జగన్ జాతకం తెలిసిపోయిందా..?

రాజకీయాల్లో జాతకాలు చెప్పేవారు చాలా మంది ఉంటారు. అందులో రాజకీయాల్లో తలపండిన వారే ఎక్కువ మంది ఉంటారు. వారికి పురిట్లో సంధి కొట్టుకుపోయే పార్టీ ఏదో పది [more]

Update: 2021-03-05 02:00 GMT

రాజకీయాల్లో జాతకాలు చెప్పేవారు చాలా మంది ఉంటారు. అందులో రాజకీయాల్లో తలపండిన వారే ఎక్కువ మంది ఉంటారు. వారికి పురిట్లో సంధి కొట్టుకుపోయే పార్టీ ఏదో పది కాలాల పాటు నిలిచే పార్టీ ఏదో కూడా పక్కా క్లారిటీగా తెలుస్తుంది. ఇక ఒక పార్టీ అధికారంలోకి వచ్చే సీన్ ఉంటే కూడా ఆ లక్షణాలు వారికి బాగా కళ్లకు అగుపిస్తాయి. ఆలాంటి రాజకీయ జాతకాలు వేసే వారిలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముందు వరసలో ఉంటారు. ఆయన టీడీపీ 2019 ఎన్నికల్లో ఓడిపోతుందని ముందే ఊహించారు. అయితే అన్నీ తెలిసి కూడా వేరే దారి లేక ఆ మునిగే పడవలో తాను కూడా ఉండి మునిగిపోయారు.

క్లారిటీ వచ్చిందా…?

గంటా శ్రీనివాసరావు తాజా తీరు చూస్తే చాలు ఏపీలో రాజకీయం మారుతుంది అని కచ్చితంగా చెప్పవచ్చు. ఆయన గత ఇరవై నెలల వైసీపీ పాలనను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. జగన్ సంక్షేమం వరకూ ఓకే కానీ అభివృద్ధి అన్నది అసలు లేదు. మరో వైపు చూసుకుంటే జగన్ పాలనకు ఎన్నో అవరోధాలు అడ్డంకులూ కూడా ఎదురవుతున్నాయి. కనీసం చంద్రబాబు హయాంలో జరిగినట్లుగా కేంద్ర సాయం కూడా రాష్ట్రానికి అందడంలేదు. ఇక జగన్ అప్పులు చేసి ఏపీని పోషిస్తున్నారు. ఆ అప్పులు కూడా ఇక పుట్టవు అని తెలుస్తోంది. దీంతో జగన్ సర్కార్ కి ముందుంది ముసళ్ల పండుగ అని గంటా శ్రీనివాసరావు సరిగ్గా అంచనా వేస్తున్నారు అనుకోవాలేమో.

టీడీపీ వైపు ….

గంటా శ్రీనివాసరావు ఇన్నాళ్ళకు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అయిందని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఒక మాట అన్నారు. తాను టీడీపీని వీడిపోవడం లేదని. అంటే ఏపీలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఏదో ఆయనలో ఉండి ఉండాలి. అందుకే ఆయన జీవీఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్ధులను గెలిపించడానికి చూస్తున్నారు. మేయర్ పీఠం టీడీపీదే కావాలి అని కూడా గంటా శ్రీనివాసరావు గట్టిగా కోరుకుంటున్నారు.

చాన్నాళ్ళ తరువాత….

ఇక మాజీ మంత్రి నోట చాన్నాళ్ల తరువాత చంద్రబాబుని వెనకేసుకుంటూ ఒక మాట వినిపించింది. ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా చేసే ఏ పోరుకైనా చంద్రబాబు సహకరిస్తారు అని గంటా శ్రీనివాసరావు బాబు పక్షాన భేషైన మాట చెప్పేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి కూడా ఉందని ఆయన అంటున్నారు. అయితే లీడ్ తీసుకోవాల్సింది మాత్రం జగన్ అని ఆయన ముఖ్యమంత్రిని కార్నర్ చేస్తున్నారు. జగన్ కనుక నాయకత్వం వహిస్తే పోరాటం ఎలాంటి సహకారం కావాలన్నా కూడా బాబు అందిస్తారు అని చెప్పడం ద్వారా బంతిని తెలివిగా ఇపుడు వైసీపీ కోర్టులో వేశారు. ఇది నిజంగా బాబుకు ఆనందం కలిగించే విషయమే. మొత్తానికి చూస్తే గంటా శ్రీనివాసరావుకు వైసీపీ సర్కార్ రాజకీయ పోకడల మీద నమ్మకం తగ్గిందని అంటున్నారు. అందుకే ఆయన అలా కావాలానే టీడీపీ స్టాండ్ తీసుకున్నారు అని చెబుతున్నారు. చూడాలి మరి ఈ మాజీ మంత్రి మునుముందు ఏ రకమైన వైఖరితో సాగుతారో.

Tags:    

Similar News