పొరేషన్ ఎన్నికల వేళ తొంగి చూడలేదు, వంగి వాలలేదు ఆయన కనుక తలచుకుంటే తన ఉత్తర నియోజకవర్గంలో కనీసం సగం సీట్లు అయినా టీడీపీకి తెచ్చేవారు అని అంటున్నారు. అలా టీడీపీ బలం పెరిగి వైసీపీ బలం తగ్గిపోయి మేయర్ సీటుకు టీడీపీ చేరువ అయ్యేదని అంటున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు కనుక పూనుకుని ఉంటే మిగిలిన చోట్ల కూడా టీడీపీ అభ్యర్ధులకు అన్ని విధాలుగా అండదండలు దక్కేవని కూడా చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు కాడి వదిలేయడంతోనే ఉత్తరంలో వైసీపీ మొత్తం 17 వార్డులకు గానూ 15 గెలుచుకుని మొనగాడు అనిపించుకుంది అంటున్నారు.

యాక్షన్ ఉంటుందా…?

గంటా శ్రీనివాసరావు లాంటి నేత మీద విశాఖ తమ్ముళ్ళు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన పార్టీలో ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కూడా అందులో పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. కానీ చంద్రబాబు గంటా శ్రీనివాసరావు లాంటి బిగ్ షాట్ మీద యాక్షన్ కి సిద్ధపడతారా. అది కూడా టీడీపీ అన్ని విధాలుగా కుదేల్ అయిన ఈ సమయంలో పెద్ద నాయకుడి మీద కొరడా ఝలిపించగలరా అన్నది పెద్ద డౌట్. మరో మూడేళ్ళలో ఎన్నికలు జరిగితే నాడు గంటాతో టీడీపీకి పని ఉంటుంది. ఆయన్ని ఇపుడు కేవలం మేయర్ సీటు కోసమని దూరం చేసుకుంటే రాజకీయంగా నష్టపోతామన్న ఆలోచన కూడా హై కమాండ్ కి ఉండే ఉంటుంది. పైగా గంటా శ్రీనివాసరావు ఏపీ వ్యాప్తంగా తన సామాజికవర్గం వారిని బాగానే కూడగడతారు అన్న చర్చ ఉంది. మొత్తానికి విశాఖ లో టీడీపీ ఓటమిని గంటాను బాధ్యుడిని చేసినా హై కమాండ్ నుంచి కఠిన చర్యలు ఆశించలేమని తమ్ముళ్ళే అనడం విశేషం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News